తెలంగాణలో కాషాయ కలర్ కాస్త బ్రైట్గా కనిపిస్తోందా? గతానికి భిన్నమైన వాతావరణాన్ని చూసి సొంత పార్టీ నాయకులే ఆశ్చర్యపోతున్నారా? అది స్వతహాగా వచ్చిన మార్పా? లేక తప్పని పరిస్థితుల్లో… గత్యంతరం లేక అలా చేయాల్సి వచ్చిందా? ఇంతకీ ఏంటా మార్పు? దేని గురించి పార్టీలో టాప్ టు బాటమ్ తెగ మాట్లాడేసుకుంటున్నారు? కలిసి ఉంటే… కలదు సుఖం. విడిపోతే చెడిపోతాం…. అంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే. ఏంటీ…. వింటుంటే ఇవేవో వాట్సాప్ కొటేషన్లలాగో, లేదా పాత రోజుల్లో ఆర్టీసీ బస్సుల మీద రాసే నినాదాల్లాగో అనిపిస్తున్నాయా? ఇవన్నీ ఎవరికి ఎలా అనిపించినా…. తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులకు మాత్రం వీనుల విందుగా వినిపిస్తున్నాయట. ఇన్నాళ్ళు పాత-కొత్త, వాళ్ళు వీళ్లు అంటూ… రకరకాలుగా ఉన్న నేతలు ప్రస్తుతం గతం గతహ. ప్రస్తుతం మనం మనం కాషాయం అంటున్నట్టు తెలుస్తోంది. దీంతో… ప్రస్తుతం రాష్ట్ర పార్టీలో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోందంటున్నారు. తామంతా ఒక్కటేనని, కలసే ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎంపీలు. నిన్నటి వరకు విభేదాలు, అసమ్మతితో వార్తల్లో నిలిచిన నేతలు.. ఇప్పుడు ఒక్కసారిగా మేమంతా ఒకటే… మా మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెబుతూ…. గ్రూప్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల పార్లమెంట్ దగ్గర తెలంగాణ ఎంపీలంతా కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు. దానికి కాప్షన్స్ పెడుతూ.. ఎవరికి వారు తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేసుకున్నారు. కలిసి ఉండడంలోనే అసలైన బలం అని ఒక ఎంపీ పోస్ట్ చేస్తే… తెలంగాణ కోసం ఒకటిగా… భారత్ కోసం ఒక్కటిగా అని మరో ఎంపీ పోస్ట్ చేశారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉన్నా కలిసి పని చేస్తామంటూ మరో ఎంపీ xలో వీడియో పెట్టారు.
ఆ రకంగా నేతలంతా ఐక్యత రాగం వినిపిస్తున్నారు. కలిసి ఫోటోలు దిగుతున్నారు. ఇక రైల్వే శాఖమంత్రిని కలిసిన సందర్భంలోనూ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఫోటో దిగి పోస్ట్ చేశారు. నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, దానిలో సోషల్ మీడియా పాత్ర….ప్రధాని మోడీ మాట్లాడిన అంశాలను దృష్టిలో పెట్టుకొని టీ బీజేపీ నేతలు పోస్ట్ పెట్టడాన్ని కొద్దిగా పెంచారట. కేంద్ర పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఏదైనా పెడితే దాన్ని వెంటనే రీ పోస్ట్ చేస్తున్నారు.కామెంట్స్ పెడుతున్నారు. కొందరు నేతలైతే….సెల్ఫీ వీడియోలు కూడా రికార్డ్ చేసి పెట్టేస్తున్నారు. ఆ రకంగా తామంతా కలిసే ఉన్నామనే సంకేతాలను పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకి పంపుతున్నారు బీజేపీ బడా నాయకులు. అది బీజేపీ డిల్లీ డైరెక్షన్ కావొచ్చు… లేదా ఇక్కడున్న వాళ్ళలో అధికారంలోకి రావాలనే ఆశ కావొచ్చుగానీ…. వాతావరణం మాత్రం గతానికి పూర్తి భిన్నంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అదే సమయంలో ఈ బృందగానం ఎన్నాళ్ళు కొనసాగుతుందో చూడాలంటూ పెదవి విరిచే వాళ్ళకు సైతం కొదవలేదు. అదే సమయంలో తెలంగాణ బీజేపీ మరిన్ని బస్సు యాత్రలు నిర్వహించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. పార్టీ పెద్దలు కోరుకుంటున్నట్టు కలిసి ఉంటే కలదు సుఖం అని అంటారా? లేక గిట్టని వాళ్ళు పెదవి విరుస్తున్నట్టు బృందగానంలో అపశృతులు ఉంటాయా అన్నది చూడాలి మరి.

