Site icon NTV Telugu

Off The Record : అత్యంత కీలకమైన ఆ పదవి ఎవరికి దక్కబోతోంది..?

Tg

Tg

తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఆ పదవి ఎవరికి దక్కబోతోంది? నిత్యం ముఖ్యమంత్రి వెన్నంటి ఉంటూ ఆయనతో పాటే రివ్యూ మీటింగ్స్‌లో పాల్గొనే అవకాశం ఉన్న ఆ పోస్ట్‌ కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు? అరడజన్‌కు పైగా ఆశావహులు పోటీ పడుతున్న ఆ పదవి ఏది? ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళకు దక్కుతుందా, లేక అధిష్టానం కోటాలో వెళ్తుందా? లెట్స్‌ వాచ్‌. తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్లు దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపింది కాంగ్రెస్‌ నాయకత్వం. రెండిటిలో ఒకటి పార్టీ సీనియర్‌ లీడర్‌ అభిషేక్‌ సింఘ్వికి, మరొకటి సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి ఫిక్స్‌ అయ్యాయి. ఆ మేరకు ఇద్దరూ నామినేషన్‌ వేశారు కూడా. ఎన్నిక కూడా లాంఛనమేనని అంటున్నారు.

 

అయితే… నామినేషన్‌కు ముందు తన సలహాదారు పదవికి రాజీనామా చేశారు వేం. ఇదే ఇప్పుడు సరికొత్త చర్చకు దారి తీస్తోంది. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు పదవిలో వేరే ఎవర్ని అయినా నియమిస్తారా? లేక వేం నరేందర్‌రెడ్డికే తిరిగి ఇస్తారా? అదీఅదీ కాదని అసలు ఖాళీగా ఉంచుతారా రకరకాల డిస్కషన్స్‌ మొదలయ్యాయి. అదే సమయంలో సీఎం సలహాదారు పదవి కోసం అర డజన్‌ మంది కాంగ్రెస్‌ ఆశావహులు పోటీ పడుతున్నారట. దీనికి సంబంధించి రాష్ట్ర సచివాలయంలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటికే పది మంది సలహాదారులు ఉన్నారు. కానీ… అన్నిటికంటే అతి ముఖ్యమైన పోస్ట్‌ ముఖ్యమంత్రి సలహాదారు పదవి.

ఎక్కువ సమయం ముఖ్యమంత్రి వెంటే ఉంటూ ఆయనతో పాటే వివిధ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన వేం నరేందర్ రెడ్డి అలానే వ్యవహరించారు కూడా. ఇప్పుడు కొత్తగా రాబోయే సలహాదారు కూడా అలానే నడుచుకోవాల్సి ఉంటుంది. దీంతో ముఖ్యమంత్రికి నరేందర్‌రెడ్డి అంత నమ్మకస్తుడు మరొకరు ఎవరు ఉన్నారు? ఉన్న వారిలో ఎవరికి ఆ పదవిని అప్పగిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో చీఫ్‌ అడ్వైజర్‌ పోస్ట్‌ను తిరిగి వేం నరేందర్ రెడ్డికే అప్పగిస్తారనే మాటలు సైతం వినిపిస్తున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజా భద్రతా సలహా సంఘం చైర్మన్ గా, రాజ్యసభ సభ్యుడిగా కేవీపీ రామచంద్రరావు కొనసాగారు. అయితే… అప్పట్లో ఆ పదవి చేపట్టిన కేవీపీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి జీత భత్యాలు లేవు. ఆ సంగతి ఎలా ఉన్నా…గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా వేం నరేందర్ రెడ్డిని రెండు పదవుల్లో కొనసాగించాలంటే…
చట్ట సవరణ చేసి పోస్టు క్రియేట్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు పొలిటికల్‌ ఎక్స్‌పర్ట్స్‌.

ఒకవేళ అంత దూరం ఎందుకు,లేనిపోని సమస్యలు అనుకుంటే మాత్రం ఆ పదవిలో కొత్త వాళ్లను నియమించుకుంటే సరిపోతుంది. ఇక ఆశావహుల్లో నిన్నటి వరకు రాజ్యసభ రేసులో ఉన్న వి. హనుమంతరావుకు ముఖ్యమంత్రి సలహాదారు పదవి ఇస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. ఆయన పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీయే గాక బీసీ నేతగా, వీటన్నిటికీ మించి గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా పేరుంది. ఆయనతో పాటు మరికొందరు సీనియర్స్‌ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి వెంట ఉండే రోహిణ్‌ రెడ్డి, ఫహిమ్ ఖురేషీ, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అంటే… ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఇలా అందర్నీ కలుపుకొని పోయే లక్షణం ఉండాలి. దీంతో ముఖ్య సలహాదారు పదవి విషయమై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోన్నన ఉత్కంఠ పెరుగుతోంది.

Exit mobile version