రాజీవ్ కనకాల, వాసంతిక మచ్చ ప్రధాన పాత్రలలో రూపొందిన జీ5 (ZEE5) ఒరిజినల్ “డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనిపించడం లేదు”. నటుడు శ్రీరామ్ నిర్మాతగా మారి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ను పోలూరు కృష్ణ డైరెక్ట్ చేశారు. ఉదయభాను మరో కీలక పాత్రలో కనిపించడంతో సిరీస్ మీద అంచనాలు పెరిగాయి. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆసక్తి రేకెత్తిస్తూ ఉండడంతో, సిరీస్ ఎలా ఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ సిరీస్ నిన్న అర్ధరాత్రి నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి భారీగా అంచనాలు ఏర్పడేలా చేసుకున్న ఈ సిరీస్ ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ:
ప్రసాదరావు (రాజీవ్ కనకాల) నెల్లూరులో ఒక కిరాణా షాపు నడుపుతూ ఉంటాడు. తన కుమార్తెను (వాసంతిక మచ్చ) అల్లారుముద్దుగా పెంచుతాడు. ఆమె ఏ పని ఒక్కతే చేయనీయకుండా, అన్ని తానై నిలుస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆమెకు హైదరాబాద్లో ఉద్యోగం వస్తుంది. తండ్రికి చెప్పడానికి భయపడి, చుట్టాలందరినీ ఇంటికి పిలిపించి మరీ విషయం చెబుతుంది. ముందు ఒప్పుకోకపోయినా, చుట్టాలందరి మాట మీద ఆమెను హైదరాబాద్ ఉద్యోగానికి పంపిస్తాడు.
అలా వెళ్లిన ఆమె ఫోన్ ఒకరోజు స్విచ్ ఆఫ్ వస్తుంది. వెంటనే ఏమీ ఆలోచించకుండా హైదరాబాద్ బయలుదేరి వెళ్తాడు ప్రసాదరావు. అక్కడ అతనికి కొన్ని షాకింగ్ విషయాలు తెలియడమే కాకుండా, తన కుమార్తె మరణించిన విషయం కూడా తెలుస్తుంది. అయితే, అసలు ప్రసాదరావు కుమార్తె ఎందుకు చనిపోయింది? ఆమె మరణానికి కారణం ఏంటి? ఈ విషయాన్ని రెబెకా (ఉదయభాను) అండ్ టీమ్ ఎలా కనిపెట్టింది? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ప్రమోషనల్ కంటెంట్ చూస్తేనే స్టోరీ సగం అర్థమైపోతుంది. ఇక సిరీస్ మొదలయ్యాక ప్రసాదరావు కుమార్తె కనిపించకుండా పోవడం, ఆమె కోసం ఒక పోలీస్ టీమ్ అంతా కష్టపడి వెతుకుతూ ఉండడం, వారు వెతుకుతున్నా ప్రసాదరావు సునాయాసంగా కుమార్తె ఎక్కడ ఉందో అక్కడికి వెళ్లి ఆమెను పోలీసులకు చూపించడం వంటి సన్నివేశాలు కాస్త సినిమాటిక్ గా ఉన్నా, కన్విన్సింగ్ గానే ఉన్నాయి.
మరణించిన విషయం తెలిసిన తరువాత కథలో వేగం పుంజుకుంటుంది. ఈ సిరీస్ చూస్తున్నంతసేపు ‘తరువాత ఏం జరగబోతోంది?’ అనే ఆసక్తి కలుగుతుంది. కొన్నిచోట్ల ఊహించినట్టే ఉన్నా, మరికొన్ని చోట్ల మాత్రం అంచనాలను మించి ఉండేలా దర్శకుడు కథ రాసుకున్నాడు. ఎక్కడా బోర్ కొట్టించకుండా ఆసక్తి పెంచుతూ సిరీస్ నడిపించాడు. పోలీసులు కూడా కనిపెట్టలేని విషయాన్ని ప్రసాదరావు ఛేదిస్తూ రావడం, దానిని చివరి ఎపిసోడ్లో రివీల్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ఈ సిరీస్లో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ అరగంట లోపే ఉంటుంది. అంటే దాదాపుగా ఒక సినిమా చూస్తున్నంత సమయంలోనే పూర్తి చేయొచ్చు. అక్కడక్కడ చిన్నచిన్న లాజిక్స్ మిస్ అయినా, తనదైన మ్యాజిక్తో సిరీస్ మొత్తాన్ని నడిపించాడు దర్శకుడు. అయితే రివెంజ్ స్టోరీ మాత్రం కాస్త రియాలిటీకి దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
నటీనటులు & సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సిరీస్ మొత్తానికి రాజీవ్ కనకాలే ప్రధాన బలం. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్తో సిరీస్ మొత్తాన్ని భుజాన వేసుకుని నడిపించారు. వాసంతిక మచ్చ కుమార్తె పాత్రలో చక్కగా నటించి ఆకట్టుకుంది. ఉదయభాను చాలా కాలం తర్వాత పూర్తిస్థాయి పాత్రలో కనిపించి మెప్పించారు. మిగతా పాత్రధారులు అందరూ తమ పరిధి మేరకు రాణించారు.
సాంకేతికంగా చూస్తే, ఈ సిరీస్కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. పాటలు లేకపోయినా బీజీఎం సీన్లను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్ రిచ్గా ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ముగింపు: ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనిపించడం లేదు’ ఒక ఎంగేజింగ్ మర్డర్ మిస్టరీ.