ఇటీవల ఐర్లాండ్తో టీ20 సిరీస్ కోల్పోయిన భారత్.. ఇప్పుడు ఇంగ్లండ్తో టీ20 సిరీస్ను కోల్పోయింది. ఈ ఘోర పరాజయాల తర్వాత భారత క్రికెట్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వరుసగా రెండో టీ20 సిరీస్ను కోల్పోవడంతో ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బంది పనితీరుపై కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవితవ్యంపై కూడా చర్చ జరుగుతోందని బీసీసీఐ వర్గాల సమాచారం.
బీసీసీఐతో గౌతమ్ గంభీర్ ఒప్పందం 2027 వరకు ఉంది. అయితే ఇటీవలి ఫలితాల నేపథ్యంలో ఆయన కోచింగ్పై బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ నాలుగో మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఓడి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఎంపిక, జట్టు కాంబినేషన్, వ్యూహాలపై బోర్డు సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్-2026 విజేతగా నిలిచిన భారత్కు ఇది వరుసగా రెండో టీ20 సిరీస్ పరాజయం. ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్ చేతిలో కూడా భారత్ 2-0తో సిరీస్ను కోల్పోయింది. ఐర్లాండ్పై భారత జట్టు తొలిసారి సిరీస్ ఓడిపోవడం అప్పుడే విమర్శలకు దారితీయగా.. ఇప్పుడు ఇంగ్లండ్ చేతిలో కూడా సిరీస్ కోల్పోవడంతో ఒత్తిడి మరింత పెరిగింది.
2026 టీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ను సారథిగా నియమించిన తర్వాత భారత్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. కొత్త కెప్టెన్సీ, కొత్త కాంబినేషన్లు ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయాలపై కూడా సమీక్ష చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంగ్లండ్ సిరీస్ ఓటమి తర్వాత హెడ్ కోచ్ భవితవ్యంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ నిర్వహించే సమీక్షలో జట్టు భవిష్యత్ వ్యూహాలు, కోచింగ్ వ్యవస్థ, ఆటగాళ్ల ఎంపిక వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చూడాలి మరి బీసీసీఐ ఏమైనా షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటుందో.

