రాజకీయపార్టీలకు ఎన్నికలప్పుడు సామాజిక సమీకరణాలు గుర్తుకురావడం కామన్. ఓట్ల ఆధారంగా టిక్కెట్లు, హామీలు ఇస్తుంటాయి. అధికారపార్టీ మూడేళ్ల ముందు నుంచే అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. ఓ వర్గానికి దగ్గరవుతోంది. పదవుల్లో ప్రాధాన్యం ఇస్తోంది. ఇంతకీ అధికారపార్టీ లెక్క పక్కాయేనా..!? అనుకున్న బెనిఫిట్ దక్కుతుందా…!? మిగిలిన వర్గాల మాటేంటి..!!.
కాపు, యాదవ, వెలమ, గవర, మత్స్యకారులు కీలకం
వైసీపీకి పట్టుచిక్కని సిటీలోని నాలుగు స్థానాలు
విశాఖజిల్లా రాజకీయాలు సామాజిక సమీకరణాలు చుట్టూ తిరగడం కొత్తేమీ కాదు. ఇక్కడ ఓటర్లు, జనాభా ప్రాతిపదికన కాపు, యాదవ, వెలమ, గవర, మత్స్యకార కులాలు ముఖ్యమైనవి. ఎన్నికల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే శక్తి వీటికే ఉంది. రాజకీయపార్టీల ప్రాధాన్యాలు వీటికి అనుగుణంగానే ఉంటాయి. మత్స్యకార గ్రామం నుంచి పరిపాలన రాజధాని స్ధాయికి ఎదుగుతోంది విశాఖ. ఈ నగరంలో కాపులు, యాదవులదే ఆధిపత్యం. టీడీపీకి మొదటి నుంచి బలమైన ఓట్ బ్యాంక్. 2019లో టీడీపీ కంచుకోటను బద్ధలు కొట్టేందుకు వైసీపీ గట్టి ప్రయత్నం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో అనుకున్న ఫలితం సాధించినప్పటికీ గ్రేటర్ విశాఖలో మాత్రం గట్టి ఎదురుదెబ్బ తప్ప లేదు. సిటీ పరిధిలోని నాలుగు కీలక నియోజకవర్గాల్లో ఓటమి ఎదురైంది.
జీవీఎంసీ ఫలితాల తర్వాత మారిన వైసీపీ వ్యూహం
తర్వాత జరిగిన పరిణామాల్లో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ గూటికి చేరారు. అయితే నాయకత్వం మారినంత మాత్రాన సామాజికవర్గాల్లో పట్టు సాధించడం సాధ్యం కాదనేది జీవీఎంసీ ఎన్నికతో రుజువైంది. నగరంపై పట్టు సాధించేందుకు అవసరమైన బలం పొందినప్పటికీ.. ఏకపక్షంగా కొట్టేయాలన్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు. దీంతో మూడేళ్ల తర్వాత జరిగే సాధారణ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెట్టి అమలు చేయడం ప్రారంభించింది వైసీపీ.
కాపుల తర్వాత యాదవులను ఆకర్షించే పని
విశాఖ లోక్సభ పరిధిలో యాదవుల ఓట్లు 3 లక్షలు!
పార్టీలోనూ పదవుల్లోనూ తమకు ప్రాధాన్యం పెరగాలని బలమైన సామాజిక వర్గాలు కోరుకుంటున్నాయి. GVMC ఎన్నికలపైన ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీంతో అధికారపార్టీ వ్యూహం మార్చింది. విశాఖపై పట్టు సాధించడమే లక్ష్యంగా యాదవ సామాజిక వర్గంపై ఫోకస్ పెంచింది. ఇప్పటి కే కాపులకు పెద్దపీట వేయగా ఇప్పుడు యాదవులను ఆకర్షిస్తోంది. ఇందుకు కారణం ఓటింగ్ లెక్కలేననేది సుస్పష్టం. విశాఖ పార్లమెంట్ పరిధిలో యాదవ సామాజికవర్గం ఓటర్ల సంఖ్య సుమారు 3 లక్షలు. భీమిలిలో 48వేలు, తూర్పులో 40వేలు, గాజువాక 45వేలు, దక్షిణంలో 22 వేలు, పశ్చిమ నియోజకవర్గంలో25వేలు, నార్త్ లో 25వేలు, ఎస్.కోట30వేలు, పెందుర్తి 35వేల మంది ఓటర్లు ఉన్నారు. మిగిలిన సామాజిక వర్గాలను కలుపుకుని పోతూనే యాదవుల మద్దతు కూడగట్టగలిగితే ఆశించిన ఫలితాలు రాబట్టవచ్చేనది వైసీపీ పెద్దల ఆలోచన.
