NTV Telugu Site icon

తెల‌క‌ప‌ల్లి ర‌వి: ప్రజాన్యాయ కథకుడు రావిశాస్త్రి శతజయంతి  

రావిశాస్త్రిగా పేరొందిన రాచకొండ విశ్వనాథశాస్త్రి తెలుగు కథాసాహిత్యంలో, నవలా రచనలో తనకంటూ ఒక పరపడి ఏర్పాటుచేసుకున్న ప్రముఖ రచయిత. స్వతహాగా న్యాయవాది అయిన రావిశాస్త్రీ న్యాయస్థానంలోనే గాక తన జీవితంలోలోనూ పేదలకు న్యాయం కోసం  కలం అంకితం చేసిన గొప్ప రచయిత.వర్గసమాజంలో ప్రత్యక్షంగానే గాక కనిపించకుండా సాగే క్రూరమైన పీడననూ, న్యాయప్రక్రియలో వర్గ వైరుధ్యాలను కళ్లకు కట్టిన ప్రజారచయిత. 1922 జులై30న విశాఖ జిల్లా తుమ్మపాలెంలో  పుట్టిన రావిశాస్త్రి శతజయంతి వత్సరం  మొదలవుతున్నది.1940లలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో బిఎ ఆనర్స్‌ చదివిన రావిశాస్త్రి  తర్వాత మద్రాసు లో  న్యాయశాస్త్రం అభ్యసించారు.ి శ్రీకాకుళం విశాఖ జిల్లాల ప్రజాజీవితాన్ని లోతుగా పరిశీలించడం మొదలుపెట్టారు.  ప్రాక్టీసు మొదలుపెట్టేనాటికే ఆయనకు ప్రగతిశీల భావాలు పట్టుపడ్డాయి.చాలా కాలం విరసంతో వున్నారు.న్యాయవాదిగానే గాక విశాఖలో ప్రజాసంఘాల నేతలకూ యువతకు ఆయన ఎప్పుడూ అండగా వుండేవారు..

Read: మోడీ ట్వీట్ చేసిన జింకల వీడియో… వైర‌ల్‌…


1938లో వినోదిని పత్రికలో అచ్చయిన దేవుడేచేశాడు ఆయన తొలి కథ.1993లో వెలువడిన ఇల్లు చివరి రచన. 1938లో వినోదిని పత్రికలో అచ్చయిన దేవుడేచేశాడు ఆయన తొలి కథ.1993లో వెలువడిన ఇల్లు చివరి రచన.తానెలా రచయితనైందీఆయనే ఇలా రాశారు:‘‘పెద్దలు చెప్పిన కధలు వినీ, చదివి నాకు కధల్లో ఆసక్తి కలిగింది. పెద్ద వాళ్ళను ఇమిటేట్‌ చేద్దామనే ఉత్సాహం అప్పట్లో నాకు చాలా వుండేదని ఇప్పుడు నాకు బాగా స్పష్టంగా తెలుస్తోంది. అది అప్పుడు నాకు బాగా గొప్పగా కూడా తోచింది……’ నేను మొదట కధలు రాసినప్పుడు సరదాకోసమూ, గొప్పకోసమూ తప్ప మరెందు గురించి రాయలేదు. మనం కూడా కధలు రాశాము. అవి పత్రికల్లో పడ్డాయి. అంటే నాకు చెడ్డ గొప్పగా వుండేది’’. అని ఆయన తర్వాతి కాలంలో రాసుకున్నారు.
అలాగే ఆగిపోయివుంటే ఆయన రావిశాస్త్రి అయ్యేవారు కాదు.ఆయన రచనా యాత్ర  ఉన్నత శిఖరాలకేసి సాగింది,  మొదట్లో మారు పేరుతో కొన్ని రచనలు చేసినా అసలు పేరుతో తొలిసారిగా ‘‘అల్పజీవి’’ నవల రాశారు. అది ‘భారతి’ లో ప్రచురితమైంది.అభద్రత ఆత్మన్యూనతా భావం అందులోకళ్లకు కట్టారు. శ్రీశ్రీ కోనేటిరావుకదల్లా, గోపీచంద్‌ ‘‘అసమర్థుని జీవయాత్ర ‘‘లా, కొడవటిగంటి కుటుంబరావుగారి ‘‘బ్రతుకుభయం’’లో సీతప్పలా రావిశాస్త్రి సృష్టించిన ‘అల్పజీవి’ సుబ్బయ్య అందరినీ ఆకర్షించాడు. ఆందోళన పెట్టాడు. అల్పజీవి జేమ్స్‌ జాయిస్‌ ‘‘చైతన్య స్రవంతి’’ తరహాలో నడుస్తుంది. పరపు పిరికివాడైన సుబ్బయ్యపాత్ర చివరకు తనకే అసహ్యం కలిగించిందని అంటూ ఆయన ‘చివర మాట’ లో ఇలా రాశారు.‘‘పాపుల్లో సాహసులూ వుంటారు. భయస్తులూ వుంటారు. కాని భయానికి మంచికి పొందిక లేదు. పిరికి వారెవరూకూడా మంచివారు కాజాలరు. మంచికి నిలబడలేరు. మంచిగా వుండాలంటే గుండె నిబ్బరం చాలా వుండాలి’’ ఈ సూత్రాన్ని రావిశాస్త్రి జీవితాంతం నొక్కి చెబుతూవచ్చారు. తప్పులైతే అందరూచేస్తారు,త్యాగాలు మాత్రం కొందరే చేస్తారు అని పోరాడే యోధులకు తన రచనలు అంకితం చేశారు.

