GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌కు..!

  • సాయి సుదర్శన్-గిల్ మెరుపులతో 229 పరుగుల భారీ స్కోరు
  • లక్ష్య ఛేదనలో తడబడిన రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్
  • నాలుగు వికెట్లతో మ్యాచ్‌ను మలుపుతిప్పిన రషీద్ ఖాన్
  • 77 పరుగుల భారీ విజయంతో టాప్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్
Gt

Gt

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) తమ జోరును కొనసాగిస్తోంది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ (RR) తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించి ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానానికి చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (55), శుభ్‌మన్ గిల్ (84) పవర్‌ప్లేలోనే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడి భారీ స్కోరుకు పునాది వేశారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (37 పరుగులు) , రాహుల్ తెవాటియా మెరుపులు మెరిపించడంతో గుజరాత్ స్కోరు 229కి చేరింది.

230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (36 పరుగులు) వేగంగా ఆడి ఆశలు రేకెత్తించినప్పటికీ, సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ (3), షిమ్రాన్ హెట్మెయర్ (6) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. రవీంద్ర జడేజా (38 పరుగులు) కాసేపు పోరాడినా రాజస్థాన్‌ను ఓటమి నుంచి తప్పించలేకపోయారు.

గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. తన 4 ఓవర్లలో కేవలం 33 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు తీసి రాజస్థాన్ పతనాన్ని శాసించాడు. చివర్లో జేసన్ హోల్డర్ వరుస వికెట్లు తీయడంతో రాజస్థాన్ రాయల్స్ 152 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో వెనుకబడింది. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలు సాధించిన రాజస్థాన్, ఇప్పుడు టాప్-4లో నిలవాలంటే రాబోయే మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.