CWG 2026: కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొడుతున్న భారత్.. 39 పతకాలతో టాప్-4లోకి ఇండియా!

Cwg 2026 Medal Tally

Cwg 2026 Medal Tally

CWG 2026 Medal Tally: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో పతకాల పంట పండుతోంది. ముఖ్యంగా బాక్సింగ్‌లో భారత బాక్సర్లు చరిత్ర సృష్టిస్తూ ఏకంగా 10 పతకాలు సాధించారు. దీంతో భారత్ మొత్తం 39 పతకాలతో పతకాల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. భారత్ ఖాతాలో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు చేరాయి. రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హాకీ వంటి సాంప్రదాయ క్రీడలు ఈసారి లేకపోయినా.. భారత క్రీడాకారులు ఇతర విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ దేశానికి గర్వకారణంగా నిలిచారు.

భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను అందించింది. మహిళల 48 కిలోల విభాగంలో అద్భుత ప్రదర్శనతో స్వర్ణం కైవసం చేసుకుంది. అంతకుముందు పారా పవర్‌లిఫ్టింగ్‌లో జండూ కుమార్ కాంస్య పతకం సాధించి ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచాడు. పారా అథ్లెటిక్స్‌లో శర్మిలా ధంకర్, దిలీప్ గవిత్, సోమన్ రాణా స్వర్ణ పతకాలు సాధించగా.. జూడోలో అస్మితా దే, హర్ష్ సింగ్ బంగారు పతకాలు గెలిచి భారత్‌కు విజయాలు అందించారు.

బాక్సింగ్‌లో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. మహిళల విభాగంలో ప్రీతి పవార్, జాస్మిన్ లాంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఘంఘాస్, అరుంధతి చౌదరి స్వర్ణ పతకాలు సాధించారు. పురుషుల విభాగంలో సచిన్ సివాచ్, అంకుష్ పంఘాల్ గోల్డ్ మెడల్స్ గెలిచి భారత పతకాల సంఖ్యను మరింత పెంచారు. రజత పతకాల విభాగంలో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో సీజన్ బెస్ట్ 85.83 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచాడు. లాంగ్ జంప్‌లో మురళీ శ్రీశంకర్, ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్, హైజంప్‌లో సర్వేశ్ కుషారే, వెయిట్‌లిఫ్టింగ్‌లో రిషికాంత్ సింగ్, ముత్తుపాండి రాజా, జ్ఞానేశ్వరి యాదవ్, హర్జిందర్ కౌర్, లవ్‌ప్రీత్ సింగ్, అజయ బాబు రజత పతకాలు సాధించారు.

కాంస్య పతకాలలో యశ్వీర్ సింగ్ జావెలిన్ త్రోలో, తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్‌లో, గుల్వీర్ సింగ్ 5000 మీటర్ల పరుగులో, సెల్వ ప్రభు ట్రిపుల్ జంప్‌లో, సీమ కలిరమణ డిస్కస్ త్రోలో, బింద్యారాణి దేవి వెయిట్‌లిఫ్టింగ్‌లో, శిల్పా శైలా పారా అథ్లెటిక్స్‌లో, ఉన్నతి శర్మ జూడోలో, జండూ కుమార్ పారా పవర్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకాలు గెలిచారు. ముఖ్యంగా గుల్వీర్ సింగ్ ఒకే కామన్వెల్త్ గేమ్స్‌లో అథ్లెటిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించగా.. తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్‌లో భారత్‌కు తొలి కామన్వెల్త్ పతకం అందించాడు.

కామన్వెల్త్ గేమ్స్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో జూడో, ట్రాక్ సైక్లింగ్ వంటి విభాగాల్లో భారత్‌కు మరిన్ని పతకాల అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 39 పతకాలతో నాలుగో స్థానంలో ఉన్న భారత్.. 40కి పైగా పతకాలతో ఈ క్రీడలను ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన దేశవ్యాప్తంగా క్రీడాభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. పది రోజులుగా క్రీడాభిమానులను అలరిస్తున్న కామన్వెల్త్‌ గేమ్స్ నేటితో ముగియనున్నాయి.