తెలంగాణ కోసం బీజేపీ సరికొత్త అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటోందా? ఇక్కడ కేవలం హిందుత్వ ఫార్ములా ఒక్కటే వర్కౌట్ కాదని అర్థం చేసుకున్నారా? ప్రత్యామ్నాయ వ్యూహాల్ని కూడా సిద్ధం చేసుకునే క్రమంలో మిత్రపక్షాలు టీడీపీ, జనసేన సాయం కూడా తీసుకోబోతోందా? ఇటీవల ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్లో జరిగిన పరిణామాలే అందుకు సంకేతమా? ఇంతకీ…. తెలంగాణ విషయమై కాషాయ పార్టీలో జరుగుతున్న చర్చలేంటి? ఎంత సీరియస్గా వర్కౌట్ చేస్తోంది?
ఉత్తరాది ఎలక్షన్ ఫార్ములా… దక్షిణాదిలో వర్కౌట్ కాదన్న స్థిరమైన అభిప్రాయానికి బీజేపీ పెద్దలు వచ్చినట్టు తెలుస్తోంది. అక్కడి పరిస్థితులకు, ఇక్కడి మనస్తత్వాలకు పోలికే లేదని, ప్రాంతానికి తగ్గట్టు, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాల్ని మార్చుకుంటూ పోవాలని డిసైడయ్యారట. ఈ క్రమంలోనే…. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు సమాచారం. తెలంగాణలో కొన్ని దశాబ్దాలుగా ఉన్న పరిస్థితులను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకుని పొలిటికల్ ప్లానింగ్ చేయాలనుకుంటున్నారట. ముఖ్యంగా ఇక్కడ బలమైన సామాజిక వర్గాలు, వ్యవస్థలు, వ్యక్తుల మీద ఆ పార్టీ ఫోకస్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ప్రధాని మోడీ పర్యటనలో ఈ అంశాలను ఆ పార్టీ టచ్ చేసిందట కూడా. పైకి నేరుగా చెప్పకున్నా… పీఎం టూర్తో ఆ సందేశాన్ని పంపాల్సిన వాళ్ళకు పంపేసిందని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డికి చెందిన ఆసుపత్రిని ప్రారంభించడం, తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పరామర్శించడం, ఆ తర్వాత సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్ళి చాలా సేపు గడపడంలాంటివన్నీ యాదృచ్చికంగా జరిగినవేం కాదని, ప్రతి సందర్శన వెనక పక్కా పొలిటికల్ ప్లానింగ్, అంతర్గత సందేశం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అలాగే… కొందరు సినీ ప్రముఖులను కూడా మోడీ లైనప్లో పెట్టారు.
వాళ్ళలో తనికెళ్ళ భరణి లాంటి వారు ఉన్నారు. దీని వెనక కొన్ని వ్యవస్థల్ని ప్రభావితం చేయగలిగిన సామాజికవర్గాల లెక్కలున్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ఆ రకంగా ఒక పద్ధతి ప్రకారం నరుక్కొస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాని పర్యటన తర్వాత… గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ…. టీడీపీ, జనసేనతో కలిసి వెళ్తుందా అన్న చర్చలు మొదలయ్యాయి. ముందు ఈ మూడు కార్పొరేషన్స్లో కూటమిగా ఒక ట్రయిల్ వేసి… సక్సెస్ అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా కలిసి పోటీ చేయవచ్చన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే సామాజికవర్గాల లెక్కలు కూడా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో మరో వాదన సైతం తెర మీదికి వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, ఎంపీటీసీ, ZPTC ఎన్నికలకు ప్రస్తుత నాయకత్వంతోనే వెళ్లి మంచి ఫలితాలు సాధించడంతో పాటు నాయకుల మధ్య సమన్వయం ఏర్పడితే సరేసరి. లేదంటే…రాష్ట్రంలో నాయకత్వ మార్పు గురించి కూడా ఆలోచించే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ మంచి ఫలితాలు సాధించడంతో… ఇప్పుడున్న నాయకత్వం విఫలమైతే… వీళ్ళందర్నీ పక్కన పెట్టి బెంగాల్లో సువేందు అధికారి, అసోంలో హిమంత బిశ్వ శర్మ లాగా తెలంగాణలో కూడా… వేరే పార్టీ నుంచి గట్టి పట్టున్న నేతనుతెర మీదికి తెచ్చే అవకాశం కూడా లేకపోలేదన్నది ఇంటర్నల్ టాక్. సో… రాబోయే రోజుల్లో తెలంగాణ బీజేపీలో భారీ మార్పుల్ని చూడబోతున్నామా… అంటూ పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
