Chanakya Niti: గొప్ప విద్వాంసుడు, రాజనీతిజ్ఞుడు అయిన ఆచార్య చాణక్యుడు తన ‘చాణక్య నీతి’లో జీవితానికి సంబంధించిన ఎన్నో కీలక విషయాలను ప్రస్తావించారు. కేవలం మనుషుల గురించి మాత్రమే కాదు, ప్రకృతిలోని జంతువులు, పక్షుల నుంచి కూడా మనం కొన్ని గొప్ప గుణాలను నేర్చుకోవచ్చని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఒక మనిషి విజయం సాధించాలంటే ‘కొంగ’ (బగుల) నుంచి ఒక అద్భుతమైన లక్షణాన్ని అలవర్చుకోవాలని చాణక్యుడు ఈ క్రింది శ్లోకం ద్వారా వివరించారు.
READ ALSO: Venu Udugula: ఇద్దరూ పరిచయమే కానీ.. మంగ్లీ కేసుపై వేణు ఉడుగుల కీలక ప్రకటన!
ఇంద్రియాణి చ సంయమ్య బకవత్పండితో నరః
దేశకాల బలం జ్ఞాత్వా సర్వకార్యాణి సాధయేత్
కొంగ నుంచి నేర్చుకోవాల్సిన ఆ గుణం ఇదే..
కొంగ చేపను వేటాడేటప్పుడు నీటిలో అత్యంత నిశ్శబ్దంగా, ఏకాగ్రతతో నిలబడుతుంది. దాని దృష్టి మొత్తం తన లక్ష్యం (చేప) పైనే ఉంటుంది. చేప దొరికే వరకు అది తొందరపడదు, అసహనానికి గురికాదు. సరైన సమయం కోసం వేచి చూసి, అవకాశం దొరకగానే మెరుపు వేగంతో తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. అదేవిధంగా ఒక జ్ఞాని అయిన వ్యక్తి తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని, కొంగలాగా తన లక్ష్యంపై పూర్తి ఏకాగ్రతను నిలపాలని చాణక్యుడు బోధించారు.
ఏదైనా ఒక కార్యాన్ని సాధించే ముందు మనిషి ఈ అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని చాణక్యుడు సూచించారు. మీరు పనిచేస్తున్న ప్రాంతం ఏది?, అక్కడ ఆ పనికి ఎంతవరకు ఆస్కారం ఉంది?, ఆ స్థలం మీ విజయానికి సహకరిస్తుందా లేదా? అనే అవగాహన ఉండాలి. ఆ పని చేయడానికి ఇది సరైన సమయమేనా?, ప్రతి పనికి ఒక అనుకూల సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చే వరకు ఓపికగా వేచి చూడటం ముఖ్యం. మీ సామర్థ్యం ఎంత?, మీ దగ్గర ఉన్న వనరులు, ఆర్థిక బలం ఎంత? మీ శత్రువు లేదా పోటీదారుడి బలం ఎంత? వీటిని సరిగ్గా అంచనా వేయగలిగినప్పుడే విజయం సాధ్యమవుతుంది.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుని బాధలు పడుతుంటారు. కానీ చాణక్యుడు చెప్పినట్లుగా కొంగలాంటి ఏకాగ్రత, సహనం కలిగి ఉండి.. దేశ, కాల, బలాలను అంచనా వేసి అడుగు వేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించడం తథ్యం అని పెద్దలు చెబుతున్నారు .
