Site icon NTV Telugu

Off The Record : టీడీపీ నేతల డబ్బులతో జనసేన సభ్యత్వాలు..?

Tdp

Tdp

టీడీపీ, జనసేన మిత్రపక్షాలన్నది అందరికీ తెలిసిందేగానీ… అక్కడ మాత్రం అంతకు మించి అన్నట్టుగా ఉందా? కష్టాల్లో ఉన్న మిత్రుల్ని ఆదుకోవడానికి అక్కడి తెలుగుదేశం నాయకులు డబ్బుల కట్టలు తీశారా? వాడుకోండి బ్రోస్‌… అంటూ ఉదారంగా ఇచ్చేశారా? జనసేన నేతలు సైతం బతికించారు బ్రదర్‌ అంటూ… పరిపరి విధాలా థ్యాంక్స్‌ చెబుతున్నారా? ఎక్కడ బలపడుతోందా కొత్త బంధం? ఏంటా కట్టల కథ? ఉద్యమి పేరుతో భారీ ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించింది జనసేన. అది రాష్ట్రం మొత్తం ఒక ఎత్తయితే… ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాత్రం కాస్త తేడాదా జరిగిందట. ప్రధాన సెంటర్లలో టెంట్లు వేసుకుని మరీ… సభ్యత్వ నమోదు చేయించారు పార్టీ నాయకులు. ఒక్కో నియోజకవర్గంలో తాము చెప్పిన టార్గెట్‌ రీచ్ అవ్వాలంటూ అధిష్టానం గట్టిగా చెప్పడంతో…నానా తంటాలు పడ్డారు. గతంలో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో 25 వేల సభ్యత్వాలు చేయిస్తే.. ఈసారి అంతకు మించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.

 

ఐతే… జనంలో ఆ స్థాయి స్పందన కనిపించకపోవడంతో… పరువు పోతుందని భయపడ్డ జిల్లా జనసేన నాయకులు టీడీపీ మీద ఆధారపడ్డారన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. అన్నిటికీ మించి పార్టీ సభ్యత్వ రుసుము 400 రూపాయలు కావడం బాగా ఇబ్బందిగా మారిందట. అంత మొత్తం కట్టి సభ్యత్వం తీసుకోవడానికి సామాన్య ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో… చేసేదేం లేక డబ్బు తాము కట్టి సభ్యత్వాలు నమోదు చేయాలని డిసైడయ్యారు. కానీ… తీరా రంగంలోకి దిగేసరికి అంత మొత్తం తమకు కూడా ఆర్థిక భారంగా ఫీలైన కొందరు నాయకులు కొత్తగా ఆలోచించి టీడీపీ నేతల తలుపుతట్టినట్టు తెలిసింది. నెల్లూరు జిల్లా జనసేన నాయకులకు టీడీపీ మంత్రులు, ఎంపీలతో సత్సంబంధాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని సభ్యత్వ నమోదుకు కావాల్సిన డబ్బును వాళ్ళనుంచే తీసుకున్నారట.

మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి నేతలతో గ్లాస్‌ లీడర్స్‌కు మంచి ర్యాపో ఉందట. అందులోనూ…. ముఖ్యంగా మంత్రి నారాయణను ప్రతిపక్షాలు విమర్శిస్తే…టీడీపీ నేతలకంటే ఎక్కువగా జనసేన నాయకులే బాధపడతారన్నది లోకల్‌ టాక్‌. వెంటనే కౌంటర్ ఇచ్చి.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా పెడుతుంటారు. దీంతో జనసేన సభ్యత్వ నమోదుకు కావాల్సిన సొమ్మును నారాయణతో పాటు ఎంపీ వేమిరెడ్డి కూడా సమకూర్చినట్టు చెప్పుకుంటున్నారు. ఎవరు ఎక్కువ మందిని చేర్పిస్తే పార్టీలో వారికి అంత గౌరవం దక్కుతుందన్న లెక్కలో టీడీపీ నాయకుల సాయంతో కొందరు జనసేన నేతలు టార్గెట్‌ పూర్తి చేసినట్టు తెలిసింది. జిల్లాలో యాక్టివ్‌గా ఉండే ఒకరిద్దరు నాయకులు టీడీపీ లీడర్స్‌ ఇచ్చిన డబ్బుతోనే మెంబర్‌షిప్‌ టార్గెట్‌ పూర్తి చేశారని గ్లాస్‌ పార్టీలోనే మాట్లాడుకుంటున్నారు. పవన్‌కళ్యాణ్‌ మీద ఉన్న అభిమానంతో కొందరు స్వచ్చందంగా సభ్యత్వం తీసుకున్నా…. ఎక్కువ శాతం మనీ మేటర్‌ కావడంతో…అలా జరిగిపోయిందని అంటున్నారు. అయితే… జిల్లా మొత్తం మీద ఇదే పరిస్థితి లేదు.

 

కొన్ని చోట్ల స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలకు, జనసేన నాయకులకు మధ్య సఖ్యత లేదు. అలాంటిచోట్ల ఉన్నంతలోనే పని పూర్తి చేసి మమ అనిపించారట. కానీ… జిల్లా పదవులు ఆశించే కొందరు నేతలు మాత్రం టిడిపి నాయకుల సహాయ సహకారాలతో భారీ టార్గెట్స్‌ రీచ్‌ అయినట్టు తెలిసింది. ఈ విషయమై జనసేనలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తాము స్వచ్ఛందంగా సభ్యత్వాలు చేయిస్తే…. కొందరు నేతలు కక్కుర్తిగా పక్క పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మరీ గొప్పలకు పోయారని విమర్శిస్తోంది ఒక వర్గం. జనసేన సభ్యత్వ ప్రక్రియ ముగిసిపోయినా…. ఈ డబ్బుల ప్రకంపనలు మాత్రం రేగుతూనే ఉన్నాయి. మిత్రపక్షాలుగా రెండు పార్టీల నాయకుల మధ్య సఖ్యత, సమన్వయం మంచిదే అయినా… సభ్యత్వ నమోదుకు ఆర్థిక సాయం తీసుకోవడాన్ని మాత్రం కాస్త తేడాగానే చూడాలని అంటున్నాయి రాజకీయవర్గాలు.

Exit mobile version