OTR : నరసాపురం టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే మాస్టర్ ప్లాన్?

Madhav Naidu

Madhav Naidu

అసెంబ్లీకి వెళ్ళే దారేది…? టార్గెట్‌ చేరుకునే తీరేది… అంటూ ఆ మాజీ ఎమ్మెల్యే స్కెచ్‌లు రెడీ చేసుకుంటున్నారా? ప్రస్తుతం టీడీపీలో ఉన్నా… ఆ రోజుకు ఎవరు టిక్కెట్‌ ఇస్తే వాళ్ళే మనోళ్ళు అనుకుంటున్నారా? నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అస్సలు బతిమాలుకోవాల్సిన పనేలేదు, టిక్కెట్‌ వచ్చి ఒళ్ళో వాలిపోతుందని భావిస్తున్నారా? ఎవరా ఎక్స్ ఎమ్మెల్యే? ఆయన వేసుకుంటున్న కులాల లెక్కలేంటి? 2014 ఎన్నికల్లో నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బండారు మాధవ నాయుడు. తిరిగి 2019లో పోటీ చేసి ఓడిపోయాక… కొంతకాలం యాక్టివ్‌గా ఉన్నారాయన. ఇక 2024లో పోటీ చేయాలని అనుకున్నా… కూటమి పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు వెళ్లడంతో మాధవ నాయుడి ఆశ నెరవేరలేదు. ఇక అప్పటి నుంచి పూర్తిగా సైలెంట్ అయ్యారాయన. కానీ… ఇప్పుడు ఆలస్యం అమృతం విషం అనుకున్నారో ఏమోగానీ…. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బరిలో దిగాలనుకుంటూ… ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈసారి టిక్కెట్‌ కోసం మాజీ ఎమ్మెల్యే ఇప్పట్నుంచే తెర వెనుక మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. అయితే… గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన నరసాపురం నియోజకవర్గం ఇప్పుడు జనసేన కింద ఉన్నందున వచ్చే ఎన్నికల్లో కూడా అదే కోటాలోకి వెళ్తుందా లేక టీడీపీకి అవకాశం దక్కుతుందా అన్న అయోమయంలో ఉన్నారట బండారు. ఇదే సమయంలో అసలు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలా లేక ఇక్కడ కాకుంటే అవకాశం ఇచ్చే మరో పార్టీ వైపు అడుగులు వేయాలా అని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత మాధవనాయుడు పార్టీ కార్యక్రమాలకు దూరం జరగడంతో ఆయన స్థానంలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కొత్తూరు రామరాజును ఇన్ఛార్జ్‌గా నియమించింది టీడీపీ అధిష్టానం. ఈ నిర్ణయం వెనుక పార్టీ సీనియర్ లీడర్, MLC షరీఫ్ ప్రమేయం ఉందట.

ఈ క్రమంలో యాక్టివ్‌ పాలిటిక్స్‌కు మాజీ ఎమ్మెల్యే దూరం అయినట్టు చెప్పుకుంటున్నారు. నరసాపురం ఏటిగట్టు నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలు, జిల్లా కేంద్రం తరలిపోవడం వంటి విషయాల్లో తన మార్క్ రాజకీయం చూపించిన బండారుపై పార్టీ పెద్దల్లో సానుకూల అభిప్రాయమే ఉందన్నది ఆయన వర్గం చెబుతున్న మాట. ప్రస్తుతం నరసాపురం అసెంబ్లీ పరిధిలో… టిడిపి నుంచి ఇన్చార్జి రామరాజు, జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ , వైసిపి ఇన్చార్జ్ ముదునూరి ఏ ఒక్కరూ కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాకపోవడంతో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కుతుందని లెక్కలు వేస్తున్నారట బండారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉన్న ఏ చిన్న ఛాన్స్‌ని కూడా వదలకుండా మాజీ ఎమ్మెల్యే వెతుక్కుంటున్నట్టు సమాచారం. వేరే పార్టీ ఆలోచన మనసులో ఉన్నా…. వీలైనంత వరకు టిడిపిలోనే కొనసాగుతూ… పార్టీ పెద్దలను మెప్పించి టికెట్ తెచ్చుకుంటారని చెబుతున్నారు ఎక్స్‌ ఎమ్మెల్యే సన్నిహితులు. అలాగే… నియోజకవర్గాల పునర్విభజన జరిగితే…దానంతట అదే సీటు తన్నుకుంటూ వస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎక్కడా తొందరపడకుండా… ఎటువైపు అవకాశాలు ఉన్నాయో జాగ్రత్తగా లెక్కలేసుకుంటూ అడుగేయాలన్న ఆలోచనలో ఉన్నారట మాజీ ఎమ్మెల్యే. ఇదే సమయంలో నరసాపురం సీటు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా తక్కువేం కాదు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుతో పాటు ప్రస్తుత టిడిపి ఇన్చార్జ్‌ పొత్తూరు రామరాజు, ఎప్పటి నుంచో ఈ సీటు మీద కన్నేసిన ఎన్ఆర్ఐ కొవ్వలి నాయుడుతో సహా అనేకమంది కూటమి తరపున ప్రయత్నాలకు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అటు కూటమి దెబ్బతో అవకాశాలు కోల్పోయిన టిడిపి మాజీ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో అయినా ఆశించిన అవకాశాలు దక్కుతాయో లేదోనన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలన్న సూత్రం బండారు విషయంలో ఎంతవరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి.