కూటమి ధర్మం అంటే…. అక్కడి టీడీపీ ఇన్ఛార్జ్కు అస్సలు గిట్టదా? వాళ్ళేదో వస్తుంటారు, పోతుంటారు…. నేను ఇక్కడే పర్మినెంట్ అంటూ చంటిగాడు లోకల్ అన్న సినిమా డైలాగ్ని గుర్తు చేస్తున్నారా? పొత్తులో సీటిచ్చారు, గెలిచారు…. అంతవరకే మీ రోల్ తప్ప నియోజకవర్గంలో పెత్తనం చేస్తామంటే నడవదని జనసేనకు గిరి గీస్తున్నారా? లోకల్ ఎన్నికల్లో గ్లాస్కు ఒక్క సీటిచ్చినా గెలవదంటూ ఏకంగా చంద్రబాబుకే రిపోర్ట్ ఇచ్చిన ఆ ఇన్ఛార్జ్ ఎవరు? ఏంటా కథ?
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బూరుగుపల్లి శేషారావు వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదంగా మారుతోందట. నేను పక్కా లోకల్ అన్నట్టు ఆయన ప్రవర్తిస్తున్న తీరు మిత్రపక్షం జనసేనకు అస్సలు మింగుడు పడ్డం లేదని అంటున్నారు. అసలు నిడదవోలు ఎమ్మెల్యే ఎవరో అర్ధం కావడంలేదన్న చర్చలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు జనసేన నాయకులు. పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో జనసేన కోటాలోకి వెళ్ళింది ఈ సీటు. ఆ పార్టీ తరపున కందుల దుర్గేష్ ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఊపులో ఆయనకు కేబినెట్ బెర్త్ కూడా దక్కింది. అంతవరకు బాగానే ఉన్నా… దుర్గేష్ నిడదవోలు రావడం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు అస్సలు ఇష్టం లేదట. అందుకే… ఆయన మంత్రి అయితే నాకేంటి? ఎప్పటికైనా నిడదవోలు నాదే అన్నట్టు వ్యవహరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకు తగ్గట్టే శేషారావు తెలుగుదేశం ప్రోగ్రామ్స్కు మాత్రమే పరిమితం అవుతూ… కూటమి వ్యవహారాలకు పూర్తి దూరంగా ఉంటున్నారన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. మంత్రి హోదాలో దుర్గేష్ నియోజకవర్గ అభివృద్ధికి గట్టిగానే నిధులు తీసుకువచ్చి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు స్వయంగా ఆహ్వానిస్తున్నా… డోంట్ కేర్ అంటున్నారట శేషారావు.
ఇటీవల నిడదవోలులో జరిగిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభకు తాను వెళ్ళకపోవడంతో పాటు… ఇతర టీడీపీ నాయకులు కూడా ఎవ్వరూ వెళ్ళకుండా బూరుగుపల్లి అడ్డుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే… ఆయన మాత్రం ప్రభుత్వ కార్యక్రమాలకు తనను పిలవటం లేదని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అటు వైసీపీ ఆధీనంలో ఉన్న నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని ఆ మధ్య జనసేన దక్కించుకుంది. ప్రతిపక్షానికి చెందిన కౌన్సిలర్లు 18 మంది రాజీనామా చేసి జనసేనలో చేరడంతో ఛైర్మన్ పదవి గ్లాస్ పార్టీకి దక్కింది. దీంతో… రాష్ట్రంలో జనసేన సాధించిన తొలి మున్సిపాలిటీగా నిడదవోలు రికార్డులకెక్కింది. శేషారావుకు అది కూడా ఇష్టం లేదట. నాడు వార్డుల్లో టీడీపీ వాళ్ళను ఓడించి గెలిచిన వైసీపీ కౌన్సిలర్స్ను జనసేనలో ఎలా చేర్చుకుంటారన్నది ఆయన అభ్యంతరం. ఇది కూటమి ధర్మానికి విరుద్ధమని కూడా విమర్శించారాయన. అంతకు ముందు ఏదో… అలా అలా ఉన్నా… అసలు ఇక్కడి నుంచే టీడీపీ, జనసేన మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయని అంటారు. ఇక త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో… నిడదవోలు ఛైర్మన్ టికెట్టు జనసేనకు దక్కకుండా శేషారావు ఇప్పట్నుంచే పావులు కదుపుతున్నారట. ఈ మేరకు టిడిపి అధిష్టానానికి కూడా ఒక అర్జీ పెట్టినట్టు తెలిసింది. మున్సిపల్ చైర్మన్ టిక్కెట్టు టిడిపికి కేటాయించకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని తన ఫిర్యాదులో రాసినట్టు సమాచారం. అంత పట్టుదల ఎందుకని అంటే… ఇప్పుడు గనుక మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని వదులుకుంటే…. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కనీసం టిక్కెట్ అడిగే ఛాన్స్ కూడా ఉండదన్నది మాజీ ఎమ్మెల్యే లెక్కగా చెప్పుకుంటున్నారు.
ఈసారి తనకు టిక్కెట్టు రావాలంటే మంత్రి దుర్గేష్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం తప్ప మరో మార్గం లేదని ఆయన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో తనకు టిక్కెట్టు రాక పోవడానికి జనసేనే కారణం అంటూ ద్వేషం పెంచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక టీడీపీ సోషల్ మీడియా వింగ్లోని తన అనుచరుడు ఒకరి ద్వారా
శేషారావు మంత్రికి వ్యతిరేకంగా పోస్టింగ్స్ పెట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి జనసేన నాయకులు నిడదవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కూడా.
అదే సమయంలో మంత్రి బెదిరింపులకు భయపడి సదరు యువకుడు మిస్ అయ్యాడంటూ మరో ఫిర్యాదు కూడా నమోదైంది. కట్ చేస్తే… సదరు సోషల్ మీడియా ప్రతినిధి అమరావతి టిడిపి కార్యాలయంలో ఉన్నట్లు నిర్ధారణ కావడంతో కేసు కొట్టేశారు పోలీసులు. మరోవైపు డ్వాక్రా మహిళలకు కేటాయించిన మూడు ఇసుక ర్యాంపులపై పెత్తనం చేయాలని చూశారట శేషారావు. అది కుదరకపోవడంతో ఆ మూడు ర్యాంపులపై గనులు శాఖ అధికారులతో దాడులు చేయించారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలి మారిపోవడంతో కొంతమంది సొంత పార్టీ నాయకులే దూరంగా ఉంటున్నారట. అలాగే… ఆయన తీరు గురించి జనసేన నేతలు కూడా తమ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
జనసేన ముఖ్యులు ఇదే మేటర్ని టీడీపీ పెద్దల చెవిన వేసినట్టు సమాచారం. ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా శేషారావు టీడీపీ పెద్దలకు ఒక విషయం చెప్పారట. మున్సిపాలిటీలో జనసేనకు ఒక్క వార్డు కేటాయించినా గెలిచే పరిస్థితి ఉండదంటూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు నినేదిక ఇచ్చినట్టు సమాచారం. అయితే… ఇక్కడే కొందరికి కొత్త డౌట్స్ వస్తున్నాయి. జనసేన గెలవదని అంటున్నారంటే….వాస్తవంగా బలం లేకనా? లేదా… ఇస్తే తానే ఓడిస్తానని పరోక్షంగా చెబుతున్నారా అన్నది అసలు సందేహం.

