OTR: ఇగోలకు పోయి మంచి అవకాశం మిస్ చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు..?

Bjp

Bjp

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల్లో సమష్టి తత్వం లోపించిందా? వ్యక్తిగత ఇగోలకు పోయి పార్టీని గట్టిగా డ్యామేజ్‌ చేస్తున్నారా? ఆ ఇగోలతోనే… రాజకీయంగా అంది వచ్చిన బంగారంలాంటి అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోయారా? ఎమ్మెల్యేల తీరుపై రాష్ట్ర పార్టీ వర్గాలు కూడా అసహనంగా ఉన్నాయా? ఇంతకీ ఏం చేశారు వాళ్లు? ఏ అవకాశాన్ని సరిగా వాడుకోలేక మిస్‌ అయ్యారు? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. సభలో పలు అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ సెషన్‌ ప్రారంభంలోనే BRS సభ్యులు సస్పెండ్ అవడంతో… విపక్షంగా ఆ తర్వాతి స్థానంలో ఉన్న బీజేపీకి మంచి అవకాశం వచ్చింది. అయితే… ఆ అవకాశాన్ని కాషాయ దళం ఏ మేరకు ఉపయోగించుకుందన్నదే ఇప్పుడు చర్చ. చర్చ జరిగిన అన్ని అంశాలపై అవగాహన పెంచుకుని, సభలో గట్టిగా వాయిస్‌ వినిపించి ప్రజల్లో మంచి మార్కులు కొట్టేసే గోల్డెన్‌ ఛాన్స్‌ దక్కినా…. కమలం ఎమ్మెల్యేలు మాత్రం దాన్ని ఏ మాత్రం వాడుకోలేకపోరన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ పరంగా కామన్ అజెండాతో కాకుండా… శాసనసభ్యులు ఎవరికి వారు సొంత అజెండాతో వ్యవహరించారన్న అభిప్రాయం ఇటు పార్టీ, అటు రాజకీయవర్గాల్లో బలంగా ఉంది. ఏ అంశం మీద వాయిదా తీర్మానం ఇవ్వాలి? ఎవరి పేరు మీద ఇవ్వాలన్న దగ్గర మొదలు పెడితే ప్రతి విషయంలోనూ పార్టీ ఎమ్మెల్యేల మధ్య రచ్చ రచ్చేనట. ఒకరు ఎడ్డెమటే… ఇంకొకరు తెడ్డెమన్నట్టు చెప్పుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు అసెంబ్లీలో మైక్ కోసం చూశారు తప్ప… ఏం మాట్లాడాలన్న విషయంలో సమన్వయంతో పనిచేయలేకపోయారన్న టాక్ నడుస్తోంది.

ఒకే పార్టీ సభ్యుల్లో ఒకరు మాట్లాడిన దానికి, మరొకరు మాట్లాడిన దానికి చాలా సార్లు పొంతన లేకుండా పోయిందంటున్నారు. దానికి సంబంధించి పలు మార్లు అధికార పార్టీ వైపు నుంచి గట్టి సెటైర్స్‌ సైతం పడ్డాయి. BRS, bjp ఒకటేనని, brs రాసిచ్చిన స్క్రిప్ట్ నే బీజేపీ సభ్యులు చదువుతున్నారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నా… కమలం శాసనసభ్యులు కలసికట్టుగా కౌంటర్ ఇవ్వలేకపోయారన్న చర్చ జరుగుతోంది. పరిస్థితి అలా ఉందంటే… వాళ్ళ మధ్య ఎంతమాత్రం కో ఆర్డినేషన్‌ ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చివరికి అసెంబ్లీ ప్రాంగణంలోని బీజేఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు పరస్పరం అరుచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. షార్ట్ డిస్కషన్ పై ఎవరు మాట్లాడాలన్న విషయంలో కూడా వాళ్ళ మధ్య పంచాయితీయేనట. ఎల్‌నినోపై పార్టీ తరఫున తాను మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వరంటూ ఒక ఎమ్మెల్యే అగ్గిమీద గుగ్గిలం అయినట్టు తెలిసింది. అసెంబ్లీ కారిడార్‌లోనే గట్టిగా మాట్లాడారట ఆయన. కోపంతో ఊగి పోతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి ఫోన్‌ చేసినట్టు చెప్పుకుంటున్నారు. అదే ఊపులో నేను రాజీనామా చేస్తానని కూడా అన్నారట సదరు బీజేపీ ఎమ్మెల్యే. దాంతో… ఆయన్ను కూల్ చేసేందుకు… తర్వాత మాట్లాడే అవకాశం ఇవ్వాలని పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడంతో స్పీకర్ అవకాశం ఇచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేల మధ్య సమష్టి తత్వం లేకపోవడం, వ్యక్తిగత ఇగోలకు పోవడం, పార్టీ సెంట్రిక్ గా కాకుండా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడటం లాంటి అవలక్షణాలతోనే ఈ పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం తెలంగాణ కాషాయ వర్గాల్లో కూడా ఉందట.