OTR : Thopudurthi Prakash Reddy ఉక్కిరి బిక్కిర అవుతున్నారా? దిక్కుతోచల స్థితిలో ఉన్నారా..?

Ysrcp

Ysrcp

ఆ మాజీ ఎమ్మెల్యే రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? ఆయన కేంద్రంగా జరుగుతున్న వరుస పరిణామాలు ఏం చెబుతున్నాయి? అవన్నీ యాదృచ్చికమా? లేక పథకం ప్రకారం జరుగుతున్నవా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు హవా నడిపిన సదరు నేత ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? ఎవరా నాయకుడు? ఏంటా వ్యవహారం? మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన నిర్మాణ సంస్థలపై మొన్న కేసులు, నోటీసులు. ఒక కేసులో నిరాధార ఆరోపణలు చేశారంటూ నిన్న పోలీస్ నోటీసులు, గన్‌మెన్‌ తొలగింపు. ఇవాళ ఆయన సోదరుడి అరెస్ట్… ఇలా వరుసబెట్టి ఒకదానివెంట ఒకటిగా వస్తున్న సమస్యలతో రాప్తాడు ఎక్స్‌ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. దీంతో… జరుగుతున్న పరిణామాలన్నీ యాదృచ్చికమా…? లేక పథకం ప్రకారమా అన్న చర్చలు మొదలయ్యాయి. కారణం ఏదైనాగానీ… డెవలప్‌మెంట్స్‌ మాత్రం ఆయన్ని ఊపిరి తీసుకోనివ్వడం లేదని మాట్లాడుకుంటున్నారు నియోజకవర్గంలో. నిర్మొహమాటంగా చెప్పాలంటే… మాజీ ఎమ్మెల్యే చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. తాజాగా గన్‌మెన్‌ తొలగింపు, సోదరుడు రాజశేఖర్ రెడ్డి అరెస్టుతో మరోసారి వార్తల్లో నిలిచారు తోపుదుర్తి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రకాష్ రెడ్డి మిత్రులు భాగస్వాములుగా ఉన్న రాక్రీట్ సంస్థ రాష్ట్రంలో భారీగా ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అయితే… ఈ పేరుతో అక్రమ వసూళ్ళకు పాల్పడ్డారని, ఇళ్ళు కట్టకుండానే బిల్లులు చేసుకున్నారని, కట్టిన అరకొర నిర్మాణాల్లో కూడా నాణ్యత సరిగా లేదన్న ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. కానీ… నాడు అధికార బలం కారణంగా ఎవరూ పట్టించుకోలేదు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనికి సంబంధించి దర్యాప్తు జరిగింది. రాక్రీట్ సంస్థ అక్రమాలు నిజమేనంటూ రెండేళ్ళ తర్వాత విజిలెన్స్ దర్యాప్తు తేల్చింది. దీనికి సంబంధించి ఆ సంస్థ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. కేసులు కూడా బుక్‌ అయ్యాయి. దాని తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ వ్యవహారం సంచలనంగా మారింది. ఆ దెబ్బకు రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. ఈ కేసుకు సంబంధించి ఏకంగా పలువురు పోలీస్ అధికారుల డిస్మస్ లు, వీఆర్‌లు, సస్పెన్షన్లు జరిగాయి. ఈ మొత్తం వ్యవహారం రాప్తాడు, అనంతపురం చుట్టు పక్కలే జరిగింది.

ఇందులో తన నియోజకవర్గం ఉండటంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పందించి కొన్ని ఆరోపణలు చేశారు. దాంతో ఆయన మాటల్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు హనీట్రాప్‌ ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఇవ్వమంటూ మాజీ ఎమ్మెల్యేకి నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో ప్రకాష్ రెడ్డికి ఉన్న 1+1 గన్ మెన్‌ను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దెబ్బకు ఆయన కూడా షాకయ్యారట. అక్రమాలు, దౌర్జన్యాలు, అవినీతి, భూకబ్జాలను ప్రశ్నిస్తుండటంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకే తనకు సెక్యూరిటీని తొలగించారన్నది ఎక్స్‌ ఎమ్మల్యే అభిప్రాయం. ఇందులో ప్రముఖంగా పాపంపేట భూ వివాదాన్ని ప్రస్తావిస్తున్నారాయన. ఈ భూమి విషయంలో తాను పోరాడుతున్నానని..అందుకే కక్ష గట్టి తప్పుడు సమాచారం ఇచ్చి గన్‌మెన్‌ను తొలగించారని ఆరోపిస్తున్నారాయన. కానీ… పోలీసులు మాత్రం ఇందులో ఎవరి ప్రమేయం లేదని చెబుతున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి నేతల భద్రతను సమీక్షిస్తామని, ఈ సమీక్షలో అవసరాన్ని బట్టి భద్రతను పెంచడం, తగ్గించడం లాంటివి చేస్తుంటామన్నది వాళ్ళ వెర్షన్‌. అలాంటి చర్యల్లో భాగంగానే ప్రకాష్ రెడ్డికి ఉన్న సెక్యూరిటీని తొలగించామని అంటున్నారు. ఆయనకు ప్రస్తుతం ఎలాంటి ప్రాణహాని లేదని, 1+1 గన్‌మెన్‌ అవసరమే లేదని చెబుతున్నారు పోలీసులు. మరోవైపు తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ప్రకాష్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డిని బెదిరించారట. అందుకే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని… మహేశ్వర్ రెడ్డి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు సంబందించిన ఆడియోలు, వీడియోలను కూడా జతపరిచారాయన. దీనికి సంబంధించి కేసు బుక్‌ చేసిన రైల్వే పోలీసులు…. రాప్తాడు పోలీసులతో కలిసి దర్యాప్తు చేశారు. ఆ కేసులోనే మాజీ ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్‌రెడ్డితో పాటు జైపాల్ రెడ్డి అనే మరొకర్ని కూడా అరెస్ట్‌ చేశామని చెప్పారు డీఎస్పీ. ఇలా వరుసబెట్టి జరుగుతున్న ఘటనలతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి.