కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై తెలంగాణ బీజేపీ ఎంపీలు బాగా కోపంగా ఉన్నారా? ఆయనేంటి…? ఆ మాటలేంటి…? అంటూ భగ్గుమంటున్నారా? అసలాయన్ని అలా ఎవరు మాట్లాడమన్నారు? మా ప్లాన్స్ను దెబ్బకొడితే ఎలాంగటూ మండిపోతున్నారా? అసలింతకీ… ఏం చేశారు పెమ్మసాని? కాషాయ లోక్సభ సభ్యులకు ఎంకుకు కోపం వచ్చింది?
వచ్చే ఎన్నికల్లో గట్టిగా కొట్టి…తెలంగాణలో పాగా వేయాలన్న పట్టుదలగా ఉంది బీజేపీ అధినాయకత్వం. అందుకోసం అంది వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు పార్టీ రాష్ట్ర నాయకత్వం. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఏ నిధులు మంజూరైనా, ఇతరత్రా ఎలాంటి లబ్ది చేకూరినా…కచ్చితంగా అది కమలం ఖాతాలో పడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలానా లబ్ది చేకూరబోతోందన్న సంగతి ముందే పసిగట్టి దానికి సంబంధించి కేంద్ర మంత్రులను కలవడం, వినతి పత్రాలు ఇవ్వడం లాంటివి సైతం జరుగుతున్నాయంటున్నారు. ఉదాహరణకు తాడిచర్ల బొగ్గు గనిని తెలంగాణకు, సింగరేణికి కేటాయించడానికి ముందు మంత్రి కిషన్రెడ్డి బాగా హడావిడి చేశారు.
పార్టీగా బీజేపీ కూడా దాన్ని బాగా ప్రమోట్ చేసింది. దాని ద్వారా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అదనపు ధాన్యం కొనుగోలు విషయంలో కావొచ్చు, ఎయిర్పోర్ట్ల అభివృద్ధి కావచ్చు… అంశం ఏదైనాసరే… కేంద్రం నుంచి రాష్ట్రానికి రూపాయి వస్తోందంటే… దాన్ని రాజకీయంగా రెండు రూపాయలకు ఎలా క్యాష్ చేసుకోవచ్చన్న ప్లాన్లోనే ఉంది కాషాయదళం. ఆ క్రమంలోనే… బీజేపీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఢిల్లీ వెళ్ళడం, కేంద్ర మంత్రులను కలవడం జరుగుతున్నాయి.
ఇక తాజాగా ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద తెలంగాణకు దాదాపు రెండు లక్షల ఇళ్ళు మంజూరు చేసింది సెంట్రల్ గవర్నమెంట్. దీంతో… ఆ వ్యవహారాన్ని బాగా ప్రమోట్ చేసుకుని…తెలంగాణ పేద ప్రజల కోసం కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎంతగా పరితపిస్తోందో చెప్పాలనుకున్నారట. అందులో భాగంగానే… ఆ ప్రకటన వెలువడక ముందే…రాష్ట్రంలోని పార్టీ ఎంపీలంతా కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ను కలవాలని అనుకున్నట్టు తెలిసింది. ఆ రెండు లక్షలకు అదనంగా మరికొన్ని ఇళ్ళను కూడా ఇవ్వాలని కోరాలనుకున్నారట. హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకుని, ఇక ఎక్కేయడమే తరువాయి అనుకుంటున్న టైంలో… ఎంపీలకు గట్టి షాక్ తగిలింది. వాళ్ళు ఢిల్లీ వెళ్ళక ముందే… కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇళ్ళ వివరాలు ప్రకటించేశారు. ప్రధాన మంత్రి ఆవాస్యోజన స్కీమ్ కింద కేంద్రం ఆంధ్రప్రదేశ్కు మూడు లక్షలు, తెలంగాణకు రెండు లక్షల ఇళ్ళు కేటాయించిందంటూ చెప్పేశారాయన. ఆ ప్రకటనతో తెలంగాణ బీజేపీ నాయకులు కంగుతిన్నారట. ఒకరిద్దరైతే ఆగ్రహంతో ఊగిపోయినట్టు తెలిసింది.
మనం అనుకుంటున్నదేంటి? ఆయన చేసిందేంటి? అంటూ సహచరులతో సీరియస్గా అన్నట్టు తెలిసింది. అంతగా చెప్పుకోవాలనుకుంటే… ఆయన సొంత రాష్ట్రానికి సంబంధించిన వివరాలు చెప్పుకోవాలేగానీ… మన వ్యవహారంలో వేలుపెట్టి క్రెడిట్ రాకుండా చేస్తారా అంటూ భగ్గుమన్నట్టు సమాచారం. ఎంత కేంద్ర మంత్రి అయితే మాత్రం…. ఏపీ వివరాల వరకు వెల్లడించి వదిలేస్తే… తెలంగాణ డిటైల్స్ మొత్తం మనం చెప్పి కమలం ఖాలాతో వేసే వాళ్ళం కదా అంటూ కోపంగా ఉన్నారట. పెమ్మసాని ప్రకటన తర్వాత… ఇక మనం ఢిల్లీ వెళ్ళి చేసేదేముంది అంటూ ఫ్లైట్ టిక్కెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలిసింది. టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు ఆయన ఇలా చేయడం కరెక్టేనా? తెలంగాణలో మా అవసరాలు, ప్రాధాన్యతల్ని గుర్తించకుండా… తన ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు ఇచ్చేస్తే ఇక్కడ మా రాజకీయ అవసరాల సంగతేంటని అడుగుతున్నట్టు సమాచారం. మొత్తం మీద పెమ్మసాని ప్రకటనతో మిత్రపక్షాల మధ్య క్రెడిట్ వార్ మొదలైనట్టు కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