యాదవులకే మేయర్ పీఠం
ఒక ఎమ్మెల్సీ పదవి సైతం వారికే?
అవకాశం వచ్చిన ప్రతీసారీ యాదవులకు సముచిత స్ధానం ఇవ్వడం ద్వారా పాజిటివ్ సంకేతాలను పంపిస్తోంది వైసీపీ. జీవీఎంసీకి సుదీర్ఘ కాలం తర్వాత ఎన్నికలు జరిగాయి. బీసీ జనరల్కు మేయర్ సీటు రిజర్వ్ అయినా.. మహిళకు ప్రాధాన్యం ఇచ్చింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకట కుమారిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టింది. త్వరలో విశాఖజిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. స్ధానిక సంస్ధల కోటాలో వచ్చే ఆ రెండు పదవుల్లో ఒకటి యాదవులకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
పదవుల కోసం పార్టీ నేతలు విజయనిర్మల, వంశీకృష్ణ ఎదురుచూపు
ఎగ్జిక్యూటివ్ రాజధానిలో కీలకమైనది విశాఖపట్నం మెట్రో రీజియన్ డవలప్ మెంట్ అథారిటీ. ఈ సంస్ధ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. ఇది కాకుండా త్వరలోనే నామినేటెడ్ పోస్ట్లకు నియామకం జరగనుంది. ప్రస్తుతం తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల ఫ్యామిలీ, నగరపార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి అవకాశం కల్పిస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో నలుగుతోంది. ఇవి కాకుండా వివిధ కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవుల పంపిణీలోనూ ఎక్కువ శాతం యాదవులకు దక్కేలా చూడాలనేది స్ధానిక నాయకత్వం ఆలోచన. అదే జరిగితే తెలుగుదేశంపార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న బలమైన సామాజికవర్గాన్ని దూరం చేసినట్టు అవుతుందనేది పొలిటికల్ స్ట్రాటజీ.
దశల వారీగా అన్ని సామాజిక వర్గాలను అక్కున చేర్చుకునే వ్యూహం
కాపు, యాదవుల కోటా పూర్తయ్యాక మిగిలిన వారికి పదవులు
దశల వారీగా అన్ని సామాజిక వర్గాలను అక్కున చేర్చుకోవడం ద్వారా బలమైన శక్తిగా మారడం వైసీపీ అసలు ఉద్దేశం. అయితే అన్ని పదవులూ యాదవులకే కేటాయిస్తే మిగిలిన వారి మాటేంటనే భావన పార్టీ అంతర్గత వర్గాల్లో లేకపోలేదు. దశల వారీగా అందరికీ అవకాశాలు లభించడం ఖాయమని.. ఇందుకు కాపులు, బీసీలకు దక్కిన గౌరవమే నిదర్శనం అంటోంది నాయకత్వం. జిల్లాలో ముగ్గురు కాపు ఎమ్మెల్యేలు ఉండగా.. అవంతికి మంత్రిపదవి లభించింది. అనకాపల్లి శాసనసభ్యుడు అమర్నాథ్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి కాపుల కోటాలోనే భర్తీ చేసింది. కాపు, యాదవుల కోటాను పూర్తి చేసిన తర్వాత మిగిలిన వారికీ సముచిత స్ధానం ఇవ్వడం ఖాయమనే చర్చ జరుగుతోంది. త్వరలోనే భర్తీ చేయనున్న కార్పొరేషన్ పదవుల్లో ఐదారు విశాఖకు వచ్చే అవకాశం ఉంది. వాటిలో మిగిలిన వారికి ప్రయారిటీ ఇస్తారనేది సమాచారం.