Site icon NTV Telugu

Off The Record : బీజేపీలో తోకలు కత్తిరించే ఆపరేషన్ ప్రారంభమా?

Bjp

Bjp

తెలంగాణ కమలం నాయకులు కొందరు పార్టీకన్నా తామే… ఎక్కువని భావిస్తున్నారా? మేమే గొప్పోళ్ళమని వాళ్ళకు వాళ్ళే ఫీలవుతున్నారా? అలాంటి వాళ్ళ తోకలు కత్తిరించే కార్యక్రమం మొదలైందా? రాష్ట్ర అధ్యక్షుడి వార్నింగ్‌ అందులో భాగమేనా? ప్రెసిడెంట్‌ వార్నింగ్‌ వర్కౌట్‌ అవుతుందా? లేక ఆ తోకలు వంకరే అన్నట్టు మారిపోతుందా? టీజీ బీజేపీలో ఇంటర్నల్‌గా జరుగుతున్నదేంటి? తెలంగాణలో కమలం కట్టు తప్పుతోంది. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే పార్టీలో కొందరు నాయకులు మేమే మోనార్క్‌లమని స్థాయికి వెళ్ళిపోతోంది. ఈ వ్యవహారం మొదట్లో కాస్త అటు ఇటుగా ఉన్నా… రానురాను శృతి మించుతోందట. ఒకర్ని చూసి ఒకరుగా స్టేట్‌ లీడర్స్‌ చాలామంది మేము సైతం అంటూ అదే రూట్‌లో వెళ్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

 

వాళ్ళంతా తమకు తామే గొప్పోళ్ళం అనుకునే స్థాయికి చేరిపోయారు. అలాంటి వాళ్ళ సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండటంతో… రాష్ట్ర నాయకత్వం కూడా అలర్ట్‌ అయినట్టు తెలుస్తోంది. ఏం చేసినా… మనల్ని అనేవాడు ఉండడన్నట్టుగా వ్యవహరిస్తున్న నాయకుల్ని కట్టడి చేసే కార్యక్రమం మొదలుపెట్టినట్టు సమాచారం. వీటన్నిటికీ మించి పార్టీ పెద్దలకు మండిపోయేలా చేస్తున్న మాటలు కూడా కొన్ని ఉన్నాయట. మనం ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో పార్టీ ఉంది. మనమే లేకపోతే అసలు స్టేట్‌ పార్టీ ఎక్కడంటూ… కొందరు నాయకులు గప్పాలు కొడుతున్న విషయం ఢిల్లీకి కూడా తెలిసింది. వాళ్ళంతా పార్టీ కంటే మేమే గొప్పవాళ్ళమనే భావనలో ఉన్నారట. ఇంకొందరైతే…. సొంత ఇమేజ్‌తోనే గెలిచాం తప్ప మాకు కమలం బలం ఏదీ కలిసిరాలేదని కూడా సన్నిహితులతో అన్న మాటలు పార్టీ ముఖ్యుల చెవికి చేరాయి.

ఇక సోషల్ మీడియాలో కొందరు పార్టీ నేతలు, మేము బీజేపీనే అని చెప్పుకునే వాళ్ళు సైతం ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ పెడుతున్నారు. ఒక్కోసారి పెద్ద నేతలు కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు. చివరికి వాళ్ళ మాటల్ని కవర్ చేసుకోలేక పార్టీ ఇబ్బంది పడాల్సి వస్తోందని అంటున్నారు. ఈ క్రమంలోనే… పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి బాపతును ఉద్దేశించే ఆయన అలా మాట్లాడారన్న అభిప్రాయం బలంగా ఉంది. పార్టీకన్నా గొప్పవాళ్ళం అనుకున్న వారి పరిస్థితి ఏమైందో గుర్తు తెచ్చుకోవాలంటూ చురకలంటించారు రామచంద్రరావు. పార్టీ కన్నా ఎవరూ గొప్ప కాదని తేల్చేశారాయన. సోషల్ మీడియాలోగాని, మీడియాలోగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉపేక్షించేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చారు బీజేపీ ప్రెసిడెంట్‌. కాదు కూడదని ఎవరైనా కంట్రోల్‌ తప్పితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

తెలంగాణలో మంచి వాతావరణం ఉంది. అందరం కలిసి కట్టుగా పని చేద్దాం, పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం అనడం వెనక ఉన్న సీరియస్‌నెస్‌ని అర్ధం చేసుకోవాలన్న చర్చ జరుగుతోంది రాష్ట్ర పార్టీలో. అయితే… ఇక్కడే మరో చర్చ కూడా మొదలైపోయింది. పార్టీ నుండి ఎన్ని వార్నింగ్స్‌ వచ్చినా… కొందరు మాత్రం తోక వంకర లెక్కనే వ్యవహరిస్తున్నారని, అలాంటి వాళ్ళందరికీ అధ్యక్షుడు హెచ్చరికలు పనిచేస్తాయా? లేక షరా మామూలులాగే జరిగిపోతుందా అన్న అనుమానాలున్నాయి కొందరికి. అయితే… ఇక మీదట వాతావరణం గతంలో లాగా ఉండబోదని, వాళ్ళు మారి పార్టీ లైన్‌లోకి వస్తారా వచ్చారు. లేదంటే గీత దాటిన వాళ్ల మీద వేటు తప్పదని కూడా చెప్పుకుంటున్నారు. ఏది నిజమో, ఎవరిది పైచేయి అవుతుందో త్వరలోనే చూస్తామన్నది కేడర్ అభిప్రాయం.

 

Exit mobile version