Read: వాట్స‌ప్‌కు పోటీగా భార‌త ప్ర‌భుత్వం స‌రికొత్త యాప్‌… ఆదిరిపోయే ఫీచ‌ర్ల‌తో…


‘‘ఆరుసారా కధలు!’’. ‘‘ఆరుసారో కథలు’’, ‘‘రాచకొండ కలకంఠి కథలు. ‘‘రాజు-మహిషి’’, ‘‘గోవులస్తున్నాయి జాగ్రత్త’. రుక్కులు, సొమ్మలు పోనాయండి. ‘‘రత్తాలు-రాంబాబు’’, ‘‘మూడు కధల బంగారం’’, ‘‘ఇల్లు’’ ఆయన రచనలు.ఇందులో ప్రతి ఒక్కటి  సామాజిక వాస్తవికతకు అద్దం పట్టేదే. ‘‘నిజం’’, ‘‘విషాదం’’  తిరస్క్రతి వంటినాటకాలలోనూ ఆయన ఇదే పని చేశారు. ‘‘ప్రస్తుతం మనదేశంలో ప్రతిరోజూ ప్రతిచోటా కూడా ఎందరో అమాయకులు చేయని నేరానికి శిక్షలు అనుభవించడంజరుగుతోంది. కానిఈ మాత్రం డబ్బూ పలుకుబడి పదవీ హోదా కలవాడెవడూ పడడు. ఒకవేళ ఇరుక్కున్నా తప్పించుకోగలడు’‘అని నిజం ముందుమాటలో రాశారు. ఇదే కథల్లోనూ పాత్రలు సంభాషణల ద్వారా చెబుతారు. ‘‘పిపిలీకం’’ అనేకధలో ఒక చీమ సత్యాన్వేషణకై బయలుదేరుతుంది. అనేక మజిలీలు గడిపితిరిగొస్తుంది. వచ్చేసరికి దాని పుట్టలో పాము వుంటుంది. తాను చీమనని, పాములు తమ పుట్టలు ఆక్రమిస్తాయని చీమకు అప్పుడే తెలుస్తుంది. సుమతీ శతక కారుడు చెప్పినట్టు అది అన్ని చీమలను సమీకరించి పామును హతమారుస్తుంది. ‘వేతన శర్మ’ కధలో పాలకులు తమ ప్రయోజనాలకై నడిమ తరగతిని  ఎలా సృష్టించేదీ చెబుతుంది.మంచి చెడ్డల మధ్య ఘర్షణలో మనుషులు హీరోలు విలన్లుగా స్థిరంగా వుండరని చెప్పడానికి మూడు కథల బంగారంలో బంగారుబాబు పరిణామక్రమం చిత్రిస్తారు. ప్రబంధ కవులు ప్రకృతి నుంచి, శృంగార జీవనం నుంచి ఉపమానాలు తీసుకుంటే రావిశాస్త్రి సామాజిక జీవనం నుంచి, నిత్యజీవిత పరిశీలన నుంచి అతి చక్కని ఉపమానాలు సృష్టించారు. ఆయనవాక్యాలు, ఉత్తరాంధ్ర మాండలికంలో ఉపమానాలు వెల్లువలతో అలా సాగిపోతూనే వుంటాయి. కథల్లోగాని, నవలల్లోగాని కథ కన్నా కథనం, పాత్రల చిత్రణ, ఉపమానాలే ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తాయి. హాస్యం వ్యంగ్యం తాండవిస్తాయి.
రావిశాస్త్రికి సినిమా రంగంతోనూ సంబంధం వుంది. ఆయన నిజం నాటకంతోనే రావుగోపాలరావు బాగారాణించారు. తర్వాత దాన్ని సినిమాగా కూడాతీశారు. స్త్రీ అనే చిత్రానికి మాటలు రాశారు. ఈ సినిమా వాళ్లుచాలామంచి వాళ్లు.అన్నీతామే రాసుకుని మనకు డబ్బులు ఇస్తారు అని  తమాషాగా అన్నారు. రత్లాలురాంబాబు కూడాచిత్రంగా తీశారు గానివిడుదలకు నోచుకున్నట్టు లేదు.

