ఆ జిల్లాలో ఓకే పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్సీ ఢీ అంటే ఢీ అంటున్నారా..? ఇద్దరి మధ్య పవర్ వార్ పీక్స్కు చేరుతోందా? పైకి మాత్రం ఎవ్వరూ, ఎక్కడా బయటపడకుండా….లోలోపల తీయాల్సినంత లోతున గోతులు తీసేసుకుంటున్నారా? రెండు పవర్ సెంటర్స్ మధ్య ఎటువైపు నడవాలో అర్ధంగాక కేడర్ దిక్కులు చూస్తోంది ఎక్కడ? ఎవరా ఇద్దరు? ఆ అంతర్యుద్ధానికి మూలాలు ఎక్కడున్నాయి? ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీలో కీలక నేత… ఎంపీ రఘునందన్ రావు. అలాగే విడిపోయాక సంగారెడ్డి జిల్లా పార్టీలో కీలకంగా మారారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి. 2020 దుబ్బాక ఉప ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ రావు.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన 2024 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ తరపున ఎంపీగా గెలిచారాయన. అటు అంజిరెడ్డి 2025లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. రఘునందన్ రావు, అంజిరెడ్డి గతంలో కలిసి మెలిసి పని చేసినవారే. కానీ… వీరిద్దరి మధ్య కొంత కాలంగా గ్యాప్ పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ సంగతి ఎక్కడా బయటపడకున్నా… ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందట. పార్టీ వర్గాలు ప్రస్తుతం దీని గురించే జోరుగా మాట్లాడుకుంటున్నాయి. రఘునందన్రావు, అంజిరెడ్డి మధ్య గ్యాప్ ఏర్పడటానికి ప్రధాన కారణం 2024 లోక్ సభ ఎన్నికలు అనేది ఓపెన్ టాక్. బీజేపీ తరపున మెదక్ ఎంపీ టికెట్ రఘునందన్ రావుకే వస్తుందని మొదట ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా… అంజిరెడ్డి అదే సీటు కోసం తనవంతు ప్రయత్నం చేశారట. ఆ క్రమంలో ఎవరికి వారు ఎంపీ టికెట్ రేస్లో వ్యూహాలకు పదును పెట్టారు. ఇక పార్టీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల మొదటి లిస్ట్లో మెదక్ పేరు లేరపోవడంతో.. ఉత్కంఠ ఇంకా పెరిగింది.
అదే అదునుగా భావించిన అంజిరెడ్డి టికెట్ కోసం అప్పటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి గట్టిగానే పైరవీలు చేసినట్టు ప్రచారం జరిగింది. వ్యవహారం పెండింగ్లో పడటంతో… అటు రఘునందన్రావు కూడా ఢిల్లీలో తెలిసిన నేతల ద్వారా…తనవంతు ప్రయత్నాలు చేసినట్టు చెప్పుకున్నారు. కారణం ఏదైనాసరే…. చివరికి ఎంపీ టికెట్ రఘునందన్నే వరించడం, ఆయన విజయం సాధించడం వరుస పరిణామాలు. అయితే… తనకి ఎంపీ టికెట్ రాకపోవడానికి రఘునందన్ రావే కారణమని అంజిరెడ్డి, అసలు ఫస్ట్ లిస్ట్లోనే ప్రకటించాల్సిన పేరు ఆలస్యం అవడానికి అంజిరెడ్డే కారణమని రఘునందన్ భావించడంతో… ఇద్దరి మధ్య అంతరం పెరిగిందని అంటున్నారు. ఇక ఆ ఎపిసోడ్ అలా ముగిసిందని అనుకునే లోపే… ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఆ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి టికెట్ తెచ్చుకున్నారు. రఘునందన్రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో అంజిరెడ్డి గెలుపుకోసం ప్రచారం చేశారు. ఫైనల్గా అంజిరెడ్డి విజయం సాధించారుగానీ… ఆ తర్వాతే కథ మరో మలుపు తిరిగిందట. అప్పటివరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో రఘునందన్ ఒక్కరే బీజేపీకి పవర్ సెంటర్గా ఉన్నారు. ఎమ్మెల్సీ అయ్యాక తాను కూడా అధికార కేంద్రంగా మారాలని అంజిరెడ్డి భావించడంతో మరోసారి అభిప్రాయ భేదాలు వచ్చాయట.
అసలు రఘునందన్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకే ఎంపీ. కానీ…. అంజిరెడ్డి 4 ఉమ్మడి జిల్లాలకు ఎమ్మెల్సీ అంటూ ఆయన అనుచరులు ప్రచారం చేశారు కూడా. దీంచో ఎంపీ, ఎమ్మెల్సీ మధ్య కోల్డ్ వార్ రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. అలాగే ఉమ్మడి జిల్లా బీజేపీలో రఘునందన్ అనుచరులు, అంజిరెడ్డి అనుచరులుగా విడిపోయి ఎవరికి వారు తాము ఫలానా నేత అనుచరులమని బహిరంగంగా చెప్పుకుంటూ తిరిగేంతలా పరిస్థితులు దిగజారాయట. ఇలావర్గాలుగా విడిపోతే… అసలు పార్టీ మనుషులు ఎవరంటూ… కట్టర్ కాషాయ కార్యకర్తలు మండిపడుతున్నారు. అలాగే…మరో రకమైన సమస్య కూడా పెరుగుతోందట. ఏమైనా పని కోసం ఎంపీ దగ్గరకు వెళ్తే ఎమ్మెల్సీ ఏమనుకుంటాడోనని..ఎమ్మెల్సీ దగ్గరకు వెళ్తే ఎంపీ ఏమనుకుంటారోనని కేడర్ సతమతం అవుతోందంటున్నారు. విచిత్రం ఏంటంటే… ఇద్దరు నేతల మధ్య ఈ కోల్డ్ వార్ ఎక్కడా బయటపడలేదుగానీ…. బహిరంగంగానే కనిపిస్తోంది. అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని గ్యాప్ని పూడ్చకపోతే మరింత ముదిరి పార్టీ ప్రయోజనాలు దెబ్బతినడం ఖాయమని అంటున్నారు.

