Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్‌
  • పార్టీ మారిన నేతలకు ఇప్పుడు కొత్త చిక్కులు
  • అనుచరులకు పార్టీ పదవులు ఇప్పించుకోలేక సతమతం
  • పదవి కావాలంటే మూడేళ్ళు పార్టీలో పనిచేసి ఉండాలన్న రూల్‌
Rangareddy

Rangareddy

హస్తం నేతలు అక్కడ చుక్కలు చూస్తున్నారా..? సొంత పార్టీనే… సరికొత్త రూల్స్‌తో వాళ్ళకు షాకిస్తోందా? పార్టీ మారిన నేతలకు పదవుల సెగ తగులుతోందా? ఇలాగైతే సొంత కేడర్‌ను నిలబెట్టుకోవడం కష్టమంటూ వాళ్ళు మధనపడుతున్నారా? ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎక్కడుంది? ఏ జిల్లా నాయకులు అంతలా ఇరకాటంలో పడ్డారు? రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో ఇప్పుడు వలస నేతల హవానే నడుస్తోంది. ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నుంచి మొదలు.. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, మనోహర్ రెడ్డి.. ఇలా ఒకరేమిటి…జిల్లాలో పొలిటికల్‌ హేమా హేమీలని చెప్పుకునే వాళ్ళలో ఎక్కువ మంది ఇప్పుడు హస్తం గూటికే చేరారు. వాళ్లు పార్టీ మారడం సంగతి ఎలా ఉన్నా… ఆ తర్వాతే అసలు చిక్కులు మొదలయ్యాయట. నాయకుల వెనకే వచ్చిన అనుచరుల పరిస్థితి ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టయిందని అంటున్నారు. పార్టీ జిల్లా, డివిజన్, వార్డు కమిటీల్లో తమ వారికి పదవులు ఇప్పించుకుందామంటే… పీసీసీ పెట్టిన త్రీ ఇయర్స్ రూల్ ప్రతిబంధకంగా మారింది. పార్టీలో కనీసం మూడేళ్లు పనిచేస్తేనే పదవి ఇవ్వాలన్నది రూల్‌. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు అధిష్టానం నుంచి ఉన్న క్లియర్ కట్ లైన్ ఇది. 2023 ఎన్నికల కంటే ముందు నుంచి ఎవరైతే పార్టీని నమ్ముకుని ఉన్నారో, వారికే ప్రస్తుత కమిటీల్లో చోటు కల్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జంపింగ్ జపాంగ్‌లకు పార్టీలోకి వచ్చిన వెంటనే పదవులు ఇస్తే.. మొదటి నుంచి కష్టపడ్డ వారికి అన్యాయం జరుగుతుందని భావిస్తోంది అధిష్టానం.

దీంతో ఏళ్ల తరబడి జెండా మోసిన పాత కాపులు ఖుషీ అవుతుంటే.. వలస నేతల కేడర్‌లో మాత్రం నిరాశ పెరుగుతోందట. పదవులు లేకపోతే పార్టీలో మా ఉనికి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. మహిళా నేతల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలిసింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమె అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా… కీలక పదవి కోసం ఎదురు చూస్తున్నట్టు చెబుతున్నారు అనుచరులు. ప్రస్తుత మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లాల్లో మున్సిపల్ చైర్ పర్సన్స్, కార్పొరేషన్ మేయర్లుగా పని చేసిన నాయకురాళ్లు చాలామంది హస్తం పార్టీలో పదవుల కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ…. పీసీసీ త్రీ ఇయర్స్‌ కండిషన్స్‌తో వారంతా ఇంకొద్ది కాలం వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ నిబంధనపై కొత్తగా చేరిన నేతలు లోలోపల రగిలిపోతున్నారట. వచ్చీ రాగానే మంత్రి పదవులు ఇవ్వడానికి లేని రూల్స్.. పార్టీ కమిటీ పదవులకు ఎందుకన్నది వారి ప్రధాన ప్రశ్న. కీలకమైన స్థానిక కమిటీల్లో తమ వారికి ప్రాధాన్యత లేకపోతే.. రేపు ఎన్నికల సమయంలో కేడర్‌ను ఎలా కంట్రోల్ చేస్తామంటూ వాదిస్తున్నారు. పదవులు లేకుంటే కొత్త చేరికలు ఎలా ఉంటాయని అధిష్టానాన్ని నిలదీస్తున్నారు వలస నేతలు. పాత-కొత్త నేతల మధ్య మొదలైన ఈ చిచ్చు.. జిల్లాలో పార్టీ పటిష్టతకు దెబ్బతీస్తుందా? లేక అధిష్టానం ఏమైనా సడలింపులు ఇస్తుందా? అనేది ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో హాట్‌ టాపిక్‌.