రావిశాస్త్రి పాత్రల్లో ఎక్కువ భాగం ‘అలగాజనం’ వ్యభిచారిణులు, బ్రోకర్లు, దొంగలు, లంచగొండి పోలీసులు, పిక్‌ పాకటేర్లు, త్రాగుబోతులు, దారితప్పిన లాయర్లు, లోఫర్లు, దాఫర్లతో ఆయన రచనలన్నీ నిండి వుంటాయి.  పతితులార, భ్రష్టులార’’ అని శ్రీశ్రీ సంభోదించిన అథోజగత్స హోదరులపై సానుభూతికిది సంకేతమని విమర్శకుల అభిప్రాయం. భిన్నాభిప్రాయాలూ వున్నాయి. శ్రీశ్రీతో, గురజాడతో ఆయనను పోల్చుతూ రాసిన వారున్నారు.    గురజాడ తరహావ్యంగ్యం,మాండలికం కూడా రావిశాస్త్రిలోచూస్తాం. అంతేగాక ఆయన కూడా కోర్టుల చుట్టూ తిప్పి అమాయకులను వేధించే  రామప్పంతులు వంటివారిని గురజాడా సృష్టించారు.   ‘‘రత్తాలు-రాంబాబు’’ ‘ఆంధ్రజ్యోతి’ లో సీరియల్గా వస్తున్నప్పుడు ఈ విషయమై సుదీర్ఘ చర్చ జరిగింది. ‘‘మూడు కధల బంగారం’’కు ముందు మాటలో ఆయన ఇలా చెప్పారు :‘‘నేను ఎవరో పాశ్చాత్య రచయిత రాయగా ఎక్కడో చదివాను. అతను అవినీతి గురించి చెప్తూ మంచి వాళ్ళు కొంత మంది అవినీతిని మొదటి సారిగా చూసి అసహ్యించుకుంటారంటాడు. తర్వాత కొంత కాలానికి వారికి ఆ అవినీతి పట్లనిర్లిప్తత ఏర్పడుతుందట. ఆ నిర్లిప్తత్తలోంచి కొంత కాలానికి అభిమానం చిగురిస్తుంది. అ అభిమానం చివరకు వారు ఆ అవినీతిని ఆలింగనం చేసుకోవడానికి దారి తీస్తుందట.’’.తన నవలలో సూర్రావెడ్డు గురించి ఈ వాక్యాలు రాసినా ఈ మాటల్లో  తన రచనా శైలిని గూడా వివరించారని అనిపించకమానదు.


 రావిశాస్త్రి రచనల్లో అన్నిటికన్నా ప్రధానంగా చెప్పుకోవలసింది న్యాయవ్యవస్థ అక్షరీకరణే. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌విరమణ ఇటీవల చాలా సార్లు ఆ వియం ప్రస్తావిస్తుండడం విశేషం.పౌరహక్కులు,గోప్యత, భావప్రకటనా స్వేచ్చ ప్రతిదీ సవాలునెదుర్కొంటూ రాజద్రోహం కేసులలో ప్రాణాలుకోల్పోతున్నప్పుడు ప్రభుత్వ సంస్థలు తెగనమ్ముతున్నప్పుడు రావిశాస్త్రి రచనల అధ్యయనం ఎంతైనా అవసరమవుతుంది. ఉద్యమాలు పోరాటాల గురించి రచనలువున్నంతగా మనకు పై తరగతుల బూటకాలు న్యాయం పేరిట చట్టం పేరిట జరిగే దారుణాల గురించి చెప్పిన రచనలు లేవు. వ్యంగ్యం హాస్యం కూడా తగ్గిపోతున్న స్థితి.కనుకనే  ఆయన 1993 నవంబరు10న కమ్నమూశారు గాని ఆయన రచనలు మాత్రం చైతన్యం పంచుతూనే వున్నాయి. ఇలాటిసమయంలో రావిశాస్త్రి శతజయంతిని ఆయనకు జోహారులర్పించడానికే గాక  ప్రతిభావంతమైన ఆయన శైలిని సాహిత్యసంపదను అధ్యయనం చేయడానికి ఈ సందర్భాన్ని ఉపయోగిద్దాం. ఎందుకంటే శ్రీశ్రీఅన్నట్టు శతాబ్దాల కిందట ఒక రావి గౌతముణ్ని ప్రభావితం చేసింది. ఈ శతాబ్డంలో ఒక రావితెలుగువారిని ప్రభావితం చేసి ప్రబుద్దుల్ను చేస్తుంది