అక్కడ పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చే ప్రయత్నం జరుగుతోందా? ఎన్నికలకు ముందు ఇద్దరు మిత్రులు కొట్టుకుని తమ ప్రత్యర్థికి ఛాన్స్ ఇచ్చారా? ఇప్పుడు ఆ ప్రత్యర్థే కీలకంగా మారి….. అయితే నా కేంటి అంటూ ప్రశ్నిస్తోందా? ఎవరా మిత్రులు, వాళ్ళ ప్రత్యర్థి? మేయర్ సీటు చుట్టూ ముసురుకుంటున్న రాజకీయ వివాదమేంటి? భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో సిపిఐ, కాంగ్రెస్ మిత్ర పక్షాలన్నది మొన్నటి మాట. పంచాయతీ ఎన్నికల నుంచి సీన్ మారిపోయింది. ప్రస్తుతం మిత్ర భేదం తారా స్థాయికి చేరింది. అది అలా కొనసాగుతుండగానే… మున్సిపల్ పోరు ముగిసిపోయింది. ఇద్దరూ విడివిడిగా పోటీ చేస్తే…. ఎవరికీ సరిపడా మెజార్టీ రాలేదు. ఇప్పుడు మధ్యలోకి కారు పార్టీ ఎంట్రీతో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. దీంతో ఎవరు ఎవరికి మిత్రులు, ఎవరికి శత్రువు అన్న చర్చలు మొదలయ్యాయి కొత్తగూడెంలో. ఇక్కడ ఎమ్మెల్యేగా సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఉన్నారు. అప్పుడు ఆయనకు కాంగ్రెస్ మద్దతిచ్చింది. అయితే జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే… అందులో నలుగురు మంత్రి పొంగులేటి ముఖ్య అనుచరులే. మిగతా చోట్లలాగే… గూడెంలో కూడా తన పట్టు ఉండాలని భావించారట పొంగులేటి.
అందుకే అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టారన్నది ఒక వెర్షన్. ఈ క్రమంలో…. పోలీసు అధికారుల బదిలీల నుంచి వివిధ వ్యవహారాల్లో ఎమ్మెల్యే కూనంనేనికి, మంత్రి పొంగులేటికి మధ్య గ్యాప్ పెరిగినట్టు చెప్పుకుంటారు. ఒకే రోజు ఇద్దరు డీఎస్పీలకు పొంగులేటి పోస్టింగ్స్ తీసుకువస్తే…వాటిని ఆపేయించారట కూనంనేని. రెండేళ్ళ క్రితం జరిగిన ఆ ఎపిసోడ్తో అగాధం మరింత పెరిగిందని అంటారు. అలా ఎవరికి వారు కొత్తగూడెం మీద పట్టుకోసం ప్రయత్నిస్తుండగానే…. పంచాయతీ ఎన్నికలు జరిగిపోయాయి. ఆ ఎలక్షన్స్లో రెండు పార్టీలు వేర్వేరుగా బరిలో దిగాయి. కొత్తగూడెం అంటేనే… సిపిఐకి అడ్డా అని చాటాలన్నది ఎమ్మెల్యే అభిలాష. కానీ… భద్రాద్రి జిల్లా మొత్తం తనదే అన్నట్లుగా ఉంటుంది పొంగులేటి వ్యవహార శైలి. అందుకే పంచాయతీ ఎన్నికల్లో హోరా హోరీగా ప్రచారం చేశాయి ఇరు వర్గాలు. తన వియ్యంకుడు, ఎంపీ రఘురామిరెడ్డిని కొత్తగూడెంలో ఉంచి మరీ పావులు కదిపారు మంత్రి. అయితే… పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవుగనుక రెండు పార్టీలు మాకంటే మాకే ఎక్కువ సీట్లు వచ్చాయని చెప్పుకుంటున్నాయి. ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అదే వైరం కొనసాగింది. సీట్ల సర్దుబాటు కోసం పలుమార్లు చర్చలు జరిగినా… విఫలమై చివరికి విడి విడిగానే పోటీ చేశారు. ఆశ్చర్యంగా రెండు పార్టీలు చెరో 22 డివిజన్స్ని గెల్చుకున్నాయి. దీంతో మేయర్ పీఠంపై పీటముడి పడింది.
సరిగ్గా ఇక్కడే బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఆ పార్టీకి 8 మంది కార్పొరేటర్స్ ఉండగా… వాళ్ళతో పాటు ఇండిపెండెంట్ని కలుపుకుంటే… సీపీఐ బలం 31కి పెరుగుతుంది. అప్పుడు లైన్ క్లియర్ అయిపోతుంది. ఈ లెక్కలే కాంగ్రెస్ని కంగారు పెడుతున్నాయట. అసలు బీఆర్ఎస్కు అన్ని సీట్లు రావడానికి కారణం కూడా ఈ ఇద్దరు మిత్రుల మధ్య ఉన్న విభేదాలేనన్నది లోకల్ టాక్. అసలు జిల్లా మొత్తం మీద బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వచ్చింది కూడా ఇక్కడే. ఆ సంగతి ఎలా ఉన్నా….ఇప్పుడు సీపీఐ, బీఆర్ఎస్ ఒక్క తాటి మీదికి రాకుండా చేయడమే కాంగ్రెస్ ముందున్న అతిపెద్ద టాస్క్ అంటున్నారు. రాజీ కోసం కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే… మేయర్ పీఠం విషయంలో సీపీఐ చాలా క్లియర్గా ఉందట. తమతో కాంగ్రెస్ కలిసివచ్చినా, బీఆర్ఎస్ ఓకే అన్నా… మెయిన్ సీటు మాత్రం మాదేనంటున్నారు కామ్రేడ్స్. ఈ క్రమంలో పెద్దల బుజ్జగింపులకు లోకల్ కాంగ్రెస్ లీడర్స్ సెట్ అవుతారా లేక మేయర్ పదవి కోసం ఎన్నిక దాకా వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే కూనంనేని ఎవరికి వారు ఇగోలకు పోవడం వల్లే పరిస్థితి ఇంతదాకా వచ్చిందని అంటున్నారు రెండు పార్టీల కార్యకర్తలు. వోవరాల్గా కొత్తగూడెం మేయర్ కుర్చీపై సస్పెన్స్ మాత్రం పెరుగుతోంది. ఫైనల్గా ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.
