Site icon NTV Telugu

Off The Record : కడియం, దానం విషయంలో స్పీకర్ తీర్పుపై ఉత్కంఠ

Danam

Danam

స్పీకర్ విచారణ ముగిసింది..తీర్పు మిగిలింది. తెలంగాణ అసంబ్లీ స్పీకర్‌ ఇన్నాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఒక ఎత్తు. ఆ ఒక్క ఎమ్మెల్యే విషయంలో తీసుకోబోయే నిర్ణయం మరో ఎత్తు. పది మంది పార్టీ మారితే ఒక్క శాసనసభ్యుడి విషయంలోనే ఎందుకు పీటముడి పడింది? అంత ఉత్కంఠ ఎందుకు పెరిగింది? ఆ స్థాయి సస్పెన్స్‌ క్రియేట్‌ చేస్తున్న సదరు శాసనసభ్యుడెవరు? తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ విచారణ ముగిసింది. మొత్తం పది మంది పార్టీ మారితే ఇద్దరి వ్యవహారం ఒక ఎత్తు, మిగతా 8మంది విషయంలో స్పీకర్‌ తీర్పు మరో ఎత్తు అన్నట్టుగా ఉంది వ్యవహారం. సరిగ్గా ఆ రెండే ఇప్పుడు పెండింగ్‌లో ఉన్నాయి.

 

8 మంది MLA లు పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటూ పిటిషన్స్‌ను డిస్మిస్ చేశారు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌. కానీ… కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషంలో ఎలాంటి తీర్పు ఇస్తారోనన్న ఉత్కంఠ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది రాజకీయవర్గాల్లో. తాను పార్టీ మారలేదని ఇప్పటికే చెప్పుకున్నారు కడియం. కానీ…ఆయన కుమార్తె లోక్‌సభకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన క్రమంలో…. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదే అంశాన్ని మెన్షన్ చేసింది BRS. దానికి సంబంధించి తన వివరణ తాను ఇచ్చుకున్నారు శ్రీహరి. కానీ… దానం నాగేందర్ వ్యవహారం మాత్రం అంతకు మించి అన్నట్టుగా ఉంది.

ఆయనకు రిస్క్‌ చాలా ఎక్కువ అన్నది పొలిటికల్‌ ఒపీనియన్‌. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేగా ఉంటూ… కాంగ్రెస్‌ బీ ఫామ్‌ మీద పోటీ చేయడాన్ని తిరుగులేని ఆధారంగా చూపిస్తోంది బీఆర్‌ఎస్‌. అయితే… ఆయన విచారణలో కీలక అంశాలే చర్చకు వచ్చాయి. తన మీద బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసే నాటికి తాను కాంగ్రెస్‌ బీఫామ్‌ మీద పోటీ చేయలేదని, కంప్లయింట్‌ ఇచ్చాక జరిగిన వ్యవహారాలను పరిగణనలోకి తీసుకోవద్దని వాదించారాయన. ఈ విషయంలో ఆయన లాజిక్‌ ఆయనకు ఉన్నా… సరిగ్గా ఇదే పాయింట్‌ను తనకు ఆయుధంగా వాడుకుంది బీజేపీ. ఈ కేసులో ఇంప్లీడ్‌ అయింది. తాము పిటిషన్ వేసే నాటికి దానం నాగేందర్ కాంగ్రెస్‌ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ సీటుకు పోటీ చేశారంటూ వాదన వినిపించారు కమలం నాయకులు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉంటూ.. కాంగ్రెస్ బీ ఫామ్‌ మీద పోటీ చేసిన అంశం మీదనే ఆర్గ్యుమెంట్స్ జరిగాయి కాబట్టి…తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావిస్తోంది బీజేపీ. ఈ పరిస్థితుల్లో రాజకీయ విమర్శల సంగతి ఎలాఉన్నా… దానం విషయంలో స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి అయితే అందరిలో ఉంది. దీనికి సంబంధించి ఈ నెల 12న సుప్రీంకోర్ట్‌లో విచారణ ఉంది. ఆలోపే స్పీకర్‌ జడ్జిమెంట్ ఇస్తారా..? లేదంటే విచారణ ముగిసింది… జడ్జిమెంట్ ఇవ్వబోతున్నామని సుప్రీంకోర్ట్‌కు చెప్తారా అన్నది తేలాల్సి ఉంది. దీంతో పార్టీ మారిన ఏ ఎమ్మెల్యే విషయంలో లేనంత ఆసక్తి దానం నాగేందర్ విషయంలో పెరుగుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో

Exit mobile version