హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన కామెంట్స్ చర్చగా మారాయి. ఆయన ఎందుకు ఆ ప్రకటన చేశారు? అప్పట్లో GHMC ఎన్నికల్లో పార్టీ ఎత్తుకున్న టోన్నే ఇప్పుడు కొత్తగా అందుకున్నారా? లేక.. ప్రత్యర్థిపార్టీ ముందరి కాళ్లకు బంధాలేసే వ్యూహమా? ఇంతకీ కొప్పుల ఏమన్నారు?
హుజురాబాద్లో కొప్పుల కామెంట్స్పై చర్చ..!
షెడ్యూల్ విడుదలతో హుజురాబాద్లో ఎన్నికల హీట్ అమాంతం పెరిగింది. ఎన్నికల వ్యూహాలకు ప్రధాన పార్టీలు మరింత పదును పెడుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి అస్త్రాలు బయటకు తీయాలి? ఏ వ్యూహం రచిస్తే.. ప్రత్యర్థులు చిక్కుతారు? ఎదుటి పక్షంపై పైచెయ్యి సాధించేందుకు ఉన్న అవకాశాలేంటి? అనేదానిపై భారీగానే కసరత్తు చేస్తున్నాయి పార్టీలు. ఇదే సమయంలో హుజురాబాద్లో టీఆర్ఎస్ తరఫున ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన కామెంట్స్ వేడి పుట్టిస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యల చుట్టూ చర్చ మొదలైంది.
కొప్పుల చీకట్లో బాణం వేశారా..?
ఈ కామెంట్సే ఆసక్తికర చర్చకు కారణం అయ్యాయి. బీజేపీ ఒక దుర్మార్గపు పన్నాగం పన్నిందన్నది కొప్పుల ఆరోపణ. ఈటల రాజేందర్పై దాడి జరిగినట్టు సృష్టించి.. కాళ్లు, చేతులకు ఆయన కట్లు కట్టుకుంటారని చెప్పుకొచ్చారు మంత్రి. ఆ కట్లతోనే ఊరూరు తిరిగి ఓట్లను అభ్యర్థిస్తారని ఒక బాణం వదిలారు. అయితే కొప్పుల ఏదైనా అనుమానంతో అన్నారా? లేక ఆయనకు అలాంటి సమాచారం ఉందా? లేకపోతే చీకట్లో ఒక రాయి విసిరి.. ప్రత్యర్థులను ఇరకాటంలో
జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో చేసిన కామెంట్స్పై చర్చ..!
ఒకసారి గతంలోకి వెళ్దాం. GHMC ఎన్నికల సమయంలోనూ బీజేపీని ఉద్దేశించి టీఆర్ఎస్ నుంచి ఇలాంటి కామెంట్సే వచ్చాయి. హైదరాబాద్లో కుట్రలు చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు చేయొచ్చని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ సమరంలో అధికార పార్టీ నేతల నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి కూడా. ఇప్పుడు హుజురాబాద్లో కొప్పుల ఈశ్వర్ చేసిన కామెంట్స్ విన్న తర్వాత.. నాటి GHMC ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను గుర్తు చేసుకుంటున్నారు. GHMC ఎన్నికల కంటే ముందు.. దుబ్బాక ఉపఎన్నిక టైమ్లో ఒక బీజేపీ కార్యకర్త హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్ ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించారు. అలాంటి ఘటనలు జరగొచ్చని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల టైమ్లో అనుమానించారో ఏమో.. నాడు ముందుగానే ప్రకటనలు చేసి చర్చకు పెట్టింది అధికారపార్టీ.
బీజేపీ ముందరి కాళ్లకు బంధలేశారా?
హుజురాబాద్ ఉపఎన్నిక అధికార టీఆర్ఎస్కు ఎంత కీలకమో.. మాజీ మంత్రి ఈటల రాజేందర్కు కూడా అంతే ప్రతిష్టాత్మకం. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ కంటే.. టీఆర్ఎస్, ఈటల మధ్యే పోరు అన్నది అంతా అనుకునే మాట. అధికార పార్టీలో అందరి దృష్టీ ఈటలపైనే ఉంది. ఇప్పుడు మంత్రి కొప్పుల అనుమానించినట్టు ఈటల శిబిరం లేదా బీజేపీ అలాంటి ఆలోచనలో ఉందో లేదో కానీ.. TRS కాషాయ దళం ముందరి కాళ్లకు బంధాలేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. కొప్పుల అనుమానాలపై బీజేపీ రియాక్షన్ ఏంటో చూడాలి.
