OTR: సామేల్‌కు చెక్ పెట్టడానికే సోమన్న ప్రస్తావన? కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యూహం ఇదేనా?

Otr2

Otr2

పంతం… నీదా… నాదా… సై. ఇంతదాకా వచ్చాక ఇంకెందుకు…? తేల్చుకుందాం. లెక్క సెట్‌ అయిపోవాల్సిందేనని ఆ సీనియర్‌ ఎమ్మెల్యే అంటున్నారా? ఇటీవల తనతో ఢీ అంటే ఢీ అన్న సహచర శాసనసభ్యుడికి చెక్‌ పెట్టాలని ఫిక్స్‌ అయ్యారా? ఆ దిశగా ఆపరేషన్‌ ఆల్రెడీ మొదలైపోయిందా? నిన్ను ఎమ్మెల్యేని చేస్తానని ఓ గాయకుడికి భరోసా ఇవ్వడం వెనకున్న వ్యూహం ఏంటి? ఎవరా ఇద్దరూ? ఏంటా సవాల్‌ స్టోరీ?

రవీంద్ర భారతి వేదిక మీద నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రత్యేకించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్త చర్చకు దారి తీశాయి. ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్నను ఎమ్మెల్యేని చేస్తానంటూ రాజగోపాల్ రెడ్డి ప్రకటించడం వెనక వ్యూహం ఏమై ఉంటుందా అన్న చర్చలు మొదలైపోయాయి. అందు కోసం మునుగోడు ఎమ్మెల్యే ఇప్పటి నుండే వర్కవుట్ చేసేపనిలో ఉన్నారా అన్న సందేహాలు సైతం చాలా మందికి వస్తున్నాయట. తుంగతుర్తిలో సోమన్నను బరిలోకి దింపే ప్రణాళిక ఉందా అన్న ఆరాలు సైతం పెరిగిపోతున్నాయి. సాధారణంగా కోమటిరెడ్డి బ్రదర్స్ టార్గెట్ చేస్తే… ఏదో ఒకటి తేలే వరకు ఊరుకోరన్న అభిప్రాయం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ఇప్పుడు తుంగతుర్తి ఎపిసోడ్‌లో రాజగోపాల్‌రెడ్డి కూడా అదే పట్టుదలగా ఉన్నారా అన్నది కొన్ని వర్గాల్లో ఉన్న డౌట్‌. తుంగతుర్తి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సామేల్‌కు, కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మధ్య ఇటీవల మాటల యుద్ధం జరిగింది. పంచాయతీ మొదట్లో స్పందించారు, ఆ తర్వాత మానేశారు. చివరిగా తుంగతుర్తి ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ ఎపిసోడ్‌ని ముగించారు రాజగోపాల్ రెడ్డి. ఈ క్రమంలో… ఇప్పుడు సోమన్నను ఎమ్మెల్యేని చేస్తానంటూ అనూహ్యంగా ప్రకటించారాయన. తుంగతుర్తి నియోజక వర్గం నుండి పోటీ చేయాలని, పాట గాడిగా… అసెంబ్లీలో అడుగుపెట్టాలన్నది ఏపూరి సోమన్న కోరిక. గతంలో ఆయన Ys షర్మిలతో కలిసి రాజకీయ ప్రయాణం చేసింది కూడా అందుకే. అప్పుడు తేడాపడ్డా… ఇప్పుడు మళ్ళీ రాజగోపాల్‌రెడ్డి రూపంలో తుంగతుర్తి ద్వారాలు తెరుచుకున్నాయంటున్నారు.

ఎవరు ఔనన్నా… కాదన్నా… ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం అయినాసరే… తుంగతుర్తిలో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి బలం, బలగం ఉన్నాయి. దీనికి తోడు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి క్యాడర్ కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో నల్గొండ జిల్లా నాయకుల మధ్య ఎలాంటి ఘర్షణలు…అభిప్రాయ భేదాలు ఉన్నా … రాజకీయంగా ఒకసారి డిసైడ్ ఐతే.. అంతా ఒక్కటిగా పని చేస్తారు. దాంట్లో భాగంగానే.. రాజగోపాల్ రెడ్డి… తుంగతుర్తి నుంచి ఏపూరి సోమన్నను బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే రవీంద్ర భారత్ వేదికగానే…ఎమ్మెల్యేని చేస్తానని ప్రకటించినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాన్ని ప్రస్తావించకున్నా… నా చేతుల మీద గెలిచిన వాళ్ళే నాకు కాకుండా పోతున్నారంటూ హింట్ ఇచ్చారాయన. దీన్నిబట్టి చూస్తుంటే… రాజగోపాల్ రెడ్డి ఆపరేషన్ మొదలు పెట్టినట్టే కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.