Telangana Congress Politics
టీ కాంగ్రెస్లో గాలి దుమారం… ఇద్దరు సన్నిహితుల మధ్య గ్యాప్ తెచ్చిందా? పదవి విషయంలో వచ్చిన పొరపచ్చాలు.. పంతాలు అగ్గి రాజేస్తున్నాయా?. ఇంతకీ ఏంటా వైరం? ఎవరా నాయకులు? లెట్స్ వాచ్..!
నాయకుల మధ్య భేదాభిప్రాయాలు తెలంగాణ కాంగ్రెస్లో కామన్. కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు కూడా వస్తుంటాయి. భిన్నాభిప్రాయాలతో ఇబ్బంది లేదు. భేదాభిప్రాయాలతోనే సమస్య. పార్టీలో ఇదే ఇప్పుడు తలనొప్పి. పీసీసీ చీఫ్ రేవంత్కి సన్నిహితంగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ.. ప్రస్తుతం ఆయనతో దూరం పాటిస్తున్నారు. ఆ పంచాయితీపైనే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్లో అనుబంధ సంఘాల్లో మార్పులు..చేర్పులు చేయాలని పార్టీ భావిస్తోంది. ఎన్నికల విధానంతో వచ్చిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి.. NSUI అధ్యక్షుడు వెంకట్ పదవుల్లో మార్పులు లేవు. మిగిలిన కమిటీల ఛైర్మన్లను మార్చే ఆలోచనలో రేవంత్రెడ్డి ఉన్నారట. OBC సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ను మార్చాలని అనుకుంటున్నారట. ఆ పదవిని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంఛార్జ్గా ఉన్న గాలి అనిల్ కుమార్కు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు టాక్. ఈ మేరకు రేవంత్ లేఖ కూడా రాశారట. మహిళా కాంగ్రెస్ పట్ల కూడా పీసీసీ చీఫ్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ విభాగాన్ని పీసీసీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్గౌడ్ పర్యవేక్షిస్తున్నారు. ఆయనతోనూ మహిళా కాంగ్రెస్ విభాగం పార్టీ పనిని షేర్ చేసుకోవడం లేదట.
అందుకే ఆ విభాగాన్ని ప్రక్షాళించాలని చూస్తున్నారట రేవంత్. SC విభాగం ఛైర్మన్ ప్రీతం పార్టీలోని అన్ని గ్రూపులు.. నాయకులతో లౌక్యంగా వెళ్తున్నారు. దాంతో ప్రీతమ్ను కదిలించబోరని సమాచారం.
OBC ఛైర్మన్ మార్పు విషయంలోనే దామోదర రాజనర్సింహ, రేవంత్ మధ్య గొడవ జరుగుతోందట. గాలి అనిల్కు అనుకూలంగా రేవంత్ లేఖ రాయడాన్ని తప్పు పడుతున్నారట. పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేసేవారికి కాకుండా ఇంకెవరికైనా ఆ పదవి ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని అభ్యంతరం వ్యక్తం చేశారట రాజనర్సింహ. దీంతో ఇద్దరి మధ్య ఈ పంచాయితీ తెగేవరకు వెళ్తుందా.. మధ్యలోనే సర్దుకుంటుందా అనే చర్చ సాగుతోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా.. OBC ఛైర్మన్గా శ్రీకాంత్ను కొనసాగించే ఆలోచన రేవంత్కు లేదట. పీసీసీ కార్యక్రమాలను ఆయన పట్టించుకోవడం లేదనే అభిప్రాయంలో ఉన్నారట. అయితే శ్రీకాంత్కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్గౌడ్ మద్దతిస్తున్నారు. ఇది కూడా కాంగ్రెస్లో మరో రచ్చకు కేంద్రం కావొచ్చని సందేహిస్తున్నారు. ముఖ్య నేతల మధ్య తలెత్తుతున్న ఈ అభిప్రాయ భేదాలు .. ఢిల్లీ వరకు వెళ్తాయో.. గాంధీభవన్లోనే సమసి పోతాయో చూడాలి.