Site icon NTV Telugu

Off The Record : టీడీపీతో తెగదెంపులకు కొలికపూడి సిద్దమయ్యారా..?

Kolikapudi

Kolikapudi

ఆ ఎమ్మెల్యే టీడీపీతో తెగదెంపులకు సిద్దమవుతున్నారా? అందుకే వాయిస్‌ రెయిజ్‌ చేసి విమర్శల డోస్‌ పెంచుతున్నారా? రోడ్లు, ఉద్యోగాలంటూ సొంత ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయడం అందులో భాగమేనా? తనకు తానుగా కాకుండా… వాళ్లే వెళ్ళగొట్టేలా చేయాలన్న వ్యూహం ఉందా? ఎవరా శాసనసభ్యుడు? సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలా ఎందుకు చేసుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసులా మారిన ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్వరం ఇంకా పెంచుతున్నారు. ఆ చర్చలే ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్‌ హాట్‌గా నడుస్తున్నాయి. స్థానికుడు కాకపోయినా తక్కువ టైం ఉన్నా.. కూటమి వేవ్‌లో కొలికపూడి గెలిచినప్పటి నుంచి అంతా తేడాగా వ్యవహరిస్తున్నారన్నది లోకల్ టాక్. ఇప్పటికే పలు సందర్బాల్లో ఎమ్మెల్యే మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది టీడీపీ అధిష్టానం. సొంత పార్టీ ఎంపీ కేశినేని చిన్నితో గ్యాప్ రావడం, అది చివరకు పెరిగి పెద్దదవడంతో పార్టీ కూడా ఇరకాటంలో పడాల్సి వచ్చింది. ఇప్పటికే రెండుసార్లు పార్టీ క్రమశిక్షణ కమిటీ కొలికపూడిని పిలిచి చెప్పాల్సిందంతా చెప్పినప్పటికీ ఆయన తీరు మాత్రం మారటం లేదన్న అభిప్రాయానికి అధిష్టానం వచ్చిందట. ఇక తాజాగా ఎమ్మెల్యే ప్రభుత్వం మీదే నేరుగా ఆస్త్రాలు ఎక్కువ పెట్టడం చూస్తుంటే…. తెగదెంపులకు సిద్ధమవుతున్నారా అన్న డౌట్స్‌ పెరుగుతున్నాయని టీడీపీ నాయకులే ఇంటర్నల్‌గా మాట్లాడుకుంటున్నారు. కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిపక్ష వైసీపీతో వ్యవహరించిన తీరు విమర్శలకు కారణమైంది.

ఆ తర్వాత సొంత ప్రభుత్వంలో అధికారులు సరిగా పనులు చేయటం లేదంటూ నిరసన తెలపడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయి ఏకంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. ఆ తర్వాత సొంత పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో గ్యాప్ రావడంతో రచ్చ ఎక్కువైంది. ఇది అధిష్టానం వరకు వెళ్లడంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఒక దశలో ఎమ్మెల్యే మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీ పిలిచి మాట్లాడినా ఆయన ఎక్కడా తగ్గలేదన్నది పొలిటికల్‌ ఒపీనియన్‌. తిరువూరు పేకాట శిబిరాలకు అడ్డాగా మారిందంటూ ఒకసారి పేకాటలో పట్టుబడ్డ వారి ఫోటోలను వాట్సప్ స్టేటస్‌గా పెట్టారాయన.ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీకి డబ్బులిచ్చానంటూ మరోసారి స్టేటస్‌ పెట్టడం తెలుగుదేశం పార్టీలో పెద్ద దుమారమే రేపింది. ఆ సమయంలో ఎమ్మెల్యేని, ఎంపీని పార్టీ క్రమశిక్షణ కమిటీ పిలిపించి మాట్లాడింది. దీంతో కొలికపూడిపై అధిష్టానం వేటు వేస్తుందన్న చర్చ గట్టిగానే జరిగినా.. ఫైనల్‌గా అలాంటిదేం లేదు. అయితే ఆయనకున్న పవర్స్‌ని పరిమితం చేసి నియోజకవర్గంలో బాధ్యతల్ని ఎంపీ వర్గానికి అప్పగించింది టీడీపీ అధిష్టానం. లోకల్‌ పోస్టింగ్స్‌, కీలక నిర్ణయాలన్నీ ఎంపీ వర్గమే తీసుకుంటోందట. దీంతో ఇప్పుడు కొలికపూడి రూట్ మార్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.

ఎంపీ టార్గెట్‌గా చేస్తున్న విమర్శల్ని పక్కన పెట్టి… ఇప్పుడు డైరెక్ట్‌గా సొంత ప్రభుత్వం మీదే గురి పెట్టారాయన. ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ఇవ్వాల్సిన సబ్సిడీ బకాయిల కోసం ఆందోళన చేస్తున్న వారిని ఇటీవల పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఆ చర్యను ఖండిస్తూ.. ఓ వీడియోలో విడుదల చేశారు ఎమ్మెల్యే. ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించుకోవాలని ఓవైపు చెబుతూనే… మరోవైపు సబ్సిడీ కోసం వచ్చిన వారి పట్ల అలా వ్యవహరించడం సరికాదని పరోక్షంగా ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు సంధించారాయన. ఇక తాజాగా మార్నింగ్ వాక్ పేరుతో గ్రామాల్లో పర్యటిస్తున్న కొలికపూడి… ఊళ్ళలో రోడ్లు సరిగా లేవని, పిల్లలకు ఉద్యోగాలు దొరకడం లేదని, పల్లెలు కన్నీరు పెడుతున్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ పోస్ట్‌లు ఇక నేరుగా ప్రభుత్వాన్నే తాకడం చర్చనీయాంశమైంది. దీన్నిబట్టి చూస్తుంటే… ఇక తాడోపేటో తేల్చుకోవాలని ఎమ్మెల్యే డిసైడైనట్టు కనిపిస్తోందని అంటున్నారు. ఆయన తెగదెంపులకు సిద్ధమయ్యారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి చాలామందికి. రాబోయే రోజుల్లో సొంత సర్కార్‌ మీదికి కొలికపూడి ఎలాంటి అస్త్రాలు ఎక్కుపెడతారో…. పార్టీ పెద్దలు ఎలా రియాక్ట్‌ అవుతారోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.

Exit mobile version