NTV Telugu Site icon

తెలకపల్లి రవి : కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబి నోటిఫికేషన్‌ లాభనష్టాల మధనం

ఎపి తెలంగాణల మధ్య ఎడతెగని వివాదంగా మారిన నదీజలాల సమస్యకు పరిష్కారంగా కృష్ణా గోదావరి నదులపై వున్న ప్రాజెక్టులను పూర్తిగా తన అదుపులోకి తీసుకుంటూ కేంద్ర జలశక్తిశాఖ నోటిఫికేషన్‌ ముసాయిదా విడుదల చేసింది. కృష్ణా గోదావరి నదీజలాల నిర్వహణ సంఘాల పరిధినిప్రకటించింది. దీని అమలు కోసం ఇరు రాష్ట్రాలు చెరి 200 కోట్ల చొప్పున చెల్లించాలనీ, అక్టోబర్‌నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటనను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ వ్యతిరేకించగా ఎపి ముఖ్యమంత్రి జగన్‌ ఆహ్వానించారు. వాస్తవంలో ఈ విధమైన నోటిఫికేషన్‌ విడుదల చేయాలని జగన్‌ గతంలోనే కేంద్రాన్ని కోరారు.

నోటిఫికేషన్‌లోని కొన్ని అంశాల పట్ల ఎపికి కూడా అభ్యంతరాలున్నాయి కాని మొత్తం మీద ఇది తమకు అనుకూలమైన పరిణామంగా ఆ ప్రభుత్వం పరిగణిస్తున్నది. నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్యామలరావు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ మేరకు ప్రకటనలు కూడాచేశారు. అయితే రెండు రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు కూడా అధికారికంగా సమగ్రంగా స్పందించేందుకు ఇంకా సిద్ధం కాకపోవడం సమస్య తీవ్రతను తెలుపుతుంది. ఈ నోటిఫికేషన్‌తో మొత్తం ప్రాజెక్టులు కేంద్రం అధీనంలోకి పోవడం లాభమా నష్టమా అని తేల్చుకోలేకపోవడం ఇందుకు కారణం.

read also : హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీపై షర్మిల క్లారిటీ

తెలంగాణలో బిజెపి కాంగ్రెస్‌లు ఎపిలో టిడిపి మామూలు భాషలో దీన్ని తమ ప్రభుత్వాల వైపల్యంగా చెప్పినా వారికి కూడా స్పష్టత వుందని చెప్పలేము, ఉమ్మడిరాష్ట్రనీటిపారుదల మంత్రిగా దీర్ఘకాలం పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య మాత్రం దీనివల్ల మొత్తం ప్రాజెక్టుల వ్యవస్థ కేంద్రం పెత్తనం కిందకు పోతుందని వ్యాఖ్యానించారు.మరింత అధ్యయనం చేశాక స్పందిస్తానంటూనే ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్‌ ప్రభుత్వ చేతగానితనం వల్లనే ఇలా జరిగిందన్నారు.
వాస్తవానికి గత ఏడాది అక్టోబర్‌లో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ పాల్గొన్న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనే కెఆర్‌ఎంబి పరిధిని నోటిఫై చేయాలని భావించారు.అయితే తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ చేసిన కృష్నా జలాల పంపిణీని సవాలు చేస్తూ కొత్త ట్రిబ్యునల్‌ వేయాలని కోరింది. దీనిపై అప్పటికే ఆ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే పరిశీలిస్తామని కేంద్రం చెప్పింది,

కొంత వ్యవధి తర్వాత తెలంగాణ తన కేసు ఉపసంహరించుకుంది, ఇంతలో ఎపి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ను టెండర్లను ఆహ్వానించడం,రాజోలిబండ డైవర్షన్‌ స్కీం కుడికాలువ నిర్మాణం చేపట్టడం పట్ల తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెల్పింది, వాటికి అనుమతి లేదని కెసిఆర్‌ వాదిస్తే అసలు తెలంగాణ కట్టే డిరడి,పాలుమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో సహా అత్యధిక ప్రాజెక్టులకు అనుమతి లేదని ఎపి ప్రతివిమర్శ చేసింది.ఇద్దరికీ కెఆర్‌ఎంబి నోటీసులు ఇచ్చింది. దీనికి తోడు శ్రీశైలంలో నీళ్లు లేకున్నా జలవిద్యుత్‌ ఉత్పత్తి చేసి నీటిని కిందకు వదలడం వల్ల తాము నష్టపోతున్నామని ఎపి ఫిర్యాదు చేసింది. కేంద్రం నుంచి కదలిక లేదని సుప్రీంలో కేసు వేసింది. దీనిపై టిఆర్‌ఎస్‌ మంత్రులు తీవ్రంగా మాట్లాడటం ఉద్రిక్తత పెంచింది. తాము సంయమనం చూపిస్తున్నామంటూ ఎపి ముఖ్యమంత్రి జగన్‌ దీనిపై ప్రధానికి లేఖ రాశారు.

