Site icon NTV Telugu

OTR: మున్సిపల్‌ యుద్ధం కోసం కాషాయ దళం కత్తులు.. ఈసారి సీరియస్‌గా ఉన్న కేంద్ర పార్టీ!

Otr

Otr

OTR: మున్సిపల్ ఎన్నికల్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు అగ్ని పరీక్షగా భావిస్తున్నారా? తేడా పడితే…. రేపు ఢిల్లీలో ముఖం చూపించుకోలేమని ఫీలవుతున్నారా? కేంద్ర నాయకత్వం కూడా అదే అభిప్రాయంతో ఉండటం ఎంపీల్ని కంగారు పెడుతోందా? ఇప్పుడు చెమటోడ్చకపోతే…. రేపు చిన్న చిన్న పనులు కూడా కావన్న భయం కాషాయ ఎంపీల్లో పెరుగుతోందా? గల్లీ ఎన్నికల కోసం ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న మంత్రాంగం ఏంటి?

తెలంగాణ మున్సిపల్ యుద్ధం కోసం అన్ని రకాల అస్త్ర శస్త్రాలతో రంగంలోకి దిగుతున్నాయి ప్రధాన రాజకీయ పక్షాలు. ఇవి పార్టీ సింబల్స్‌తో జరిగే ఎన్నికలు కావడం, ఎవరి బలమేంటో బయటపడే ఛాన్స్‌ ఉండటంతో… వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా అంతా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే… కాషాయ దళం కూడా గట్టిగానే కత్తులు నూరుతోందట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ… అధిష్టానం ఈ మున్సిపల్‌ ఎలక్షన్స్‌ని సీరియస్‌గా తీసుకుందట. ఇప్పటికే ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర పార్టీ… ప్రత్యేక ఇన్ఛార్జ్‌లను నియమించింది. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఈ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు.

OTR : నందిగం సురేష్‌కు షాక్..! నిన్నటి అనుచరులే నేడు శత్రువులా..?

దీన్నిబట్టే మున్సిపల్‌ ఎలక్షన్స్‌ని ఆ పార్టీ ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్ధమవుతోందంటున్నారు. ఇదే ఇప్పుడు రాష్ట్రంలోని పార్టీ ఎంపీలకు సంకటంగా మారినట్టు తెలుస్తోంది. కేంద్ర పార్టీ ఆ స్థాయిలో సీరియస్‌గా ఉన్నందున ఎంపీలకు ఈ ఎలక్షన్స్‌ ఛాలెంజ్‌గా మారాయన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఏదో…. జరిగేదో జరిగిపోతుందిలే అంటూ… గతంలో లాగా ఈజీగా తీసుకునే అవకాశం వాళ్ళకు లేకుండా పోయిందంటున్నారు. పార్టీ ఎంపీలకు పార్లమెంట్ సమావేశాల నుంచి కూడా మినహాయింపు ఇచ్చారంటేనే… తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్ని కమలం హైకమాండ్‌ ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందో అర్ధమవుతుందని అంటున్నారు పరిశీలకులు. దీంతో మరోమాట లేకుండా బీజేపీ ఎంపీలు ఈ ఎన్నికలను నెత్తిమీద వేసుకొని తిరుగుతున్నారట.

తమ పరిధిలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెల్చుకుని సత్తా చాటడం కోసం కేంద్ర పార్టీ తమకు పెట్టిన అగ్ని పరీక్ష ఇది అంటూ ఒకరిద్దరు ఎంపీలు సన్నిహితుల దగ్గర అంటున్నట్టు సమాచారం. ఇక ఢిల్లీ పెద్దల మనసేంటో అర్ధం చేసుకున్న రాష్ట్ర బీజేపీ ఎంపీలు తమలో తాము పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. మిగతా వాళ్ళ కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుని ఆధిపత్యం చాటడంతోపాటు పార్టీ ముఖ్యుల మనసు కూడా గెల్చుకోవాలని భావిస్తున్నారట కొందరి కమలం పార్లమెంట్‌ సభ్యులు. అందుకే….. అభ్యర్థుల ఎంపిక, ప్రచార బాధ్యతల్ని పూర్తిగా తమ భుజాల మీద వేసుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు. రేపు పక్కవాళ్ళతో పోలిక వచ్చినప్పుడు తాము తక్కువ కాకుండా ఉండటం కోసం తమ పరిధిలోని మున్సిపాలిటీలన్నిటినీ చుట్టేస్తున్నారట ఎంపీలు. బీజేపీకి అర్బన్‌ పార్టీ ఇమేజ్‌ ఉంది. అందుకు తగ్గట్టే…. ఎంపీలు గెలిచిన నియోజకవర్గాల్లో పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఓట్లు పడ్డాయి.

T20 World Cup 2026: సంజూ శాంసన్‌కు షాక్.. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఫిక్స్!

ఇప్పుడు ఆ ఓట్లన్నీ మున్సిపల్ అభ్యర్థులకు రాకుంటే… ఎంపీలు డిఫెన్స్‌లో పడే అవకాశం ఉందని, అందుకే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. ఒక వేళ తేడా వస్తే కేంద్ర పార్టీకి జవాబు చెప్పుకోవాలి. భవిష్యత్‌లో ఏదైనా కావాల్సి వస్తే అడగలేము, అందుకే ఈ ఎన్నికల్లో మనల్ని మనం నిరూపించుకోవాలని ఎంపీలు భావిస్తున్నట్టు తెలిసింది. ప్రధాని మోడీకి ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతల మీద సదభిప్రాయం లేదని, మున్సిపల్‌ ఎలక్షన్స్‌లో సత్తా చాటి ఆయన అభిప్రాయాన్ని కూడా మార్చాలని భావిస్తున్నారట పార్టీ ఎంపీలు. ఎవరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.

Exit mobile version