OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..

  • రిక్రూట్‌మెంట్‌ జీవోల విషయంలో తడబాట్లు
  • పాలకులు సీరియస్‌గా ఉన్నా అధికారుల స్థాయిలో తప్పులు?
  • పదే పదే జీవోలు మార్చడంతో పెరుగుతున్న అనుమానాలు
  • డీఎస్సీపై జీవోల మార్పులతోనే పెరిగిన డౌట్స్‌
  • పారదర్శకంగా జరిగినా మార్పులే రచ్చ పెట్టాయన్న అభిప్రాయం
Otr

Otr

OTR: తప్పుల మీద తప్పులు…. వరుస తడబాట్లు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఇస్తున్న జీవోల విషయంలో పరిపాటిగా మారిన పొరపాట్లు. ముందు ఒక జీవో జారీ చేయడం, దాని మీద ఏదో ఒక అభ్యంతరం వ్యక్తం కావడం, తర్వాత సవరిస్తూ మరో ఉత్తర్వు ఇవ్వడం. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఎక్కడ తేడా కొడుతోంది? ఈ ప్రసహసం గురించి కూటమి వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి? యువతకు ఉపాధి కల్పన విషయంలో సీరియస్‌గా అడుగులేస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఓవైపు ప్రైవేట్‌ పెట్టుబడుల్ని ఆకర్షిస్తూనే… మరోవైపు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేస్తోంది. ఆ దిశగా గట్టి కసరత్తే జరుగుతోంది. కానీ… పాలకులు ఆ స్థాయి సీరియస్‌గా ఉంటే… జీవోల విషయంలో తప్పటడుగులు ఎందుకు పడుతున్నాయి? ఎవరు తప్పు చేస్తున్నారు? ఎక్కడ తేడా కొడుతోందంటూ రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. అందుకు ఇటీవల జరుగుతున్న వ్యవహారాలనే ఉదహరిస్తున్నారు. పాలకుల నోటీస్‌లో లేకుండా ఉన్నతాధికారులే… ఒక ప్రొసీజర్‌ పాటించకుండా ముందు ఇష్టానుసారం జీవోలు ఇచ్చేసి తర్వాత నాలుక కరుచుకుంటున్నారా అన్న సందేహాలు సైతం ఉన్నాయి.

డీఎస్సీ విషయంలో జరిగిన రచ్చను మర్చిపోక ముందే…తాజాగా పశు సంవర్ధకశాఖ వంతొచ్చింది. దీంతో… జీవోలు ఇవ్వడం, వెంటనే రద్దు చేయడం, మరోటి ఇవ్వడం లాంటి చర్యలతో… ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళవా అన్న డిస్కషన్స్‌ మొదలయ్యాయి. డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ నియామకాల విషయంలో అనేక అవకతవకలు జరిగాయంటూ నిత్యం ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తోంది వైసీపీ. విపక్షం గట్టిగా టార్గెట్‌ చేయడం, అందుకు ప్రభుత్వం వివరణ ఇవ్వడంలాంటివి ఇప్పటికి చాలాసార్లు జరిగాయి. అసలీ ఆరోపణలు, గందరగోళానికి కారణం ఏంటంటే… జీవోల్ని మార్చి మార్చి ఇవ్వడమేనన్నది పరిశీలకుల మాట. పాత జీఓల్లో మార్పులు చేసి.. స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలకు అర్హత కల్పించడం, తర్వాత దాన్ని మార్చి మరో ఉత్తర్వు ఇవ్వడం, రాత పరీక్ష ఉంటుందంటూ అందులో పేర్కొనడం లాంటి చర్యలకు గందరగోళం, అనుమానాలు ఒకేసారి పెరిగాయని అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం వివరణ ఇస్తున్నట్టు డిఎస్సీ రిక్రూట్‌మెంట్‌ నూటికి నూరు శాతం పారదర్శకంగా జరిగినా… ఈ వరుస జీవో మార్పిళ్ళతో లేనిపోని అనుమానాలకు తావిచ్చినట్టయిందన్నది విశ్లేషకుల అభిప్రాయం.

ఆ రచ్చ అలా పూర్తిగా సద్దుమణక్కముందే ఇప్పుడు తాజాగా పశు సంవర్థక శాఖ వంతు వచ్చింది. ఈ శాఖలో 164 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాలను జాబ్‌ క్యాలెండర్‌లో భాగంగా భర్తీ చేయాలని నిర్ణయించింది సర్కార్‌. మెరిట్‌ ప్రాతిపదికనే నియామకాలు చేపట్టాలని మొదట నిర్ణయించారు. అయితే… APPSC నుంచి కాకుండా… మెరిట్‌ ప్రాతిపదినక చేస్తే… అవకతవకలకు ఆస్కారం ఉంటుందన్న చర్చ మొదలైంది. దీంతో… ఇప్పటికే డీఎస్సీతో ఇబ్బందులు పడ్డ ప్రభుత్వం మెరిట్‌ బేస్‌లో కాకుండా… రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ…మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చింది. ఇలా… కీలకమైన అంశాలు, నియామకాలకు సంబంధించి పదే పదే నిర్ణయాలు మారడం, కొత్త కొత్త జీఓలు ఇవ్వడం గురించి కూటమి వర్గాల్లో కూడా హాట్‌ హాట్‌ చర్చలు జరుగుతున్నాయి. సున్నితమైన నిరుద్యోగుల విషయంలోనే… ఈ రకంగా వ్యవహరిస్తే.. ముందు ముందు మరిన్ని ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం అధికారపక్షంలో బలపడుతోందట.

డీఎస్సీ విషయంలో ఇప్పటికే నానా యాగీ జరుగుతోందని, మళ్ళీ పశు సంవర్ధక శాఖలో కూడా ఇదే పరిస్థితి ఉంటే…. ప్రతిపక్షం చేతికి కత్తి అందివ్వడమేనని అంటున్నారు. కీలకమైన యువత, నిరుద్యోగ వర్గాలతోపాటు వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కోక తప్పదన్న భయాలు సైతం ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జెన్ జీ ట్రెండ్‌ నడుస్తోంది. ఇలాంటి కీలక సమయంలో… డీఎస్సీ, పశు సంవర్ధక శాఖలో నియామకాల విషయంలో తేడాలు జరిగితే యువతలో వ్యతిరేక భావం పెరుగుతుందని అంటున్నారు. ప్రభుత్వం ఉద్దేశ్యం మంచిదే అయినా, పారదర్శకంగా నిర్వహించాలని అనుకుంటున్నా…జీవోల జారీ విషయంలో పొరపాటుగానో, తడబాటుతోనో అధికారులు చేసే తప్పులకు మనం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ ప్రత్యేకించి తెలుగుదేశం వర్గాల్లో డిస్కషన్‌ నడుస్తోందట. అంతేగాక…. కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీ నుంచి కూడా ఆశించిన స్పందన ఉండటం లేదని తమ్ముళ్లు ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. కీలకమైన ఉద్యోగ నియామకాల విషయంలో పదేపదే జీవోలు మార్చడం లాంటి చర్యలతో అనుమానాలు పెరుగుతాయి, పని చేసి చేసి కూడా ప్రయోజనం ఉండబోదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తప్పు ఏ స్థాయిలో జరిగినా…. అంతిమంగా దాన్ని భరించాల్సింది మాత్రం ప్రభుత్వమే గనుక జాగ్రత్తపడకుంటే…ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందన్న హెచ్చరికలు సైతం ఉన్నాయి.