తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు పొలిటికల్ పోరాటం కాకుండా…. వ్యయ పోటీగా మారాయా? ఒక ఓటు కోసం 10 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేస్తున్నారన్నది నిజమేనా? హైప్ కోసం అలా ప్రచారం చేస్తున్నారా…? లేక వాస్తవంలో కూడా ఆ రేంజ్ పంపకాలు నడుస్తున్నాయా? అసెంబ్లీ ఎన్నికలతో సమానంగా మున్సిపల్ అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారన్నది నిజమేనా? తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తిపోయింది. ఇక పోలింగ్కు సిద్ధమవుతున్న వేళ ప్రలోభాల పర్వం జోరందుకుంది. పైకి లేదు లేదంటున్నా…. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పుడు డబ్బునే నమ్ముకున్నారన్న ప్రచారం జోరుగా ఉంది. అదీకూడా అలా ఇలా కాకుండా….ఓ రేంజ్లో ఖర్చు చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నగదు, చీరలు, సిల్వర్, గోల్డ్ను నమ్మకున్నారట కొందరు. ఇక మునిసిపాలిటీల్లోని ఛోటా మోటా నేతలకు బైక్లు, కార్లు గిప్ట్గా ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో ప్రలోభాల పర్వం ఆవిష్కృతం కావడం తొలిసారని అంటున్నారు పొలిటికల్ పండిట్స్.
ఇంతకాలం ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు, యువత, మహిళలతో ప్రత్యేక భేటీలతో ప్రచారాన్ని అదరగొట్టారు అభ్యర్థులు. ఇప్పుడిక తమ అసలు సిసలు నిజ స్వరూపాన్ని బయటకు తీసినట్టు తెలుస్తోంది. ఎలాగైనా గెలువాలి. గెలవాలంటే… ప్రలోభాల వల వేయాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారట. కొన్ని చోట్ల అయితే… ఒక్కో ఓటుకు ఐదు నుంచి మొదలుకుని 20వేల వరకు ఖర్చు పెడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ అని లేదు. దాదాపు ప్రతి చోట ఇదే తంతు. మరీ ముఖ్యంగా ఛైర్మన్ పదవి జనరల్ అయిన చోట్ల ఈ డబ్బు ప్రభావం అత్యధికంగా ఉందట. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఆర్థికంగా బలమైన అభ్యర్థులు పోటీకి దిగారు. కాంట్రాక్టర్లు, రియలెస్టేట్, ఇతర రంగాలకు చెందిన వ్యాపారులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. అందుకే మున్సిపాలిటీల్లో ఎవరెవరి అవసరానికి తగ్గట్టు డబ్బు, బైకులు, కార్లు, చీరలు, పిల్లల ఫీజులు ఇలా ఒకటేమిటి ఎలా కావాలంటే అలా సర్దేస్తున్నారట. అంత ఖర్చుపెట్టి గెలిస్తే ఓకే గానీ మరి ఓడితే పరిస్థితి ఏంటోనన్న చర్చలు సైతం జరుగుతున్నాయి. మొత్తం మీద ఈ ఎన్నికలు చూస్తుంటే సేవా భావం పోయి డబ్బు ప్రభావం దండిగా కనిపిస్తోందని అంటున్నారు.