ఆ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలంటేనే… అధికారులు భయపడిపోతున్నారా….? మంత్రుల పర్యటనలు అంటేనే….బాబోయ్ అనే పరిస్థితి వస్తోందా? ప్రోగ్రామ్ ఏదైనాసరే… గొడవ కామన్ అవుతోందా? నియోజకవర్గానికి మంత్రి వస్తున్నారని తెలిస్తే చాలు…. ఇక మొదలెడదామా అన్నట్టుగా ఏ సెగ్మెంట్లో మారిపోయింది? ఎందుకలా జరుగుతోంది? మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. ఇక 2014 నుంచి బీఆర్ఎస్ వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. ప్రస్తుతం కారు పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి. కానీ…. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో….ఇక్కడ తరచూ ప్రోటోకాల్ వివాదాలు రేగుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న ఇతర నియోజకవర్గాల్లో ఇలాంటి గొడవలు పెద్దగా లేకున్నా….నర్సాపూర్లో మాత్రం రచ్చో రచ్చస్య అన్నట్టుగా ఉంటోందట. రెండేళ్ల క్రితం అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ నియోజకవర్గంలో బడిబాట కార్యక్రమానికి వచ్చారు.
అప్పుడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాజిరెడ్డికి స్కూల్ లో ఓ రూమ్కి రిబ్బన్ కట్చేసే అవకాశాన్ని మంత్రి సురేఖ ఇవ్వడాన్ని ఎమ్మెల్యే సునీత వ్యతిరేకించారు. ఎటువంటి ప్రోటోకాల్ లేని రాజిరెడ్డితో క్లాస్ రూమ్ ఎలా ఓపెనింగ్ చేయిస్తారన్నది ఎమ్మెల్యే అభ్యంతరం. ఆ సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఆ తర్వాత కూడా ప్రతి సందర్భంలో ఎక్కడో ఒకచోట ప్రోటోకాల్ రగడ నడుస్తూనే ఉంది. ఇక తాజాగా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ నర్సాపూర్ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. నియోజకవర్గంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదన్న ఎమ్మెల్యే వాదనతో రచ్చ జరిగింది. గతంలో ఇదే అంశంపై అసెంబ్లీ స్పీకర్కు కూడా ఫిర్యాదు చేశారామె. నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలోనూ ప్రోటోకాల్ అంశంతో మొదలైన గొడవ చివరికి రాజకీయ విమర్శల వరకు వెళ్లింది. దీంతో ఇప్పుడు నియోజకవర్గంలోని అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలంటేనే హడలిపోతున్నారట.
ఏ కార్యక్రమంలో ఏమవుతుందోనని ఆందోళన పెరుగుతోంది. మంత్రి వివేక్, ఎమ్మెల్యే సునీత వర్గాల మధ్య గొడవ జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ రంగంలోకి దిగి నేతలకు నచ్చజేప్పేందుకు యత్నించినా ఫలితం లేదంటే సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు. అయితే ప్రోటోకాల్ సమస్యపై ఎమ్మెల్యే సునీత చేస్తున్న పోరాటం కరెక్టేనన్నది బీఆర్ఎస్ వెర్షన్. కానీ… కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎమ్మెల్యే వైఖరిని తప్పుపడుతున్నారు. మంత్రి మాట్లాడుతుంటే… మధ్యలో ఓ ప్రజాప్రతినిధి కలగజేసుకుని కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఎమ్మెల్యే ఇచ్చే గౌరవం ఇదేనా అని కౌంటర్ ఇస్తున్నారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే సమయంలో తాము ఏమీ అనలేదని…ఆమె అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తుంటే అంత రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏముందన్నది కాంగ్రెస్ వాదన.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో… ఎంత మాత్రం ప్రోటోకాల్ పాటించారో… సునీతా లక్ష్మారెడ్డి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే మంచిదన్నది కాంగ్రెస్ వెర్షన్. నర్సాపూర్ నియోజకవర్గంలో పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన స్థానాలు సాధించడం, ఎమ్మెల్యే స్వగ్రామం గోమారంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థే సర్పంచ్ గా గెలవడం, మున్సిపల్ ఎన్నికల్లోనూ నర్సాపూర్ మున్సిపాలిటీని అఝికార పార్టీ కైవసం చేసుకోవడంతో ఎమ్మెల్యే సునీత ఫ్రస్టేషన్లో ఉన్నారంటూ ప్రచారం చేస్తోంది కాంగ్రెస్. తాను కాంగ్రెస్ను వీడిన తర్వాత బలహీనంగా కనిపించిన పార్టీ క్యాడర్… ఆవుల రాజిరెడ్డి రాక తర్వాత బలపడటాన్ని ఆమె జీర్ణించుకలేకపోతోందంటూ ప్రచారం చేసుకుంటున్నారు హస్తం నేతలు. నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటే అధికారులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డికే ప్రాధాన్యం ఇస్తున్నారట. ఈ పరిస్థితుల్లో ప్రోటోకాల్ రచ్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం మంత్రులు వచ్చిన ప్రతిసారి గొడవ జరగడం కామన్ అయిపోతోంది. దీంతో…అఫీషియల్ ప్రోగ్రామ్స్ అంటేనే హడలిపోతున్నారట ప్రభుత్వ అధికారులు.
