ఆ సీట్లో ప్రయోగాలకు వైసీపీ ఫుల్ స్టాప్ పెట్టేసిందా…? ఫలితం రానప్పుడు ఎవరైతే ఏంటి…? కొత్త కృష్ణుడు కంటే పాత కాపే బెటర్ అని ఫీల్ అవుతోందా…? అందుకే డైలమాలో ఉన్న నేతకు కొత్త జోష్ ఇచ్చి రంగంలోకి దించేసిందా..! పొలిటికల్గా ఇక కనుమరుగే అనుకుంటున్న టైంలో కొత్త రాజకీయానికి సిద్ధమవుతున్నది ఎవరు? ఏ సీట్లో ఎక్స్పెరిమెంట్స్కు వైసీపీ ఇక ఫుల్ స్టాప్ పెట్టేసింది? విశాఖపట్టణం పశ్చిమ నియోజవర్గం విషయంలో వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటిదాకా రకరకాల ప్రయోగాలు చేసిన ఫ్యాన్ అధిష్టానం అవేవీ వర్కౌట్ అవలేదన్న నిర్ణయానికి వచ్చిందా? లేక లోకల్గా ఆ పార్టీకి అంతకు మించి మరో నాయకుడు దొరకలేదా అంటూ చర్చించుకుంటున్నాయి రాజకీయవర్గాలు. మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్కే మళ్ళీ నియోజకవర్గ సారధ్య బాధ్యతలు అప్పగించడంతో… ఈ తరహా చర్చలు మొదలయ్యాయి. ప్రతిపక్షానికి మరో గత్యంతరం లేకనేనా అన్న పాయింట్ దగ్గర రకరకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో కాపు, బీసీ,ఎస్సీ,మైనారిటీ వర్గాల ఓటు బ్యాంక్ ఎక్కువ. అయితే… గవర, కాపు సామాజిక వర్గాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. 2009లో ఈ నియోజకవర్గానికి తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, పీఆర్పీ గవర కులానికి చాన్స్ ఇవ్వగా… టీడీపీ కాపు ఓటును ట్రంప్ కార్డుగా భావించింది. కానీ… ఆ ఎన్నికల్లో 4 వేలకు పైగా మెజార్టీతో… కాంగ్రెస్ అభ్యర్ధిగా మళ్ళ విజయ ప్రసాద్ గెలిస్తే…. పీఆర్పీ సెకండ్ ప్లేస్తో సరిపెట్టుకుంది.ఇక్కడ కాపు ఓట్ల చీలిక కాంగ్రెస్ కలిసి రాగా… కొత్త రాజకీయ ఆలోచనలకు ఆ ఎన్నికలే కారణం అయ్యాయి. ఇక 2014, 2019,2024 ఎన్నికల్లో ఇక్కడ గెలుపు కోసం వైసీపీ గట్టిగా ప్రయత్నించినా… అది కలగానే మిగిలిపోయింది. ప్రతీసారీ బలమైన అభ్యర్ధులను బరిలోకి దించినా… బోణీ కొట్టలేకపోయింది. వరుసగా మూడు ఎన్నికల్లో ముగ్గురికి టికెట్లు ఇచ్చినా రాజకీయంగా ఆధిపత్యం దక్కక పోగా చివరి నిముషంలో ప్రయోగాలు విఫలం కావడం, బరిలో దిగిన వాళ్ళు ఎన్నికల తరువాత దూరం కావడం వంటి పరిణామాలు ఇక్కడ వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని సృష్టించాయట. 2014లో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడికి టికెట్ లభించింది. అప్పుడు దాడి కుటుంబం అనకాపల్లి సీటు ఆశించినా… అధినాయకత్వం ఆదేశాలతో అయిష్టంగానే బరిలోకి దిగింది. ఇక 2019లో మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్కి ఛాన్స్ వచ్చింది.
అప్పుడు రాష్ట్రమంతా వైసీపీ ప్రభంజనం ఉన్నా…విశాఖ సిటీలో టీడీపీ నాలుగు సీట్లు గెల్చుకుంది. వాటిలో పశ్చిమ నియోజకవర్గం ఒకటి. 2024లో టీడీపీ నుంచి వచ్చిన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ను బరిలోకి దించింది వైసిపి… సామాజిక, రాజకీయ, ఆర్థిక పలుకుబడి కలిగిన ఆనంద్ పోటీకి దిగడంతో నాటి సిట్టింగ్ గణబాబుకు బలమైన ప్రత్యర్థి తగిలాడని క్యాడర్ సంతోష పడింది. కానీ… సేమ్ టు సేమ్ ఫలితమే రిపీట్ అవ్వగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే ట్యాగ్ లైన్ తో నియోజకవర్గంలో గట్టిపట్టు సాధించారు సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు. ఆ తర్వాత కొద్ది రోజులకే వైసీపీని వీడి బీజేపీలోకి జంప్ కొట్టారు ఆనంద్. సమన్వయ కర్త మార్పు, టికెట్ దక్కకపోవడంతో తటస్థ వైఖరి ప్రదర్శించారు మాజీ ఎమ్మెల్యే మళ్ళ. 2024 తర్వాత వ్యాపార ఒడిదుడుకులు, వ్యక్తిగత కారణాలతో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారాయన. ఇటీవల మళ్ళకు చెందిన వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు, ఆస్తుల ఫ్రీజింగ్ వంటి చర్యలు ఆయన మీద ఇంకాస్త నెగెటివిటీని పెంచాయని అంటారు. ఆ దెబ్బకు విజయ ప్రసాద్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా జరుగుతారని ఫ్యాన్ పార్టీ వర్గాలు కూడా భావించాయట. కానీ… అనూహ్యంగా…. అధిష్టామం మాత్రం విశాఖ పశ్చిమ బాధ్యతల్ని మళ్ళ చేతుల్లోనే పెట్టేసింది. దాంతో… ఇంతకు మించిన వేరే ఆప్షన్ లేకనా? ఇక ప్రయోగాలు చేసే ఓపిక లేకనా అన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే… ఇక నుంచి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా… స్థిరమైన నాయకత్వానికి బాధ్యతలు అప్పగించడం కీలకమన్న భావనతోనే మళ్ళ విజయ్ ప్రసాద్ను సమన్వయకర్తగా మళ్లీ యాక్టివేట్ చేసినట్టు చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. ప్రస్తుతం పశ్చిమ నియోజకవర్గంలో వైసిపి కేడర్ బలంగా ఉన్నా…. నాయకుల మధ్య సమన్వయం అనేది సమస్యగా కనిపిస్తోంది. వీటన్నిటిని అధిగమించి సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబును ఎదుర్కోవడం అంత ఈజీ టాస్క్ కాదని అంగీకరిస్తూనే… నో మోర్ ఎక్స్పెరిమెంట్స్ అంటోందట ఫ్యాన్ నాయకత్వం. ఇక్కడ వ్యక్తిగతంగా విజయప్రసాద్కు ఉన్న పరిచయాలు, రాజకీయంగా నష్టపోయారన్నసింపథీ, వెల్ఫేర్ గ్రూపు ఆటుపోట్లకు గురైనా తాను ఎక్కడికి పారిపోలేదని నమ్మించుకునే ప్రయత్నంలో విజయ ప్రసాద్ సక్సెస్ అయితే మరోసారి పశ్చిమ రాజకీయాలు ఆసక్తికరంగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రయోగాలకు బ్రేక్వేసి లోకల్ స్ట్రాటజీని అమలు చేయాలన్న ఫ్యాన్ పార్టీ వ్యూహాలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయనేది ఇప్పుడు చర్చనీయాంశం.

