OTR : మల్లారెడ్డి రూట్ మార్చారా.. BRSలో మళ్లీ జోష్?

Malla Reddy

Malla Reddy

మాజీ మంత్రి మల్లారెడ్డి మనసు మార్చుకున్నారా? నిన్న మొన్నటి వరకు బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలతో టచ్‌ మీ నాట్‌ అన్నట్టు ఉన్న నాయకుడు … ఇప్పుడు అంతా నేనే అన్నట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? మనసు మారిందా..? లేక రెండు పడవల ప్రయాణం చేద్దామనుకుంటున్నారా? మల్లన్న పొలిటికల్‌ స్ట్రాటజీ ఏంటి? మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్‌లో తిరిగి యాక్టివ్‌ అయినట్టు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో పార్టీ వ్యవహారాలతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారాయన. ఒక దశలో అసలు బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారా అన్న సందేహాలు సైతం చాలా మందికి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో…. తాజాగా పార్టీ తరపున జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఆయన యాక్టివ్‌గా పాల్గొనడంతో మళ్లీ మనసు మార్చుకున్నారా అన్న చర్చలు మొదలయ్యాయి.

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఈ క్రమంలో… మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారాయన. కార్యకర్తలను ఉత్సాహ పరిచేలా డ్యాన్స్‌లు చేస్తూ కేరింతలు కొడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో… మల్లన్న మనసు మారిందా అన్న డిస్కషన్స్‌ మొదలైపోయాయి. అన్ని కార్యక్రమాల్లో పార్టీ అగ్రనేతలు సైతం పాల్గొంటున్నా… ఇన్నాళ్లు నాకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు మల్లారెడ్డి. మేడ్చల్ నియోజకవర్గంలో పార్టీ తరపున కార్యక్రమాలు నిర్వహించలేదు. మరీ ముఖ్యంగా… సర్ ప్రక్రియలో భాగంగా జిల్లాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి ఓట్లు తొలగించకుండా చూడాలని బిఎల్ఏలకు సూచించింది పార్టీ. ఆ కార్యక్రమానికి కూడా దూరంగా ఉన్నారు మాజీ మంత్రి. ఈ క్రమంలో ఆయన ఫ్యామిలీ ప్యాక్‌గా వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆయన పెద్ద కోడలు ప్రీతిరెడ్డి బిజెపి సమావేశాలు, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు హాజరవుతూ వచ్చారు.

ఆ ప్రచారాన్ని మల్లారెడ్డి కుటుంబం ఖండించక పోవడంతో అనుమానాలు ఇంకా పెరిగాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో రెండేళ్ల సమయం ఉంది. దీంతో ముందు జాగ్రత్త పడుతున్న మల్లారెడ్డి ఫ్యామిలీలో అందరికి టికెట్లు కావాలని ఇప్పటికే జాతీయ పార్టీలను సంప్రదించారని… ఒకటి రెండు టికెట్ల వరకు అయితే ఒకేగానీ… మూడు నాలుగైతే ఇవ్వలేమని వాళ్ళు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో… ఆశలు వదులుకోకుండా…. ఆ పార్టీతో రహస్య సంబంధాలు కొనసాగిస్తూ ఈ పార్టీతో బహిరంగ వేదికలను పంచుకుంటూ రెండు పడవల ప్రయాణం చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వరకు ఇలానే రెండు పార్టీలతో సంబంధాలు కొనసాగిస్తూ…. చివర్లో ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మల్లారెడ్డి వ్యవహారాన్ని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని… అందుకే పార్టీలో కొనసాగాలని కోరడం కూడా మానేశారని చెబుతున్నారు. రెండు మూడు రోజులు హంగామా చేసి… మళ్ళీ సైలెంట్ అవడం ఆయనకు మామూలేనన్న చర్చ బీఆర్‌ఎస్‌లోనే జరుగుతోందట.