ఇప్పుడక్కడ గులాబీ పార్టీ ఎమ్మెల్యే వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారిందట. సొంత పార్టీ నేతల కార్యక్రమం వద్దు… అధికార పార్టీ ప్రోగ్రామే ముద్దు అన్నట్లుగా ఉందట ఆయన వ్యవహరం. ప్రాంత నీటి ప్రయోజనాల కోసం సొంత పార్టీ నేతలంతా ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రోగ్రాం పెట్టుకుంటే ఎమ్మెల్యే డుమ్మా కొట్టి మంత్రుల పర్యటనలో తళుక్కుమనడం గులాబీ శిబిరంలో హాట్ టాపిక్ అయింది. ఆ ఎమ్మెల్యే ఎవరు..? ఆయన ఈక్వేషన్స్ ఏంటి..? చూద్దాం. గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ గెలిచినప్పటికీ… అలంపూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయుడు గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఓ దశలో ఎమ్మెల్యే విజయుడు, అదే ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ చల్లా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కలిసి అధికార పార్టీ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. అయినప్పటికీ అది ముందుకు సాగలేదు. రెండున్నరేళ్లు గడిచాక అలాంటి వార్తలే ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయి. దీనికి కారణం ఎమ్మెల్యే విజయుడు వ్యవహారమే అనే మాట వినిపిస్తోంది. విజయుడు, చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్లో చేరతారని అప్పట్లో ప్రచారం
కర్ణాటక నీటి దోపిడీని ఎండగడుతూ జిల్లా బీఆర్ఎస్ నేతల బృందం రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ పర్యటన చేపట్టింది. కర్ణాటక నీటి దోపిడీతో పాటు… ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంటోందని విమర్శలు వర్షం కురిపించారు బీఆర్ఎస్ నేతలు. అలంపూర్ ప్రాంత నీటి ప్రయోజనాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలను హెచ్చరించారు. అయితే బీఆర్ఎస్కు మైలేజీ వచ్చే ఈ కార్యక్రమానికి రాష్ట్ర నేతలతో పాటు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు హాజరుకాగా జిల్లాలో బీఆర్ఎస్కు ఉన్న ఒక్కగానొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ నేతలు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అలంపూర్ నియోజకవర్గ నీటి ప్రయోజనాల కోసం ప్రాజెక్ట్ బాట పడితే… ఎమ్మెల్యే విజయుడు మాత్రం గద్వాల నియోజకవర్గంలో మంత్రుల పర్యటనలో తళుక్కుమనడం హాట్ టాపిక్ అయిందట. విజయుడు వ్యవహారంపై అలంపూర్ గులాబీ శిబిరంలో రకరకాలుగా చర్చ జరుగుతోందట.
రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి గద్వాల నియోజకవర్గం ధరూరు మండలం ర్యాలంపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ క్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఇద్దరు మంత్రులకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ప్రభుత్వ కార్యక్రమం అనుకుందామన్నా… అది గద్వాల నియోజకవర్గంలో జరిగింది. విజయుడు అలంపూర్ ఎమ్మెల్యే. ప్రోటోకాల్ కూడా కాదు. దీంతో విజయుడు వ్యవహారంపై అనుమానాలతో కూడిన విశ్లేషణలు మొదలయ్యాయి. మరోవైపు అదేరోజు బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రులతోపాటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సైతం కర్ణాటకలోని ఆర్డీఎస్ను సందర్శించారు. జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీపై విమర్శలు చేస్తుండగా… అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాత్రం మంత్రులకు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలకడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే విజయుడు దారి మారిందా..? లేదంటే తన బాస్ చల్లా గైడెన్స్తోనే విజయుడు రూట్ మార్చారా..? అనే చర్చ గద్వాల జిల్లా బీఆర్ఎస్లో జరుగుతోందట. ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనే మంత్రులను కలిశానని విజయుడు వివరణ ఇచ్చుకుంటూ ఉన్నప్పటికీ… తెరవెనక ఏదో జరుగుతోందన్న చర్చలు మాత్రం ఆగడంలేదట.