ఈ వివాదం బూటకమని రాజకీయ ప్రయోజనం కోసమే ఇరు రాష్ట్రాలు కావాలని సృష్లించాయని టిడిపి కాంగ్రెస్‌ బిజెపి వంటిపార్టీలు విమర్శించాయి. ఇలాటి పరిస్థితులలో కేంద్రం నోటిఫికేషన్‌ వెలువడిరది.దీనిపై ఇంకా పూర్తి స్పష్టత వచ్చిందని చెప్పడం కష్టం.కాని ఇరువురు ముఖ్యమంత్రులు కలిసికూచుని చర్చించుకోవడం బదులు కేంద్రం అధీనంలోకి పోవడం జరిగిపోయింది.వాటాల పంపిణీ,నీటి విడుదల వంటి సమస్యలు అంతరాష్ట్ర వివాదాలై పోయాయి.ఎపి విభజనచట్టం సెక్షన్‌85(1), అంతరాష్ట్ర నదీజలాల వివాద చట్టం సెక్షన్‌87(1) రెండిరటినీ ఈ నోటిఫికేషన్‌లో ఉపయోంచారు. ఇరురాష్ట్రాలలోని ప్రాజెక్టులను కెఆర్‌ఎంబి జిఆర్‌ఎంబి పరిదిలోకి తీసుకుని సిఐఎస్‌ఎఫ్‌ దళాల భద్రత కల్పిచండం ఇందులో ముఖ్యాంశం, అంటే రాష్ట్రాలు తమ పోలీసులను ప్రయోగించి అనుకున్నట్టు చేయడానికి అవకాశం వుండదు.

అందులోనూ మూడు రకాలుగా విభజించారు. పార్ట్‌1లో వున్నవి గతంలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో అంగీకారం కుదిరినవి, పార్ట్‌2లో వున్నవి వివాద గ్రస్తమైనవి. వీటిని పూర్తిగా కేంద్రం అదుపులోకి తీసుకుంది. పార్ట్‌3లో వున్నవి కూడా బిన్నబిప్రాయాలతో కూడినవి అయినా వాటిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న తీరులోనే ఇకముందు కూడా జరుగుతుంది.అయితే అవి బోర్డుల నిర్దేశంలో పనిచేయాల్సి వుంటుంది, ఏతావాతా ఎపితెలంగాణల ప్రాజెక్టులు మొత్తం కేంద్రం గుప్పిట్లోకి వెళ్లినట్టే, సంప్రదింపుల ద్వారా పరిష్కారం కాలేదు గనకనే ఈ పనిచేయవలసి వచ్చిందని జలశక్తి శాఖ వివరించింది.ఇందులో అత్యధికంగా తమ ప్రాజెక్టులే కేంద్రం స్వాధీనం చేసుకుందిన తెలంగాణ ప్రభుత్వం లెక్కలు చెబుతున్నది.రెండు నదుల మీద కలసి107 ప్రాజెక్లులుండగా తెలంగాణకు చెందిన 79,ఎపికి చెందిన15,ఉమ్మడిగా వున్నవి13 బోర్డుల పరిధిలోకి పోతున్నాయని అంటే తమకు ఎక్కువ నష్టం కలుగుతుందని వాదిస్తున్నది.

ఈ లెక్కలతో ఏపి ఏకీభవించకపోవచ్చు.గోదావరి ప్రాజెక్టులు ఎందుకు కలపాలనికూడా ప్రశ్నిస్తున్నది, అయితే కాళేశ్వరం పోలవరం వంటివాటిపైతేడాలున్నమాట కాదనలేనిది. ఎక్కువ ప్రాజెక్టులు అనుమతిలేకుండా కడుతున్నందునే ఇలా జరిగిందనీ ఎపి నేతలు చెప్పొచ్చు,ఎపికి సంబంధించి అత్యంత పురాతనమైన ధవళేశ్వరం.ప్రకాశం బ్యారేజీతో ఇటీవలి పట్టిసీమతో సహా బోర్డుల పరిధిలోకి పోగా తెలంగాణలో కాళేశ్వరం నుంచి అన్ని నోటిఫికేషన్‌లో వున్నాయి. అయితే పైన పేర్కొన్నట్టు ఇందులో మూడు రకాలు వున్నా ఆచరణలో ఆటంకాలు వస్తాయని ఇరురాష్ట్రాలకూ సందేహాలున్నాయి. అయితే దిగువ రాష్ట్రమైన ఎపి ప్రభుత్వం ఇందులో కొంత రక్షణ వుందని స్వాగతిస్తున్నది.

తెలంగాణ ముఖ్యమంత్రి విస్త్రతమైన చర్చ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని భావిస్తున్నారు. ఢల్లీివెళ్లిచర్చలు జరుపుతానని ఆయన చెప్పారు. రాయలసీమ నీటిపారుదల అంశాలను అనవసరంగా చేర్చారని దీనిపై కేంద్రానికి రాయాలని ఎపి ముఖ్యమంత్రిజగన్‌ చెప్పినట్టు సమాచారం.వివాద పరిష్కారం కోసం సకాలంలో చర్యలు తీసుకోకుండా ఇక్కడి దాకా తెచ్చిన కేంద్రం ఇప్పుడైనా ఎలా వ్యవహరిస్తుందో చెప్పడం కష్టమే. ఈ లోగా కోర్టుత ఆదేశాలు, ప్రభుత్వాల స్పందనలు కూడాచూడవలసి వుంటుంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు రాజకీయ పక్షాలు కూడా తాత్కాలిక రాజకీయ కోణంలో గాక దీర్ఠకాలిక ప్రయోజనాల దృష్టితో ఆలోచించి ప్రతిస్పందించడం ఇప్పుడు మరింత అవసరం, కేంద్రం కూడా తన అధికారాన్ని సామరస్య పరిష్కారం కోసం వినియోగించాలి తప్ప సమస్యను జటిలం చేసే చర్యలకు పాల్పడదని ఆశించాలి.