ప్రేమ సాగరంలో అగ్నిగుండం రగులుతోందా? అది ఇప్పుడప్పుడే చల్లారే సూచనలు కనిపించడం లేదా? ఎవరు ఏం చెప్పినా… డోంట్ కేర్, నేను కోరుకున్నది దక్కాల్సిందేనన్నట్టుగా వ్యవహారం మారిపోతోందా? ఆ కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఇక ఛాన్స్ దొరికినప్పుడల్లా బ్లాస్ట్ అయిపోతారా? ఎవరా నాయకుడు? ఏంటా అగ్నిగుండం? కొక్కిరాల ప్రేమ్సాగర్రావు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ కమ్ మంచిర్యాల ఎమ్మెల్యే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ వెంటే ఉన్నారాయన. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తనకు కచ్చితంగా కేబినెట్ బెర్త్ దక్కుతుందని అనుకున్నారు. కానీ… సామాజిక సమీకరణల కారణంగా ఆయనకు ఛాన్స్ మిస్ అయింది. అదే సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావును పాలమూరు జిల్లా నుంచి క్యాబినెట్లోకి తీసుకున్నారు. దాంతో…మొదట్లో ఆదిలాబాద్ జిల్లాకు అసలు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. విస్తరణలో కచ్చితంగా తమకు అవకాశం వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రేమ్ సాగర్ రావు. కానీ అప్పుడు వివేక్కు అవకాశం ఇవ్వడంతో మరింత అసంతృప్తి కి గురయ్యారు మంచిర్యాల ఎమ్మెల్యే. మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వారిని కాకుండా పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ఎలా పదవులు ఇస్తారంటూ తన నిరసనను ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారాయన.
అందుకే ఆయనకు క్యాబినెట్ హోదా ఉన్న నామినేటెడ్ పదవి ఇచ్చింది ప్రభుత్వం. కానీ… ఆయన కోరుకున్నది క్యాబినెట్లో ఉండటంకానీ… ఆ ర్యాంక్లో ఉండటం కాదు. అందుకే… తన అసంతృప్తిని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సమక్షంలోనే వినిపించాలని డిసైడ్ అయ్యారు. దాంట్లో భాగంగానే జిల్లా పర్యటనలో ఉన్న పీసీసీ అధ్యక్షుడి ముందే ప్రేమ్సాగర్ తన మనసులో మాటను చెప్పేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక చేరిన నాయకులు మళ్లీ కాంగ్రెస్ రాదని అనుకుంటే ఈ పార్టీలో ఉండబోరంటూ ఓపెన్గానే కామెంట్ చేశారు. తన మనసులో ఉన్న మాటలను కార్యకర్తల ముందే పార్టీ చీఫ్కి చేరేలా అన్నారాయన.
రెండు మూడు పార్టీలు మారి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇస్తే మొదటి నుంచి పనిచేస్తున్న నాయకుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తనతోపాటు… కాంగ్రెస్ కార్యకర్తను కూడా కలుపుకొని పార్టీ కోసం జెండా మోసిన వాళ్లను గుర్తించి పదవులు ఇవ్వాల్సిందేనని క్లారిటీగా అన్నారు ఎమ్మెల్యే. అధికారంలో ఉన్నా లేకున్నా వెంట ఉండేది కార్యకర్తలేనని, వాళ్లను జాగ్రత్తగా చూసుకోకపోతే పార్టీకి నష్టం అంటూ డైరెక్ట్ గానే అన్నారు. ఆ విధంగా తన మనసులో మాటను కార్యకర్తల ముందే పార్టీ నాయకత్వానికి చేరవేసినట్టయింది. క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా తనకు అవకాశం వస్తుందని ఎన్నో ఆశలతో ఉన్న ప్రేమ్ సాగర్ రావులో నిరాశ పెరిగిపోవడంతో… తన అసంతృప్తిని అలా బయటకు చెప్పేశారట. పార్టీలో కొందరు నాయకులు ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండేట్టు లేదని అంటున్నారు. తను ఆశించింది ఒకటి.. దక్కింది ఇంకొకటి అన్న ఆవేదనలో ఉన్నారట ప్రేమ్సాగర్ రావు. మరి ఆయన ఆవేదనకి పులిస్టాప్ పడుతుందా..? లేక అలాగే కంటిన్యూ అవుతుందా అన్నది చూడాలి.