Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?

  • బెంగాల్‌లో బీజేపీ గెలుపు మీద గతంలో అనుమానాలు
  • మహా అయితే 150 సీట్లు అంటూ విశ్లేషణలు
  • ప్రధాని మోడీ రంగంలోకి దిగాక మారిన సీన్‌
  • అమిత్‌షా మకాం, పకడ్బందీ ఎలక్షనీరింగ్‌
Bjp

Bjp

బెంగాల్‌లో కమలం విరిశాక… కాషాయ దళం నెక్స్ట్‌ టార్గెట్‌ ఏది? బీజేపీ అధిష్టానం తెలంగాణను తన రాడార్‌ పరిధిలోకి తీసుకురాబోతోందా? అంత క్లిష్ట పరిస్థితులున్న బెంగాల్‌లోనే గెలవగలిగినప్పుడు అంతో ఇంతో అనుకూలత ఉన్న తెలంగాణలో ఎందుకు గెలవలేమన్న కాన్ఫిడెన్స్‌ పెరిగిందా? ప్రధాని మోడీ సభతోనే దక్కన్‌ గడ్డ మీద సమర శంఖం పూరించబోతున్నారా? బెంగాల్‌ గెలుపు తర్వాత టీజీ బీజేపీలో జరుగుతున్న చర్చ ఏంటి? పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది. గిరిగీసి బరిలో నిలిచి మరీ… కాషాయ జెండా ఎగరేసింది. బెంగాల్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, సామాజిక సమీకరణలు, ఇతరత్రా వ్యవహారాలు….. ఇలా రకరకాల లెక్కలేసుకుని కోల్‌కతా కోట మీద కాషాయ జెండా ఎగరేయడం అంత తేలిక కాదని భావించారు చాలామంది.

బీజేపీ బాగా…. కష్టపడితే ఓ 150 సీట్లు గెల్చుకోవచ్చన్న విశ్లేషణలే ఎన్నికలకు ముందు ఎక్కువగా ఉండేవి. అంతెందుకు… ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యే వరకు కూడా అక్కడ మళ్ళీ మమతదే అధికారం అన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో బలంగా ఉంది. కానీ… ఎప్పుడైతే ప్రధాని మోడీ ప్రచార రంగంలోకి దిగారో… ఆ తర్వాతి నుంచి పరిస్థితి మారుతూ వచ్చింది. మోడీ విస్తృత ప్రచారం చేయడం, అమిత్ షా అక్కడే మకాం వేయడం, పకడ్బందీగా ఎలక్షనీరింగ్ చేయడం లాంటి వాటితో సీన్‌ మొత్తం ఛేంజ్‌ అయిపోయింది. కమలానికి గెలుపు బాటలు వేసింది. అదే సమయంలో హిందుత్వ అజెండాను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలిగింది బీజేపీ. అన్ని రకాల అస్త్ర శస్త్రాలను ఉపయోగించి బెంగాల్‌ను కొట్టాలనుకున్నారు, కొట్టేశారు.

అయితే… పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయాన్ని చూసిన చాలామందికి ఇప్పుడో కొత్త డౌట్‌ వస్తోందట. అంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నచోటే ఘన విజయం సాధించగలిగినప్పుడు… దాదాపు అనుకూలంగా ఉన్న తెలంగాణలో ఎందుకు నిలదొక్కుకోలేకపోతున్నామంటూ ఇక్కడి పార్టీ నేతల మధ్య చర్చలు మొదలయ్యాయి. అక్కడ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో కేడర్ లేక పోయినా… ప్రతికూల పరిస్థితులు ఉన్నా భారీ మెజారిటీతో పీఠాన్ని కైవసం చేసుకోగలిగినప్పుడు తెలంగాణలో గెలవడం కష్టమేం కాదు కదా… అంటూ కేడర్ సైతం మాట్లాడుకుంటోంది. సరిగ్గా… ఈ డిస్కషన్స్‌ నుంచే కొత్త కొత్త పాయింట్స్‌ బయటికి వస్తున్నాయి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్నట్టు… తెలంగాణలో పరిస్థితులు పార్టీకి అనుకూలంగా ఉన్నా…. ముందు రాష్ట్ర నాయకుల మధ్య సఖ్యత ఉండాలి కదా… అంటూ వాళ్లలో వాళ్ళు నిష్టూరంగా అనుకుంటున్నారట. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌ విజయం తర్వాత ఇక్కడి ముఖ్య నేతల్లో అంతర్మధనం మొదలైనట్టు తెలుస్తోంది. మనోళ్ల మధ్య సఖ్యత కుదిరితే… మనం కూడా గెలవవచ్చన్నది తెలంగాణ బీజేపీ కేడర్‌ లేటెస్ట్‌ వాయిస్‌. ఈ నెల 10న ప్రధాని మోడీ తెలంగాణకు వస్తున్నారు. ఆ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు పార్టీ పరంగా భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది. దీంతో…. ఆ సభ నుంచే వచ్చే ఎన్నికలకు సమర శంఖం పూరించవచ్చన్న అంచనాలున్నాయి.

 

తెలంగాణలో కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా… వచ్చేది బీజేపీనే అని చెప్పేందుకే ప్రధాని వస్తున్నారంటూ రాష్ట్ర పార్టీ వర్గాల మధ్య మాటలు నడుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలవబోతోందన్న ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్ వచ్చాకే అయన తెలంగాణకు టైమ్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. బీజేపీ ఉత్తరాది పార్టీ అనే ముద్రను చెరిపేసుకోవాలంటే…. ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళ ముందున్నవి రెండే ఆప్షన్స్‌. అందులో ఒకటి కర్ణాటక, మరొకటి తెలంగాణ. కానీ… కర్ణాటకలో ప్రస్తుతం జేడీఎస్‌తో పొత్తు ఉంది. దీంతో ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రం తెలంగాణనే అన్నది పార్టీ వర్గాల మాట. అందుకే ఇక నుంచి రాష్ట్రం మీద ఫోకస్‌ పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పశ్చిమ బెంగాల్, ఒడిషా, తెలంగాణలకు సంస్థాగత ఇన్చార్జ్‌. ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణే మిగిలి ఉంది. దీంతో… బన్సల్‌ ఇన్ఛార్జ్‌గా కొనసాగితే ఇక్కడ కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయమన్న మాట పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.