బెజవాడ గ్లాస్ లీడర్స్కు బెంగ పట్టుకుందా? ఏమో… ఏమవుతుందో…. ఎలా కుదురుతుందోనని బాగా టెన్షన్ పడుతున్నారా? ఇదే లాస్ట్ ఛాన్స్, మిస్ అయితే…. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల దాకా…. మాట్లాడ్డానికి ఉండదు. ఇప్పుడేం చేయాలి…? మనం ఎలా పావులు కదపాలంటూ కంగారు పడుతున్నారా? అందుకోసం కొత్త కొత్త లెక్కలు కూడా తెర మీదికి వస్తున్నాయా? అసలింతకీ….విజయవాడ జనసేనలో ఎందుకంత ఆందోళన? దేని గురించి పార్టీ నాయకులు టెన్షన్ పడుతున్నారు? ఎన్టీఆర్ జిల్లాలో… ప్రత్యేకించి విజయవాడలో జనసేన నేతలు తెగ టెన్షన్ పడుతున్నారట. స్థానిక ఎన్నికలు అన్న మాట వింటేనే వాళ్ళ ముఖ చిత్రాలు మారిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకు ప్రధాన కారణం విజయవాడ మేయర్ సీటేనన్నది లోకల్ వాయిస్. మేయర్ సీటు కోసం మిత్రపక్షాలు టీడీపీ, జనసేన పోటాపోటీగా పావులు కదుపుతున్నాయి. అదే సమయంలో ఒక్క తెలుగుదేశం నుంచే15 మంది ఆశావాహులు పోటీ పడుతున్న పరిస్థితి. దీంతో… అసలు తమకు మేయర్ ఛాన్స్ వస్తుందో లేదోనని బాగా టెన్షన్లో ఉన్నారట గ్లాస్ లీడర్స్. టీడీపీ తరపున ఇప్పటికే రెండుసార్లు మేయర్లు ప్రాతినిధ్యం వహించగా… మళ్ళీ మాకే కావాలన్నది ఆ పార్టీ నేతల డిమాండ్. ఆ దిశగా తెలుగు తమ్ముళ్లు గట్టిగా పట్టుబడుతుండటంతో… జనసేన నాయకులు సరికొత్త లెక్కల్ని తెర మీదికి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఆ లెక్కలన్నిటినీ తమ అధిష్టానానికి వివరించి మనకే గట్టిగా అడగమని వత్తిడి తేవాలనుకుంటున్నట్టు సమాచారం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా ముందుకు వెళ్ళినా…పొత్తులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం జనసేనకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ 2019లో బరిలోకి దిగింది. దాంతో… 2024లో కూడా అదే సీటు ఇస్తారని అనుకున్నా…. చివరి నిమిషంలో బీజేపీ కోటాలోకి వెళ్ళింది. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడా గ్లాస్ పార్టీ పోటీ చేయలేకపోయింది. ఇక పక్కనే ఉన్న కృష్ణా జిల్లాలో ఒక అసెంబ్లీ, ఒక లోక్సభ సీట్లో పోటీ చేసి గెలిచింది జనసేన.దీంతో ఆ జిల్లాలో జనసేన శ్రేణులకు ఇద్దరు ప్రజా ప్రతినిధులు అందుబాటులోకి వచ్చినా…. ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం ప్రాతినిధ్యం లేదన్న అసంతృప్తి పార్టీ నాయకుల్లో ఉందట. ఈ పరిస్థితుల్లో జిల్లా మీద పట్టు చిక్కాలంటే విజయవాడ మేయర్ సీటే కరెక్ట్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక్కడి మూడు నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం ఓటర్లు భారీగా ఉండటంతో పాటు గతంలో ప్రజారాజ్యం తరపున రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిచిన సందర్బాన్ని గుర్తు చేస్తున్నారు. విజయవాడ నగరంలో జనసేన విస్తరించటంతో పాటు బలపడాలంటే…. మేయర్ సీటు ఒక్కటే మార్గం అన్నది వాళ్ళ అభిప్రాయం. దాదాపు 20 ఏళ్ళ తర్వాత మేయర్ సీటుకు ప్రత్యక్ష ఎన్నిక జరగబోతుండటంతో… ఛాన్స్ వదులుకోకుండా… ఈ లెక్కలన్నిటినీ పవన్ ముందు పెట్టాలనుకుంటున్నారట స్థానిక నాయకులు. మున్సిపల్ ఎన్నికలు ముగిస్తే…. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు ఇటువంటి అవకాశం రాదు కాబట్టి దీన్నే లాస్ట్ ఛాన్స్గా భావిస్తున్నట్టు తెలుస్తోంది. తమ పార్టీ తరపున ఆశావహులు భారీ సంఖ్యలో ఉన్నందున ఈ ప్రతిపాదనను టీడీపీ అధిష్టానం ఎలా చూస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

