OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?

Mantralayam Tdp Politics

Mantralayam Tdp Politics

OTR: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పాటైంది. అప్పుడు తప్ప ఆ తరువాత ఎప్పుడూ… ఇక్కడ టీడీపీ జెండా ఎగర లేదు. అందుకు బలమైన ప్రత్యర్థి ఒక కారణం కాగా, టీడీపీలో మితిమీరిన గ్రూప్ రాజకీయాలు మరో రీజన్‌ అని చెబుతారు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను కూటమి 12 సీట్లు దక్కించుకుంది. ఓడిపోయిన రెండింటిలో మంత్రాలయం ఒకటి. దీంతో టీడీపీ అధిష్టానం ఈ నియోజకవర్గం మీద గట్టిగా దృష్టి పెడుతోందట. తాజా పర్యటనలో సీఎం చంద్రబాబు దీని గురించే స్థానిక నాయకులతో చర్చించినట్టు తెలిసింది. ప్రధానంగా ప్రత్యర్థి బాలనాగిరెడ్డి బలంగా ఉండడం, అందులోనూ… 7 గ్రామాలు ఆయ కట్టడిలోనే ఉండి టీడీపీ నాయకులు అడుగుపెట్టలేని పరిస్థితులు ఉన్నట్టు ఆ రివ్యూలో తేలిందట. అదే సమయంలో టీడీపీ అంతర్గత పోరు ప్రస్తావన కూడా వచ్చింది.

మంత్రాలయంలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే బలనాగిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009,14, 19, 24…. ఇలా వరుసగా మంత్రాయలయం ఎమ్మెల్యే ఎవరంటే బాలనాగిరెడ్డేనన్నది సమాధానం. తొలిసారి 2009లో టీడీపీ తరపున గెలిచిన బాలనాగిరెడ్డి… ఆ తరువాత వైసీపీ నుంచి గెలుస్తూ వస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఎమ్మెల్యే హోదాతోనే అపార్టీలో చేరారాయన. దీంతో అప్పట్లో అనర్హత వేటు పడింది. ఇక నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో ఆయనకు పూర్తిగా పట్టుందని చెబుతారు. అది ఎంతలా అంటే… ప్రత్యర్థులు ఆయా గ్రామాల్లో కనీసం ప్రచారం చేయడానికి కూడా వీల్లేదట. కగ్గల్లు, నారాయణపురం, రాంపురం, బసాపురం, కాచపారం, తుంగభద్ర, దిబ్బలదొడ్డి గ్రామాల్లో బలానాగిరెడ్డిదే ఆధిపత్యమని చెబుతారు. 2019 ఎన్నికలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తిక్కారెడ్డి ఆయా గ్రామాలలో ప్రచారానికి ప్లాన్ చేసి కగ్గల్లులో అడుగుపెట్టగానే ప్రత్యర్థులు దాడి చేయడం, గన్‌మెన్ కాల్పులు జరపడం, తిక్కారెడ్డి కాలిలోకి బుల్లెట్‌ దూసుకుపోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో 2024 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన రాఘవేంద్ర రెడ్డి ఆ గ్రామాల్లో ప్రచారం చేసే సాహసం కూడా చేయలేదట.

ఈ క్రమంలో… చంద్రబాబు తాజా పర్యటనలో ఆ ఊళ్ళలో టీడీపీ జెండా ఎగరేయాలని అదేశించినట్టు తెలిసింది. ఆ ఏడు ఊళ్ళలో ఏకపక్ష ఎన్నిక కారణంగానే… వైసీపీ వరుసబెట్టి గెలుస్తోందని, ఇప్పుడు అక్కడ పసుపు జెండా ఎగరేయాల్సిందేనని టీడీపీ అధ్యక్షుడు గట్టిగా ఆదేశించినట్టు సమాచారం. అక్కడ వైసీపీ అరాచకాలకు అడ్డు కట్ట వేస్తామని కూడా చెప్పారట చంద్రబాబు. అలాగే. మంత్రాలయం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పార్టీలోని గ్రూపుల ప్రస్తావన కూడా వచ్చిందట. బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోవడంపై బాబు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీలో గ్రూపులు ఉండడానికి వీల్లేదని, ఉండాల్సింది ఒక్కటే… అదీకూడా పార్టీ గ్రూపే అయి ఉండాలని చెప్పారట. జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ రాఘవేంద్ర రెడ్డి సమక్షంలోనే అందరూ కలసి పనిచేయాలని గట్టిగా చెప్పినట్టు తెలిసింది. 2029 ఎన్నికల్లో మంత్రాలయంలో టీడీపీ జెండా ఎగరాలని, అందరూ కలసి కట్టుగా పని చేయాల్సిందేనని క్రిస్టల్ క్లియర్‌గా చెప్పేశారు సీఎం. అధిష్టానం అంత పట్టుదలగా ఉండటంతో, ఇక్కడ వైసీపీని దెబ్బకొట్టాలన్న లక్ష్యం నెరవేరుతుందా…టీడీపీ లో గ్రూపు రాజకీయాలకు స్వస్తి చెబుతారా….? అన్నది ఆసక్తికరంగా మారింది.