OTR : జనసేన డిమాండ్‌కు టీడీపీ షాక్.. మేయర్ సీటుపై జనసేన కన్ను

Tdp

Tdp

మున్సిపల్‌ ఎన్నికల మాటలు మొదలవగానే… అక్కడ కూటమి నేతల్లో కంగారు మొదలైందా? టీడీపీ కంచుకోట కావాలంటూ జనసేన పట్టుబడుతోందా? లోకల్‌ లెవల్‌లో మొదలైన ప్రతిపాదనలు ప్రస్తుతం అమరావతి రూట్‌లో ఉన్నాయా? తమకు అంతగా బలం లేని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కోసం గ్లాస్‌ లీడర్స్‌ ఎందుకు అంత పట్టుబడుతున్నారు? వాళ్ళకు నచ్చచెప్పలేక తెలుగుదేశం నాయకులు ఎలా సతమతం అవుతున్నారు? చేతిలో గింజ లేకపోయినా… బస్తా నిండా లెక్కలు వేసినట్టు మారుతోందట విజయనగరం జనసేన రాజకీయం. సిటీ మేయర్‌ పీఠం కూటమి పార్టీల్లో ఎవరికంటూ అప్పుడే చర్చలు మొదలైపోయాయి. సరిగ్గా ఆ పాయింట్‌ మీదే… అసలు గ్లాస్‌ పార్టీ లెక్కలేంటో అర్ధంగాక తెలుగు తమ్ముళ్ళు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారట. విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌… అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. టీడీపీ కూడా ఒకవైపు కేడర్‌ను సిద్ధం చేస్తూనే… మరోవైపు డివిజన్లలో బలమైన అభ్యర్థుల కోసం వెదుకుతోందంటున్నారు.ఎవరికి టికెట్‌ ఇస్తే గెలుస్తారు? ఎక్కడ ఏ సామాజిక సమీకరణ పనిచేస్తుంది.? ప్రత్యర్థులకు ఎలా చెక్‌ పెట్టవచ్చంటూ రకరకాల లెక్కలేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

అటు బీజేపీ కూడా కూటమిలో మా వాటా ఎంతో ముందే తేల్చమని అడుగుతోందట. అదంతా ఒక ఎత్తయితే…. జనసేన మాత్రం…ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ బలోపేతానికి కూడా ఉపయోగించుకోవాలని చూస్తోందంటున్నారు. ఉత్తరాంధ్రలో ఒక కార్పొరేషన్‌ను తమ ఖాతాలో వేసుకుంటే… పార్టీకి రాజకీయంగా మంచి మైలేజ్‌ వస్తుందన్నది గ్లాస్‌ పెద్దల అభిప్రాయంగా తెలుస్తోంది. అందులోనూ… విజయనగరం అయితే గ్రోత్ ఇంజన్‌గా ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. 2024 అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా నెల్లిమర్ల సీటు దక్కించుకున్న జనసేన అక్కడ జెండా ఎగరేసింది. ఆ కొత్త జోష్‌ని ఇప్పుడు స్థానిక సంస్థల్లోనూ కొనసాగించాలని చూస్తోందట. ఉత్తరాంధ్రలో తమ రాజకీయ బలాన్ని మరింత పెంచుకునే క్రమంలో విజయనగరం మేయర్‌ సీటు దక్కించుకోవాలనుకుంటున్నట్టు తెలిసింది. కానీ… ఇక్కడే అసలు సమస్య మొదలవుతోందంటున్నారు పరిశీలకులు. విజయనగరం టీడీపీకి కంచుకోటలాంటిది.

ఇక్కడ అడుగడుగునా వేళ్లూనుకున్న మర్రిచెట్టు లాంటి కేడర్‌ ఆ పార్టీకి ఉంది. దశాబ్దాలుగా బలమైన స్థానిక నాయకత్వం… వార్డు స్థాయి కార్యకర్తలు… సంస్థాగత నిర్మాణం… ఇవన్నీ టీడీపీకి అనుకూల అంశాలే. అందుకే జనసేన అడిగిందని… చేతిలో ఉన్న పిట్టను ఎగరేస్తారా అన్నది టీడీపీ శ్రేణుల్లో కొత్తగా వస్తున్న ప్రశ్న. అలాగని జనసేన కూడా వెనక్కి తగ్గే పరిస్థితిలో లేదట. పొత్తు అంటేనే సర్దుబాట్లని, అలాంటి సందర్బాల్లో పరస్పరం ఉపయోగపడాలే తప్ప ఇక్కడ బలాల లెక్కలు పనికి రావని వాదిస్తున్నారట సేన లీడర్స్‌. ఇదే డిమాండ్‌ను కూటమి పెద్దల ముందు పెట్టే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. జిల్లాలో ఒక‌ ఎమ్మెల్యే, తూర్పు కాపు చైర్మన్ పదవులు ఇప్పటికే జనసేన ఖాతాలో ఉన్నాయి.‌ మేయర్ వస్తే పార్టీ మరింత ముందుకు వెళ్తుందన్న ఆలోచనలో గ్లాస్‌ నేతలు ఉన్నట్టు సమాచారం. అయితే అసెంబ్లీ ఎన్నికల లెక్కను లోకల్‌ ఎలక్షన్స్‌కు వర్తింపజేయడం అంత ఈజీ కాదన్నది రాజకీయ విశ్లేషకుస మాట. ఎందుకంటే… ఊరు మారితే తీరు మారుతుంది… ఎన్నిక మారితే లెక్క మారుతుందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గుర్తు… అభ్యర్థి ప్రభావం… కూటమి ఫ్యాక్టర్‌ పనిచేస్తే… కార్పొరేషన్‌ ఎన్నికల్లో మాత్రం వార్డు స్థాయి సమీకరణాలు, వ్యక్తిగత పరిచయాలు, స్థానిక సమస్యలు, సామాజిక లెక్కలు… కేడర్‌ బలం… అన్నీ కీలకమేనని అంటున్నారు సీనియర్లు. ఒక గూటి పక్షులన్నీ ఒకేలా ఉండవన్నట్టు… ఒక్కో డివిజన్‌లో ఒక్కో లెక్క ఉంటుంది. ఇదే సమయంలో మరో ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. తాము బలంగా ఉన్న విజయనగరం మేయర్‌ పీఠాన్ని జనసేనకు అప్పగిస్తే… టీడీపీ కేడర్‌ ఊరుకుంటుంగా? యాక్టివ్‌గా పని చేస్తుందా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. అటు జనసేన మాత్రం… కూటమి విజయానికి మేమూ కారణమే… స్థానిక ఎన్నికల్లో మా వాటా మాకివ్వాల్సిందేనన్న లెక్కలో ఉందట. విజయనగరం దక్కితే…పార్టీని మరింత విస్తరించవచ్చని భావిస్తోందట జనసేన. మొత్తానికి… మేయర్‌ పీఠం కోసం టీడీపీ, జనసేన మధ్య గట్టి యుద్ధమే జరగవచ్చన్నది రాజకీయ పండితుల అంచనా. చివరికి టీడీపీ పట్టు నిలుస్తుందా.. జనసేన పాచిక పారుతుందా.. అన్నది చూడాలంటున్నారు.