ఏపీ డిప్యూటీ సీఎం నోట ఇప్పుడు కొత్తగా జై ఆంధ్ర మాట ఎందుకొచ్చింది? అంతకు మించి, రాజధాని అమరావతితో ముడిపెట్టి మరీ… ఆయన జై ఆంధ్ర వ్యాఖ్యలు ఎందుకు చేశారు? టీడీపీ అమరావతి, వైసీపీ మావిగన్ నినాదాలే ప్రకంపనలు రేపుతుండగా….కొత్తగా జనసేన మరో నినాదాన్ని ఎందుకు అందుకుంది? అసలు పవన్ మాటల మర్మం ఏంటి? వాటి గురించి రాష్ట్రంలో జరుగుతున్న చర్చలేంటి? జనసేన ఆత్మీయ సమావేశం వేదికగా… భవిష్యత్ ప్రణాళికపై అధ్యక్షుడు పవన్కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎప్పట్నుంచో… పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు ఎదురుచూస్తున్న చాలా ప్రశ్నలకు ఈ మీటింగ్లో సమాధానాలు చెప్పినట్టయిందని అంటున్నారు. పొత్తులు, పార్టీ నిర్మాణం, భవిష్యత్ రాజకీయ దిశ…. ఇలా అనేక అంశాలపై స్పష్టమైన వైఖరి వెల్లడించారు పవన్. ఏ విషయంలోనూ… సణుగుడు ధోరణి లేకుండా సూటిగా… సుత్తిలేకుండా మాట్లాడారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అదంతా ఒక ఎత్తయితే…. ఇదే మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి చేసిన జై ఆంధ్రా వ్యాఖ్యల చుట్టూ ఇప్పుడు సరికొత్త చర్చలు మొదలయ్యాయి. అందునా…. జై అమరావతి కాదు జై ఆంధ్రా అనడం వెనక పపన్ వ్యూహం ఏమై ఉంటుందంటూ రకరకాల కోణాల్లో విశ్లేషణలు జరుగుతున్నాయి.
రాజధాని చుట్టూ ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కిన పరిస్థితి. ఒకవైపు తెలుగుదేశం పార్టీ అమరావతి నిర్మాణ, పరిరక్షణ అజెండాతో ముందుకు సాగుతుండగా…. విపక్షం వైసీపీ వైఖరి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులన్న వైసీపీ… ఇప్పుడు మావిగన్ నినాదాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ వివాదాల చుట్టూనే రాజకీయం తిరుగుతూ హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్న టైంలో…. అధికార భాగస్వామి అయిన జనసేన అధ్యక్షుడు ఇచ్చిన జై ఆంధ్రా నినాదం సరికొత్త సందేహాలను రేపుతోంది. రాజధాని చుట్టూ జరుగుతున్న పరిమిత చర్చ, అభివృద్ధి పనులకు అతీతంగా…రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాల మధ్య సమతుల్యత రావాలి, ఐక్యత ఉండాలన్న విస్తృత దృక్పథాన్ని ప్రతిపాదించడమే ఈ ఈ వ్యాఖ్య ఉద్దేశ్యమా అంటూ చర్చించుకుంటున్నారు కొందరు. అలా కాకుండా….ఇది భవిష్యత్ రాజకీయ వ్యూహానికి సంకేతమా? అన్నది మరి కొందరి డౌట్. ఆయన ఉద్దేశ్యం ఏమున్నాసరే… జై ఆంధ్రా వ్యాఖ్యలు మాత్రం ప్రధాన రాజకీయ వేదికల మీద అజెండాగా మారిపోయాయి. పవన్ కళ్యాణ్ సడన్గా అలా ఎందుకు మాట్లాడారు? ఆయన అసలు అజెండా ఏమిటి? ముందు ముందు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారంటూ రకరకాల ప్రశ్నలకు సమాధానాలు వెదికే పనిలో ఉన్నారు కాస్త పొలిటికల్ ఇంట్రస్ట్ ఉన్న అందరూ.
సాధారణంగా పవన్…. ఏ సందర్భంలో ఏం మాట్లాడినా అది సంచలనంగానే మారుతూ ఉంటుంది. ఇది కూడా ఆ కోవలోదేనా…? లేక అంతకు మించిన ప్రాధాన్యం ఉన్నదా అంటూ విశ్లేషణలు కూడా నడుస్తున్నాయి. అలాగే… ఈ మీటింగ్లో తమిళనాడు ఎన్నికల నుంచి ఏపీలో కూటమి పొత్తుల వరకు ప్రస్తావించారాయన. తాజా రాజకీయ పరిణామాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల అంశాలపైనా మాట్లాడారు. కానీ….వాటన్నిటికంటే ఎక్కువగా…. జై అమరావతి కాదు జై ఆంధ్ర అనాలన్న వ్యాఖ్యల చుట్టూనే ప్రస్తుతం రాజకీయం తిరుగుతోంది. అసలు ఏ ఉద్దేశంతో ఈ మాటలు అన్నారన్నది పొలిటికల్ సర్కిల్స్ ముందున్న బిగ్ క్వశ్చన్. రాజధాని అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్. అలాంటి అమరావతి పేరు పెట్టిమరీ…. జై అమరావతి అనొద్దు… జై ఆంధ్ర అనాలని ఉప ముఖ్యమంత్రి చెప్పారంటే…. అదేం ఆషామాషీగా మాట్లాడిందో, యాదృచ్చికంగా చెప్పిన మాటో కాదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అమరావతి అంటే… 33 వేల ఎకరాల రాజధాని ప్రాంతం వరకు మాత్రమే పరిమితం అవుతుందని, కానీ జై ఆంధ్ర అంటే ఐదు కోట్ల మంది ప్రజలను ఏకం చేసే నినాదమని పవన్ భావిస్తున్నట్టు అభిప్రాయపడుతున్నారు కొందరు.
ఇక అమరావతిపై వైసీపీ అవినీతి ఆరోపణలు చేస్తున్నవేళ ఈ సమీకరణలన్నిటినీ కలిపి చూస్తే…పవన్ వ్యాఖ్యల ప్రభావం రాజధాని మీద నెగెటివ్గా పడే అవకాశం ఉందన్న అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర అనే భావన కంటే అమరావతి అనే పదమే ఎక్కువగా హైలైట్ అవుతోందన్న ఫీలింగ్ ఉంది. మరోవైపు ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని, తెలంగాణలో అంతగా లేవని ఆయన అనడం కూడా చర్చకు దారి తీసింది. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఎన్నికల సమయంలో అన్న పవన్… ఇప్పుడు కులాలపై ఇలా మాట్లాడడం ఏంటో అర్ధం కావడం లేదని అంటున్నారు. ఇదే సమయంలో రాజధానికి కుల ముద్ర వేయడం కూడా మైనస్గా మారిందన్న చర్చ కొనసాగుతోంది. దీంతో జై అమరావతి అంటూ ముందుకు వెళ్లడం రాజకీయంగా రాంగ్ సిగ్నల్ ఇస్తుందన్న అంచనాతోనే పవన్ జై ఆంధ్ర లైన్ తీసుకున్నారన్న వాదన సైతం వినిపిస్తోంది. మొత్తానికి ఆయన ఉద్దేశ్యం ఏదైనాగానీ….. కొత్తగా చేసిన జై ఆంధ్ర నినాదం మాత్రం పొలిటికల్ ప్రకంపనలు రేపుతోంది.
