BCCI-Team India: గౌతమ్‌ గంభీర్, శుభ్‌మన్‌ గిల్‌ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్‌ వేసిన బీసీసీఐ!

India 2027 World Cup

India 2027 World Cup

BCCI Master Plan for 2027 World Cup: 2027 వన్డే ప్రపంచ కప్‌ కోసం టీమిండియా ఇప్పటి నుంచే సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. ఈ మెగా టోర్నీ ప్రధానంగా దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులకు ముందుగానే అలవాటు పడేందుకు భారత జట్టు మేనేజ్‌మెంట్‌ కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాతో ప్రత్యేకంగా వన్డే సిరీస్‌ నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం భారత జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌, హెడ్ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరి నుంచి వచ్చిన ప్రత్యేక విజ్ఞప్తి మేరకే బీసీసీఐ.. క్రికెట్‌ సౌతాఫ్రికాతో చర్చలు ప్రారంభించినట్లు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. 2027 ప్రపంచ కప్‌కు ముందు దక్షిణాఫ్రికాలోనే భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్‌ నిర్వహించాలన్నది ఈ ప్రతిపాదనగా తెలుస్తోంది. ఈ సిరీస్‌లో నాలుగు నుంచి ఆరు వన్డేలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్‌ 2027 తర్వాత భారత జట్టు పర్యటనలను బీసీసీఐ ఇంకా పూర్తిగా ఖరారు చేయలేదు. దీంతో ఫ్యూచర్‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు అవసరమైన సమయాన్ని కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రపంచకప్‌ జరిగే దేశంలోనే ముందుగా ఆడటం ద్వారా ఆటగాళ్లకు అక్కడి పిచ్‌లు, వాతావరణం, పరిస్థితులపై మంచి అవగాహన వచ్చే అవకాశం ఉంది.

ప్రపంచ కప్‌ సన్నాహాల్లో భాగంగా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కూడా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. టోర్నీ సమయానికి ప్రతి ఆటగాడు పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉండేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. భారత జట్టు స్ట్రెంగ్త్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ అడ్రియన్‌ లే రూక్స్‌ ఇప్పటికే ఆటగాళ్ల కోసం ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ఫిట్‌నెస్‌ ప్రణాళికపై ఆటగాళ్ల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ను కూడా బీసీసీఐ నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆహ్వానించినట్లు సమాచారం. ఆటగాళ్ల దృక్కోణాన్ని గిల్‌ ద్వారా తెలుసుకుని.. మేనేజ్‌మెంట్‌, బీసీసీఐ, సపోర్ట్‌ స్టాఫ్‌ మధ్య ఎలాంటి కమ్యూనికేషన్‌ గ్యాప్‌ లేకుండా చూడాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఫిట్‌నెస్‌పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇద్దరూ భారత జట్టు కీలక ఆటగాళ్లు కావడంతో.. ప్రపంచ కప్‌ సమయానికి వారు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా వర్క్‌లోడ్‌, ఫిట్‌నెస్‌ నిర్వహణపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంది. 2027 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో ముందస్తుగా వన్డే సిరీస్‌ ఆడటంతో పాటు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టడం ద్వారా మెగా టోర్నీకి పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని చూస్తోంది.