OTR : రామచంద్రరావు ఢిల్లీ ఫ్లైట్ వెనుక అసలు కథ ఇదేనా?

Bjp

Bjp

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఉన్నఫళంగా ఎందుకు ఢిల్లీ ఫ్లైట్‌ ఎక్కారు? ముందే ఫిక్స్‌ అయిన కార్యక్రమాలను సైతం రద్దు చేసుకుని మరీ… హస్తిన బాట పట్టాల్సిన అత్యవసరం ఏం వచ్చింది? పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏం జరుగుతోంది? దాని గురించి నడుస్తున్న చర్చలేంటి? స్టేట్‌ ప్రెసిడెంట్‌తో అధిష్టానం ఏం మాట్లాడాలని అనుకుంది? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు గురువారం నాడు హుటాహుటిన బయలుదేరి ఢిల్లీ వెళ్ళారు. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ముందుగా ఫిక్స్‌ అయిన కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుని మరీ… హస్తిన బాట పట్టడం పార్టీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయింది. స్టేట్‌ ప్రెసిడెంట్‌ అంత అత్యవసరంగా ఢిల్లీ ఎందుకు వెళ్లారంటూ తెగ కూపీ లాగేస్తున్నారు కాషాయ నాయకులు. ఈ క్రమంలోనే రకరకాల చర్చలు నడుస్తున్నాయి. త్వరలోనే బీజేపీ జాతీయ కమిటీని వేస్తారని సమాచారం. దీంతో నితిన్ నబిన్‌ టీమ్‌లో ఎవరెవరు ఉంటారు? రాష్ట్రం నుంచి ఎవర్ని తీసుకుంటారన్న ప్రశ్నలు వస్తున్నాయి. స్టేట్‌ చీఫ్‌ ఎవరెవరి పేర్లు ఇచ్చి ఉంటారంటూ నేతలంతా ఎవరి సోర్స్‌లో వాళ్ళు ఆరా తీస్తున్నారు. ఇదే ఊపులో పార్టీ జాతీయ కమిటీ ఆశావహులు కూడా లాబీయింగ్‌ మొదలుపెట్టేశారట. ఈ నెలాఖరు లోపు బీజేపీ జాతీయ కమిటీని ప్రకటిస్తారని పార్టీలో మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే రామచందర్ రావు ఢిల్లీ వెళ్లి పార్టీ చీఫ్‌ను కలిశారనే మాట అయన సన్నిహిత వర్గాల నుండి వినిపిస్తోంది. కేంద్ర కమిటీలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలన్న విషయమై ఇప్పటికే రాష్ట్రం నుంచి ఒక లిస్ట్‌ ఢిల్లీ వెళ్ళిందట.

దాని గురించే నితిన్‌ నబిన్‌, రామచందర్‌రావు చర్చించుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు స్టేట్‌ లీడర్స్‌. జాతీయ పదాధికారులుగా ఎవరెవర్ని తీసుకోవాలన్న విషయంలో వివిధ సమీకరణల్ని పరిగణనలోకి తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో నడ్డా కమిటీలో తెలంగాణ నుంచి డీకే అరుణ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు అయ్యారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడుగా లక్ష్మణ్ నియమితులయ్యారు. పొంగులేటి సుధాకర్‌రెడ్డి కర్నాటక, తమిళనాడు సహ ఇన్ఛార్జ్‌గా వ్యవహరించారు. ఇక జాతీయ కార్యవర్గ సభ్యులుగా కిషన్ రెడ్డి , జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఇంద్రసేనారెడ్డి, జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులుగా ఈటల రాజేందర్, విజయశాంతి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా ఎవరికి అవకాశం వస్తుందన్న చర్చ నడుస్తోంది. కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరుగనున్న క్రమంలో మంత్రివర్గంలో స్థానం లభించని ఎంపీలను కేంద్ర కమిటీలోకి తీసుకోవచ్చన్న అభిప్రాయాలు సైతం ఉన్నాయి. గతంలో జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న వారిలో కొందరు పార్టీ మారారు. అలాగే రాష్ట్ర కమిటీలో స్థానం దక్కని వారికి అవకాశం రావొచ్చని అంటున్నారు. జాతీయ కమిటీలో స్థానం కోసం ఆల్రెడీ కొందరు నేతలు గట్టిగానే లాబీయింగ్‌ చేస్తున్నట్టు సమాచారం. తమకు ఉన్న పరిచయాలతో ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారట. ప్రస్తుతం తెలంగాణ కాషాయ వర్గాల్లో ఇదే హాట్‌ టాపిక్‌.

×
×
Ad