OTR : కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ బిగ్ ప్లాన్..? సైలెంట్ వార్ స్టార్ట్!

Brs

Brs

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజా పోరాటాలను కాస్త లేటైనా… లేటెస్ట్‌గా చేయాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోందా? ఆ ప్లానింగ్‌….పద్ధతిగా, శ్రద్ధగా…. మొక్కకు అంటు కట్టినట్టుగా ఉండాలని అధిష్టానం అనుకుంటోందా? అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళ టైం ఉండగా ఇప్పుడు గులాబీ పార్టీ ఆలోచన ఏంటి? పోరాటాల విషయంలో అనుసరించాలనుకుంటున్న ఆ కొత్త పంథా ఎలా ఉండబోతోంది? కొట్టాలి…. గట్టిగా కొట్టాలి…. ఈసారి మాత్రం ఛాన్స్‌ మిస్‌ అవకుండా కొట్టి తీరాలనుకుంటూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్లాన్‌ చేస్తోంది బీఆర్ఎస్‌. ఆ ఊపులోనే…. అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు పావులు కదుపుతోంది. అందుకోసం ఎన్నికల ప్రచారంలో హస్తం నేతలు ఇచ్చిన హామీలు, గ్యారంటీలనే అస్త్రాలుగా వాడాలనుకుంటోందట. అసెంబ్లీ ఎలక్షన్స్‌కు ముందు కాంగ్రెస్‌ నేతలు రకరకాల డిక్లరేషన్స్‌ ప్రకటించగా…. ఇప్పుడు వాటి అమలు కోసం వత్తిడి చేయడంతో పాటు చేయకుంటే ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమ రూపం తీసుకువచ్చేందుకు ప్లానింగ్‌ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే డిక్లరేషన్స్‌ ప్రకటించిందో… ఇప్పుడు అదే ప్రాంతాలకు అక్కడి నుంచే సమరానికి సై అంటోంది గులాబీ దళం. రెండు నెలల క్రితం వరంగల్‌లో రైతు డిక్లరేషన్ సభను అలాగే నిర్వహించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అక్కడే రైతు డిక్లరేషన్‌ను ప్రకటించింది.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు, సీనియర్ నేతలందరూ హాజరైన ఈ సమావేశం బాగా సక్సెస్ అయిందనట్టు బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అయితే అదే ఊపుతో నెలకో సభ పెట్టి…దూకుడుగా ముందుకు వెళ్ళాలని అనుకున్నా… ఆ పని జరగలేదు. ఊపు వచ్చాక ఒక్కసారిగా పార్టీ పెద్దలు ఎందుకు ఆగారో అర్ధంగాక కింది స్థాయిలో బుర్ర గోక్కుంటున్నారు. రైతుల తర్వాత వెంటనే కాంగ్రెస్‌ యూత్‌ డిక్లరేషన్‌ మీద పోరాటం చేయాలని భావించింది బీఆర్ఎస్‌. ఈ నెలలో ఆ సభ నిర్వహిస్తారని మొదట చెప్పినా…. ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అలా ఎందుకంటే… ప్లానింగ్‌ మారింది, డిఫరెంట్‌గా ఉండబోతోందన్నది పార్టీ వర్గాల ఆన్సర్‌. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి తమ దగ్గర ఉన్న ప్రధాన ఆయుధం వారిచ్చిన హామీలు, గ్యారంటీలే అన్నది బీఆర్‌ఎస్‌ భావన. వాటిని అమలు చేయలేదని నిరూపించడమే తమకు ప్రధానం అంటున్నారు గులాబీ సీనియర్స్‌. అలాంటి ఆయుధాన్ని వెంట వెంటనే వాడేస్తే… ఎన్నికల నాటికి వాడకం కోసం ఏమీ మిగలవని, అధికార కాంగ్రెస్‌పై పోరాటానికి వీటిని పద్ధతిగా వాడాలని డిసైడయ్యారట.మొత్తాన్ని ఒకేసారి ఉపయోగించకుండా… మెల్లిగా, టైం చూసి ఒక్కొక్క అస్త్రాన్ని బయటికి తీసి ప్రభుత్వం మీద ప్రయోగించాలనుకుంటున్నట్టు సమాచారం.

×
×
Ad

అందుకే యూత్ డిక్లరేషన్‌పై పోరాటాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఒక డిక్లరేషన్‌పై పోరాట సభకు, మరో దానికి మధ్య కనీసం ఆరు నెలల గ్యాప్‌ ఉంటే బాగుంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అందుకోసమే రైతు డిక్లరేషన్ పై పోరాటం సక్సెస్ అయిన ఈ సమయంలో వచ్చే ఐదారు నెలలు దాని గురించే మాట్లాడుకునేలా చేసి అదే అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని.. తర్వాత యూత్ డిక్లరేషన్, దాని తర్వాత బీసీ డిక్లరేషన్ లాంటి అంశాలను తీసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. ముందు ఒక కార్యక్రమం చేసి… ఆ హీట్‌ తగ్గకుండా జాగ్రత్తపడుతూ… అది కాస్త తగ్గుతుందనుకున్నప్పుడు మరో అస్త్రాన్ని బయటికి తీసి ఆ టెంపోని అలాగే మెయిన్‌టెయిన్‌ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ప్రతిపక్ష పార్టీగా…. ప్రభుత్వం మీద పోరాటానికి కలిసి వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోకూడదన్నది బీఆర్‌ఎస్‌ భావన. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళ సమయం ఉన్నందున ఆరు నెలలకో పెద్ద బహిరంగ సభ పెట్టి డిక్లరేషన్స్‌ మీద పోరాటాలకు సిద్ధమవుతోంది కారు పార్టీ. దాన్ని అలా కొనసాగిస్తే… ఎన్నికల నాటికి బాగా ఉపయోగపడుతుందని లెక్కేలేస్తున్నారు.