పిలవని పేరంటానికి వెళ్లరు సరే.. పిలిచిన పెళ్లికి వెళ్లడం కూడా తప్పేనా..? విశాఖ సౌత్ టీడీపీలో రచ్చ రచ్చ అవుతున్న ఎపిసోడ్ ఇదే..! కేడర్ వర్సెస్ లీడర్ అన్నట్టుగా మారిపోయింది వార్. నిలదీతలు.. ప్రశ్నలు.. సవాళ్లు.. పరిస్థితిని వేడెక్కిస్తున్నాయి. ఎందుకలా? లెట్స్వాచ్..!
ఉత్తరాంధ్రలో రాజకీయాల వేడి ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తుంది. దానికి భిన్నంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీలో కొత్త పోకడలు సెగలు రేపుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంట్లో పెళ్లి వేడుక దానికి కారణం కావడం మరింత చర్చగా మారింది. ఇటీవల ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడి వివాహ రిసెప్షన్ జరిగింది. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వధూవరులను ఆశీర్వదించారు. ఇదే ఫంక్షన్కు వెళ్లిన దక్షిణ నియోజకవర్గ టీడీపీ లీడర్లు, కేడర్ రాజకీయ కారణాలతో అడకత్తెరలో పడ్డారు.
ఎమ్మెల్యే వాసుపల్లి రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచారు. ప్రస్తుతం వైసీపీకి జైకొట్టారు. దాంతో నియోజకవర్గంలోని కేడర్ను కాపాడుకునేందుకు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి పార్టీ ఇంఛార్జ్గా బాధ్యతలు అప్పగించింది టీడీపీ. వాసుపల్లి ఇంట పెళ్లి వేడుక్కి వెళ్లొద్దని గండి బాబ్జి.. సౌత్ టీడీపీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. వెళ్లినవాళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. ఈ ఆదేశాలు పార్టీ అంతర్గత గ్రూపుల్లో చర్చకు దారి తీశాయి. 15 ఏళ్లపాటు ఒకేపార్టీలో కలిసి పనిచేసిన నాయకుడి ఇంట్లో పెళ్లికి వెళ్లొద్దనడంపై కొందరు ప్రశ్నలు లేవనెత్తారు. వాసుపల్లితో బంధుత్వం ఉన్నవాళ్లూ టీడీపీ నాయకులుగా ఉన్నా రు. పార్టీ కోసం త్యాగాలు చేస్తాం కానీ.. బంధుత్వాలను, స్నేహాలను వదులుకోమంటే సాధ్యం కాదని కొందరు గండి బాబ్జీ ముందే వాళ్లు కుండబద్దలు కొట్టేశారట. చాలా మంది ఇంఛార్జ్ ఆదేశాలను లెక్క చేయలేదు.
ఇంఛార్జ్ హోదాలో బాబ్జీ చర్యలు తీసేసుకున్నారు. ఒక మహిళా నాయకురాలిని పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించడంతో ఆమె నేరుగా పార్టీ ముఖ్యులకు ఫిర్యాదు చేశారట. టీడీపీలో కొత్తగా ఈ షరతులేంటి అని ఆమె ప్రశ్నించారట. ఈ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ ఉంది. విశాఖ సౌత్ లీడర్లే కాకుండా.. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన చాలామంది టీడీపీ సీనియర్ నాయకులు వాసుపల్లి కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరయ్యారు. దాంతో మమ్మల్ని వెళ్లకుండా నియంత్రించాలని అనుకున్న బాబ్జీ.. సీనియర్ లీడర్లకు ఎందుకు బ్రేకులు వేయలేదని గట్టిగా నిలదీస్తున్నారట. రాజకీయాల్లో దూకుడు అవసరమైనా.. ఈ తరహా స్పీడ్ ప్రదర్శిస్తే పార్టీలో కొనసాగడం కష్టమని టీడీపీ పెద్దలకు చెప్పాలనే ఆలోచనలో ఉన్నారట నాయకులు. ప్రస్తుతం దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యే వాసుపల్లి, గండి బాబ్జీ ఇద్దరు ప్రజలకు దగ్గరయ్యేందుకు పోటీ పడుతున్నారు. ఇలాంటి తరుణంలో అనవసరమైన వ్యవహారాలను టీడీపీ ఇంఛార్జ్ నెత్తిన పెట్టుకుంటే నష్టం తప్ప ఫలితం ఉండదని పెదవి విరుస్తున్నారట సీనియర్లు.