Site icon NTV Telugu

Off The Record : కొలికపూడి కొత్త గేమ్ స్టార్ట్ చేశారా?

Tdp

Tdp

ప్రభుత్వంలో లోపాలంటూ ఒక రోజున మెసేజ్‌ పెడతారు. ప్రతిపక్షానికి కనువిప్పు కావాలంటూ మరో రోజున ఎక్స్‌లో రియాక్ట్‌ అవుతారు. ఇంతకీ…. ఆ టీడీపీ ఎమ్మెల్యే మనసులో ఏమనుకుంటున్నారు? కూటమి సర్కార్‌ని ఇరుకున పెట్టాలన్నది ఆయన లక్ష్యమా? లేక రేపటి పరిణామాలను ముందే ఊహించి సేఫ్‌ అండ్‌ డబుల్‌ గేమ్‌ ఆడుతున్నారా? ఎవరా శాసనసభ్యుడు ఏంటా 360 డిగ్రీస్‌ ట్వీట్స్‌ ఎపిసోడ్‌? ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫస్ట్‌టైం ఎమ్మెల్యే అయ్యారు కొలికపూడి శ్రీనివాస్. మొదట్లో కొద్ది రోజులు బాగానే ఉన్నా… ఆ తర్వాతి నుంచి ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇటు సొంత టీడీపీ అధిష్టానాన్ని, అటు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. ఫస్ట్‌లో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ కేశినేని చిన్నిగా ఉన్న వ్యవహారం ఇప్పుడు కొలికపూడి వర్సెస్ పార్టీగా మారిందన్నది పొలిటికల్ వర్గాల మాట. ఆఖరి నిమిషంలో ఆయనకు టిక్కెట్‌ ఖరారుచేసి ఎమ్మెల్యేగా గెలిపించినా… ఇప్పుడు తమకే తలనొప్పిగా మారుతున్నారని, ఎమ్మెల్యే తీరుతో పార్టీ బాగా ఇబ్బందిపడుతోందని అంటున్నారు టీడీపీ నాయకులు.

ప్రతి విషయంలో ఆయన బోర్డర్ దాటారన్నది పార్టీ నేతలు ఆరోపణ. అదే సమయంలో ఆయన మాత్రం తనను అకారణంగా ఇబ్బంది పెట్టడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఇప్పుడిక ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు సమీపిస్తున్న వేళ కొలికపూడి చేస్తున్న కొత్త తరహా రాజకీయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. ఎమ్మెల్యే డబుల్ గేమ్ ఆడుతున్నారని, రేపటి రోజున ఏదన్నా తేడాపడ్డా…. నేను పార్టీ కోసమే అంతా చేస్తే ఇలా వ్యవహరించారని చెప్పే వ్యూహం కూడా ఉండి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల తీరు మొదలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వరకు అన్నిటిపై చేసిన వ్యాఖ్యలు గతంలో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చర్చకు కారణమయ్యాయి. ఎంపీ కేశినేని చిన్ని, కొలికపూడి మధ్య గ్యాప్ రావటంతో ఎంపీ టార్గెట్‌గా చాలా ఆరోపణలు, విమర్శలు చేశారాయన. దానికి సంబంధించి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్యేని రెండు సార్లు పిలిచి మాట్లాడినా ఆయన తీరు మారలేదు. ఇటీవలైతే… అసలు నేరుగా కులం ప్రస్తావన తీసుకువచ్చి చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారానికి కారణమయ్యాయి. నన్ను అవమానిస్తే భరిస్తాను… నా జాతిని అవమానిస్తే తెగిస్తానంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీడీపీలో కూడా అంతర్గతంగా తీవ్ర చర్చ జరిగిందట.

అదే సమయంలో ఆయనతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడటం, ఆ తర్వాత కొలికపూడి కూడా తిరువూరులో వివాదాలు ముగిశాయని మీడియా చిట్ చాట్‌లో చెప్పటంతో అంతా ముగిసిందని అనుకున్నారు. కానీ…. ఆ తర్వాత కూడా ఆయన తీరు మారకపోగా తిరిగి కొత్త రకంగా చేస్తున్న ట్వీట్స్‌పై పొలిటికల్ చర్చ జరుగుతోంది. తిరువూరులో ఇక వివాదాలు అన్నీ ముగిసిపోయాయని, తాను రాజకీయాల కోసం కులం కార్డు వాడే మనిషిని కాదని చెప్పిన నాయకుడు ఇప్పుడు ఎక్స్‌లో ఇలా మెసేజ్‌లు పెడుతున్నారేంటా అంటూ క్వశ్చన్‌ మార్క్‌ ఫేస్‌లు పెడుతున్నారు చాలామంది.అంతా సర్దుకుందని భావిస్తున్న వేళ నియోజకవర్గంలో కుల సంఘాల ఆధ్వర్యంలో కొలికపూడికి మద్దతుగా ప్రెస్మీట్స్‌ పెట్టారు. వాటికి పార్టీ తరఫునుంచి దేవదత్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే ట్వీట్స్‌ విషయానికి వస్తే… ఒక రోజున ప్రభుత్వానికి అనుకూలంగా….. అంటే, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉందని, దీనిపై ఎవరైనా, ఏ పార్టీ నుంచి అయినా బహిరంగ చర్చకు నేను సిద్ధమని సవాల్‌ చేస్తూ ట్వీట్ పెట్టారాయన.

ఆ తర్వాత నియోజకవర్గం పేకాట శిబిరాలకు కేంద్రంగా మారిందని ఒక పోస్ట్ పెట్టారు. తిరువూరు నియోజకవర్గంలో మద్యం వ్యాపారులు సిండికేట్ గా మారి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారని, అధిక ధరలకు అమ్ముతున్నారంటూ ఇరుకున పెట్టేలా పోస్ట్ పెట్టారు ఎమ్మెల్యే. ఆ తర్వాత మళ్లీ జగన్ అసెంబ్లీకి వచ్చి అమరావతికి మద్దతు ప్రకటించాలంటూ ప్రతిపక్ష పార్టీపై ట్వీట్ చేశారు. ఇలా…. ఒకరోజు ప్రభుత్వానికి అనుకూలంగా, వెంటనే ప్రతిపక్షం మీద ట్వీట్స్‌ చేయడం ద్వారా అధికార పార్టీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న అంచనాలు పెరుగుతున్నాయి. రేపటి రోజున ఒకవేళ పార్టీ తన మీద చర్యలు తీసుకుంటే…. ఈ ట్వీట్స్‌నే ఆయుధంగా వాడాలనుకుంటున్నట్టు విశ్లేషిస్తున్నారు. నేను తప్పును తప్పుగా తాను మాట్లాడాను తప్ప పార్టీ లైన్ దాటలేదన్న విషయాన్ని చెప్పేందుకే ఇలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం ఆయన డబుల్‌ అండ్‌ సేఫ్‌ గేమ్‌ మొదలుపెట్టారన్నది పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న డిస్కషన్‌.

Exit mobile version