CSK-IPL 2027: సీఎస్‌కే కీలక నిర్ణయం.. ఆ ఊహాగానాలకు చెక్!

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో సీఎస్‌కే నిరాశాజనక
  • పాయింట్లతో 8వ స్థానంలో సీఎస్‌కే
  • సీఎస్‌కే కీలక నిర్ణయం
Csk History

Csk History

CSK Take Big Call on Stephen Fleming: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) నిరాశాజనక ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్‌లలో 8 ఓటములు, 6 విజయాలతో 12 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. అయినా సీఎస్‌కే తమ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌పై పూర్తి నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఫ్లెమింగ్ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపించినా.. ఆయనను పదవి నుంచి తొలగించే ఆలోచనలో సీఎస్‌కే యాజమాన్యం లేదని తాజా నివేదికలు వెల్లడించాయి. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్‌కేతో అనుబంధం కొనసాగిస్తున్న ఫ్లెమింగ్.. 2009 నుంచి హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం అతడి కాంట్రాక్టును మరో సీజన్‌కు పొడిగించే దిశగా ఫ్రాంచైజీ ఆలోచనలు వేస్తున్నట్లు సమాచారం.

గత రెండు సీజన్లుగా సీఎస్‌కేకు తీవ్రంగా నిరాశపరుస్తోంది. 2025 సీజన్‌లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన చెన్నై.. 2026లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. అయినప్పటికీ స్టీఫెన్ ఫ్లెమింగ్ అనుభవం, జట్టుపై అతడి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని యాజమాన్యం అతడిని కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఫ్లెమింగ్ కాంట్రాక్ట్ పొడిగింపును అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ప్రస్తుతం ఫ్లెమింగ్ అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ)లో టెక్సాస్ సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.

×
×
Ad

మరోవైపు సీఎస్‌కేకు సంబంధించి ట్రేడ్ డీల్‌పై కూడా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఖలీల్ అహ్మద్, డేవిడ్ మిల్లర్‌లకు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్‌తో ట్రేడ్ చర్చలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హార్దిక్ పాండ్య విషయంలో సీఎస్‌కే ఎలాంటి అధికారిక సంప్రదింపులు జరపలేదని సమాచారం. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు భారీ ట్రేడ్ డీల్‌గా నిలిచే అవకాశం ఉన్న రిషభ్ పంత్-కుల్దీప్ యాదవ్ మార్పిడి చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లే అవకాశం ఉందని, బదులుగా కుల్దీప్ లక్నో జట్టులో చేరే అవకాశాలు ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.

2025 మెగా వేలంలో రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకున్న రిషభ్ పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో నాయకత్వ బాధ్యతలపై విభేదాల నేపథ్యంలో అతడు జట్టును వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ పాత జట్టుకు చేరే దిశగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ ట్రేడ్‌కు సంబంధించిన ఆర్థిక అంశాలు, ఇతర నిబంధనలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం లభించిన తర్వాతే ఈ భారీ ట్రేడ్ అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉంది.