Rohit-Hardik: ముందు బెంగళూరుకు రండి.. రోహిత్, హార్దిక్‌కు బీసీసీఐ అల్టిమేటం!

  • భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం
  • రోహిత్, హార్దిక్‌కు బీసీసీఐ అల్టిమేటం
  • వారం రోజుల పాటు ఫిట్‌నెస్, రీహాబిలిటేషన్
Rohit Hardik Bcci

Rohit Hardik Bcci

భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 6 నుంచి ప్రారంభమయ్యే ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు, జూన్ 13 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్లను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వన్డే జట్టులో చోటు దక్కించుకున్న సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు హాజరుకావాలని బోర్డు ఆదేశించినట్లు సమాచారం.

హార్దిక్ పాండ్యా ఇప్పటికే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సుమారు వారం రోజుల పాటు ఫిట్‌నెస్, రీహాబిలిటేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టుతో చేరనున్నాడు. రోహిత్ శర్మ విషయంలో మాత్రం ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. బీసీసీఐ ఇద్దరికీ ఒకేసారి ఆదేశాలు చేసినప్పటికీ.. రోహిత్ ఎప్పుడు హాజరవుతాడన్న విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. దీంతో అతని ఫిట్‌నెస్ పరిస్థితిపై ఆసక్తి నెలకొంది.

×
×
Ad

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలకు చోటు లభించింది.

జూన్ 6 నుంచి జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు భారత జట్టు సన్నాహకాల్లో భాగంగా పలువురు యువ బౌలర్లను నెట్ బౌలర్లుగా ఎంపిక చేసింది. జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ దార్‌కు ఇందులో చోటు దక్కడం విశేషంగా మారింది. రంజీ ట్రోఫీలో 60 వికెట్లు తీసి జమ్మూ కశ్మీర్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆకిబ్‌కు టెస్టు జట్టులో అవకాశం రాకపోవడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. మాజీ భారత కెప్టెన్, మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ఈ అవకాశం వచ్చింది. ఆకిబ్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్‌లో ఆడిన లెగ్ స్పిన్నర్ జీషాన్ అంసారీని కూడా నెట్ బౌలర్‌గా ఎంపిక చేశారు. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రిస్ట్ స్పిన్నర్లు ఎక్కువగా ఉండటంతో భారత బ్యాటర్లకు మెరుగైన ప్రాక్టీస్ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శివాంగ్ కుమార్, గుర్జప్నీత్ సింగ్, ప్రిన్స్ యాదవ్, సరాంశ్ జైన్‌లను కూడా నెట్ బౌలర్లుగా పిలిచారు.