జూబ్లీహిల్స్లో బీజేపీ సింగిల్ పాయింట్ అజెండాతో ముందుకు వెళ్తోందా? అదే అంశం మీద ఓట్లు కొల్లగొట్టాలనుకుంటోందా? దాని గురించే గట్టిగా చెప్పగలిగితే… ఓ వర్గం ఓట్లు సాలిడ్ అవుతాయని కాషాయ దళం లెక్కలేస్తోందా? ఇంతకీ ఉప ఎన్నిక బరిలో కమలం పార్టీ ప్లాన్ ఏంటి? ఓట్ల వేటలో పార్టీ ప్రయోగిస్తున్న ప్రధాన అస్త్రం ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం పీక్స్కు చేరింది. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం పొగలు సెగలు పుట్టిస్తోంది. కలిసి వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా వాడుకుంటున్నాయి అన్ని ప్రధాన రాజకీయపక్షాలు. ఇందులో భాగంగానే…తన బ్రాండ్ అయిన హిందుత్వ అజెండాతో ముందుకు వెళ్తోంది బీజేపీ. జరుగుతోంది ఒక నియోజకవర్గం ఉప ఎన్నిక అయినా… ఇక్కడ కూడా హిందుత్వం ,జాతీయ వాదాల గురించే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు కాషాయ నాయకులు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓట్ల ప్రభావం ఎక్కువ. దాదాపు లక్షా 30వేల వరకు ఉన్నాయి. దాంతో… హిందువుల్ని సాలిడ్గా తమవైపు తిప్పుకోవాలన్న ప్రణాళికతో ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
సీనియర్స్ సహా…. ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ నాయకులంతా మత పరమైన అంశాలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. వాళ్ళ ప్రసంగాలన్నీ హిందూ, ముస్లిం అన్న వ్యవహారాల చుట్టూనే తిరుగుతున్నాయి. ముస్లిం ఓట్ల కోసం సీఎం రేవంత్రెడ్డి రేవంతుద్దీన్గా మారారంటూ తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే… ఇంకో అడుగు ముందుకేసి ముస్లిం టోపీ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే… తల నరుక్కుంటానుగానీ… ఆ టోపీ మాత్రం పెట్టుకోబోనని అన్నారు. జూబ్లీహిల్స్లో ఉన్న లక్ష ఓట్ల కోసం అంత చేస్తున్న మీకు మూడు లక్షల మంది హిందువుల ఓట్లు వద్దా అని అన్నారు పార్టీ నాయకురాలు డీకే అరుణ.
కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఇజ్జత్ అయితే…. మరి హిందువులు ఏంటని ప్రశ్నించారు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి హిందువుల ఓట్లు వద్దా అని అడుగుతున్నారాయన. ఇలా… హిందూ ఓట్ల సెంట్రిక్గా ఒక ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ను టార్గెట్ చేస్తోంది బీజేపీ. ఆ రకంగా హిందువుల ఓట్లను వీలైనంత ఎక్కువగా తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పండిట్స్. కాంగ్రెస్, బీఆర్ఎస్ మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలేనని చెబుతూ తమను తాము ప్రొజెక్ట్ చేసుకునే పనిలో ఉన్నారు. మొత్తం మీద హిందూ ఓట్ల పోలరైజేషన్ కోసం బీజేపీ చేస్తున్న కసరత్తు ఆసక్తికరంగా మారింది. ఈ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? సర్వే అంచనాలకు భిన్నంగా కాషాయ దళం అద్భుతమైన పనితీరు ప్రదర్శించగలుగుతుందా అన్నది ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్.
