Off The Record : గులాబీ బాస్ పోస్ట్ మార్టం.. అసెంబ్లీ ఎన్నికల తప్పులపై BRS సీరియస్ ఫోకస్!

  • గ్రూప్‌వార్‌ 2023లో గట్టి దెబ్బ కొట్టిందన్న రియలైజేషన్‌
  • ఎమ్మెల్యేల మీద కోపంతోనే ఓడిపోయామన్న కేటీఆర్‌
  • కల్వకుర్తిలో ఇద్దరు నేతల మధ్య అప్పుడే టిక్కెట్‌ పోరు
  • కాబోయే ఎమ్మెల్యే అంటూ ఇద్దరు నేతల అనుచరుల హంగామా
Brs

Brs

తప్పు ఏంటో తెలిసింది. ఈసారి అలా జరక్కూడదు. కచ్చితంగా ఇప్పట్నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తోందా? ఆల్రెడీ ఆ దిశగా తెలంగాణ భవన్‌లో కసరత్తు జరుగుతోందా? వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆ పనిలో బిజీగా ఉన్నారా? ఇంతకీ ఏంటా తప్పు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా బీఆర్‌ఎస్‌ ఈసారి ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు 2023లో గట్టి దెబ్బ కొట్టాయని భావిస్తున్న పార్టీ అధిష్టానం ఈసారి ఇప్పట్నుంచే వాటి పరిష్కారంపై దృష్టి పెట్టిందట. నియోజకవర్గాల గొడవలు చినికి చినికి గాలి వానగా మారి హైదరాబాద్‌ తెలంగాణ భవన్ దాకా చేరుతున్నాయి. వాటిని నేరుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిష్కరిస్తున్నారు. ఇదే సందర్బంలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారట.

గత ఎన్నికల్లో కేసీఆర్ మీద ఎవరికీ కోపం లేదని, లోకల్‌ ఎమ్మెల్యేల మీద కోపంతోనే వ్యతిరేక ఓట్లు పడ్డాయని కేటీఆర్ చెబుతున్నారు. మాకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావాలిగానీ… ఎమ్మెల్యే మాత్రం మళ్లీ గెలవకూడదని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు కూడా కోరుకోవడం వల్లే ఓడిపోయామని, ఈసారి అలాంటి పరిస్థితి ఉండకూడదని గొడవలతో తెలంగాణ భవన్‌కు వచ్చిన వారితో కేటీఆర్ చెబుతున్నారట. ఈ క్రమంలో తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకుల జాయినింగ్ కార్యక్రమం తెలంగాణ భవన్లో జరిగింది. అయితే… వచ్చే ఎన్నికల్లో మాకే టిక్కెట్‌ అంటూ ఈ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా ప్రచారం చేసుకుంటున్నారు. కాబోయే ఎమ్మెల్యే అంటూ… తమ అనుచరులతో పోస్టర్లు కూడా పెట్టించుకుంటున్నారు. దీంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.

ఈ గందరగోళ పరిస్థితుల్లోనే… తాజా జాయినింగ్స్‌ సందర్భంగా ఇద్దరు నాయకులకు చురకలంటించారట కేటీఆర్‌. ఇక మీదట ఎవరు గ్రూపు రాజకీయాలు చేసినా సహించేది లేదంటూ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో గ్రూప్‌ రాజకీయాలు చేయడం వల్ల పార్టీ ఎలా నష్టపోయిందో ఉదాహరణలతో సహా చెప్పారట. ఇదే కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న ఆమనగల్ మున్సిపాలిటీలో మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఎక్కువ కౌన్సిలర్‌ సీట్లు గెలిచినా… గ్రూప్‌ పాలిటిక్స్‌ వల్ల చైర్మన్ పదవి దక్కించుకోలేకపోయామని మండిపడ్డారు. అందుకే ఇక మీదట ఎవరు గ్రూపు రాజకీయాలు చేసినా సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారాయన.

అయితే ప్రతిపక్షంలో ఉన్న కారణంగా ఇప్పటికిప్పుడు నియోజకవర్గ నాయకులు ఎవర్నీ వదులుకునే పరిస్థితిలో లేదు బీఆర్‌ఎస్‌. అందుకే ఓవైపు వార్నింగ్‌ ఇస్తూనే….మరోవైపు భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేశారట వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. వచ్చే ఎన్నికల లోపు కచ్చితంగా నియోజకవర్గాల పునర్ విభజన జరుగుతుందని, పార్టీలో ఉన్న ఆశావాహలకు టికెట్లు దక్కుతాయని సర్ది చెప్పినట్టు తెలిసింది. ఇలా చాలా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్స్‌ మాజీ చైర్మన్ ల మధ్య టికెట్ వార్ అప్పుడే మొదలైంది. అందుకే వారిని సంతృప్తి పరిచేందుకు గ్యాప్‌ తగ్గించే ప్రయత్నంలో ఉందట గులాబీ అధిష్టానం.