తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుల్ని ఉన్నట్టుండి ఢిల్లీ ఎందుకు పిలిచారు? ఎలాంటి ముందస్తు సమాచారం, చర్చలు లేకుండా ఉన్నఫళంగా వచ్చేయమని చెప్పడానికి కారణాలేంటి? రాష్ట్ర పార్టీకి సంబంధించి ఏఐసీసీ లెవల్లో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? అంతర్గత పంచాయితీలకు చెక్ పెట్టబోతున్నారా? అసలేంటీ సడన్ మీటింగ్స్? సీఎం రేవంత్ రెడ్డితో పాటు… తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ప్రస్తుతం హస్తినలో మకాం వేశారు. పార్టీ నిర్మాణంపై సమీక్ష అంటూ ముఖ్య నేతలు ఇద్దరూ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడం వరకు ఓకేగానీ… ఆ వెంటనే రాష్ట్రంలో ఉన్న కోర్ కమిటీ సభ్యులకు కూడా ఢిల్లీ పిలుపు రావడాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు. కోర్ కమిటీని ఎందుకు పిలిచినట్టు..? ఏం చర్చించబోతున్నారంటూ రకరకాల చర్చలు మొదలైపోయాయి. కమిటీలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి తో పాటు… కేబినెట్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్రెడ్డి, సీతక్క ఉన్నారు. ఇక పార్టీ తరపున ఏఐసిసి కార్యదర్శి వంశీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఉన్నారు. దీంతో… ఇంత మంది ముఖ్యుల్ని ఒకేసారి పిలిచి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న ఆసక్తి సహజంగానే పెరిగిపోతోంది. కోర్ కమిటీ మీటింగ్లో మొదట రెండు పట్టభద్రుల నియోజక వర్గ ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులపై చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. త్వలో ఖాళీ అవబోతున్న ఈ స్థానాల్లో ఎన్నికల నిర్వహణ, అభ్యర్ధుల ఎంపిక లాంటివి ప్రధాన అజెండాలో ఉండవచ్చని అంటున్నారు.
ఈ రెండు పట్టభద్రుల నియోజక వర్గాలు అత్యంత కీలకం కావడం, పైగా ఒకటి బీఆర్ఎస్ సిట్టింగ్ కావడంతో…. రాష్ట్ర నాయకత్వం ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తోందట. అందుకే మంత్రులకు బాధ్యతలు అప్పగించడం లాంటి అంశాలపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పుకుంటున్నారు. అలాగే ఇతర కీలకమైన అంశాల ప్రస్తావన కూడా రావచ్చన్నది పార్టీ వర్గాల అంచనా. కేబినెట్ మంత్రుల మధ్య పరస్పర అవగాహన, ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం లాంటి అంశాలు చర్చకు రావచ్చని అంటున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో…మంత్రి ఉత్తంకుమార్రెడ్డి… సీఎం రేవంత్ మధ్య మాటలు పెరిగాయన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. ఇందుకు సంబంధించిన సమాచారం ఇప్పటికే అధిష్టానానికి చేరిందట. దీనికి తోడు తన శాఖ పరిధిలో తనకు తెలియకుండానే… విజిలెన్స్ విచారణకు ఆదేశించారంటూ మరో మంత్రి కూడా బాగా అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. సదరు మంత్రి ఈ అంశాన్ని సన్నిహితులతో ప్రస్తావిస్తూ సీరియస్గా ఉన్నట్టు సమాచారం. ఇలా… కేబినెట్లో సమన్వయ లోపం.. పార్టీలో అంతర్గత పంచాయితీలపై కూడా ఈ కోర్ కమిటీ మీటింగ్లో చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీ MLAల వ్యవహారం మీద కూడా డిస్కషన్ జరగవచ్చని అంటున్నారు. అంతర్గత పంచాయితీలపై దిశా నిర్దేశం చేయడంతో పాటు.. ఎస్ఐఆర్ అంశం మీద కూడా ఫోకస్ పెట్టవచ్చన్నది కాంగ్రెస్ టాక్.

