OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?

Konda

Konda

తెలంగాణ మంత్రి కొండా సురేఖ పదవి మీద కత్తి వేలాడుతోందా? ఇన్నాళ్ళు చూసీ చూడనట్టు వదిలేసిన కాంగ్రెస్‌ అధినాయకత్వం ఇప్పుడు సీరియస్‌గా ఉందా? పొగబెట్టుడు ప్రోగ్రామ్‌ ఇక మొదలైపోయినట్టేనా? పాత పంచాయితీల్లో కొండాకు మద్దతుగా నిలబడ్డ వాళ్ళు కూడా ప్రస్తుతం చేతులెత్తేశారా? మినిస్టర్‌ వ్యవహారంపై గాంధీభవన్‌ వైఖరి పూర్తిగా మారిపోయినట్టేనా? కూతురు మాటలు వ్యక్తిగతం, నాకేం సంబంధమన్న స్టేట్‌మెంట్‌పై పీసీసీ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఏదో ఒక వివాదంతో తరచూ వార్తల్లో నిలుస్తున్న మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు ముదిరి పాకాన పడ్డట్టే కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పండిట్స్‌. ఈసారి మేటర్‌ బాగా సీరియస్‌ అయిందని అంచనా వేస్తున్నారు. గతంలోని వివాదాల ఆనవాళ్లు సమసి పోకముందే… ఈసారి కొత్తది, ఇంకా సీరియస్‌ వివాదం తెర మీదకి వచ్చింది. ఏకంగా కాంగ్రెస్‌ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ… మంత్రి కుమార్తె అన్న మాటలు కాక రేపాయి. కొండా సుశ్మిత చేసిన తీవ్ర వ్యాఖ్యలపై అటు సీఎం రేవంత్‌రెడ్డి, ఇటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌ బాగా సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం.

అందుకే… సమస్య సుస్మితది అయినా….. నోటీసుల్ని మాత్రం ఆమె తల్లి, మంత్రి కొండా సురేఖకి పంపిందట పీసీసీ క్రమశిక్షణ కమిటి. చూస్తూ వదిలేస్తే… శృతి మించుతోందని, అందుకే ఈసారి వ్యవహారాన్ని సీరియస్‌గానే సెటిల్ చేయాలని డిసైడ్ అయినట్టు చెప్పుకుంటున్నారు. అందుకు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు సుశ్మిత. అప్పుడే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు సీఎం. కానీ… ఒక్కసారికి వదిలేద్దామంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో రాయబారం పంపి క్షమాపణలతో సరిపెట్టేశారు. కానీ.. ఈసారి మాత్రం పరిస్థితి అలా లేదట. పీసీసీ కూడా సీరియస్‌గానే ఉందని అంటున్నారు.

యాక్షన్‌ తీసుకోమంటూ…..క్రమశిక్షణ కమిటీని మహేష్‌ గౌడ్‌ ఆదేశించినట్టు తెలిసింది. పార్టీ మహిళా నేతలు గాంధీభవన్‌ వేదికగా రివర్స్‌ అటాక్‌ మొదలుపెట్టడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. ఇక్కడే ఓ చాణక్యం కూడా ప్రదర్శిస్తున్నారు పార్టీ నేతలు. గాంధీభవన్‌ నుంచి మాట్లాడుతూ… మంత్రి సురేఖ మీద సానుభూతి కురిపిస్తూ… ఆమె కుమార్తె సుశ్మితను గట్టిగా టార్గెట్‌ చేస్తున్నారు. దాని వెనక వ్యూహం ఎలా ఉన్నా…. ఈసారి మాత్రం తాడోపేడో తేల్చుకోవాలనే పీసీసీ కూడా డిసైడైనట్టే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. పరకాల సీటు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై అభ్యంతరం ఉంటే.. నేరుగా పీసీసీ అధ్యక్షుడితోగాని, లేదా… ఇంచార్జ్‌తోగాని మాట్లాడి ఉండాల్సింది, తమ మనసులో మాట చెప్పాల్సి ఉంది. అలా కాకుండా… సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుశ్మిత డైరెక్ట్‌గా ముఖ్యమంత్రిని, స్థానిక ఎమ్మెల్యేని టార్గెట్ చేయడం, బహిరంగ వేదిక మీదే సీరియస్‌ కామెంట్స్‌ చేయడం చూసి పార్టీ పెద్దలు కూడా ఆశ్చర్య పోయారట. ఇక నోటీసుల విషయంలో కూడా పీసీసీ క్రమశిక్షణ కమిటీ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ముగ్గురు రెడ్డి సామాజిక వర్గం నేతలకు నోటీసులు ఇస్తే.. బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ ఒక్కరికి ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో… కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగినా… కొండా పదవి ఉంటుందా? పోతుందా? అన్న చర్చలు కూడా గట్టిగానే జరుగుతున్నాయి. ఇంకొందరైతే… ప్రస్తుతానికి అది అసలు అప్రస్తుతం, అంతకంటే ముందే ఆమె మీద పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందేమో చూడాలని అంటున్నారు. ఊరుకుని ఇలాగే వదిలేస్తే… పరిస్థితి చేయి దాటిపోతోందని భావిస్తున్న పీసీసీ…ఈసారి మాత్రం కొండాపై యాక్షన్‌ తీసుకోవాల్సిందేనన్న ఫీలింగ్‌లో ఉందట. ఫైనల్‌గా యాక్షన్‌, అందుకు మంత్రి రియాక్షన్‌ ఎలా ఉంటాయో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.